శ్రీనివాసన్ పుణ్యమే | srinivasan spoke to the media about india team changes | Sakshi
Sakshi News home page

శ్రీనివాసన్ పుణ్యమే

Jan 31 2014 1:22 AM | Updated on Sep 4 2018 5:07 PM

శ్రీనివాసన్ పుణ్యమే - Sakshi

శ్రీనివాసన్ పుణ్యమే

ఐసీసీలో మార్పుల గురించి ప్రపంచ క్రికెట్‌లో పెద్ద దుమారమే రేగుతోంది. మాజీ క్రికెటర్లంతా కొత్త ప్రతిపాదనలు వ్యతిరేకిస్తున్నారు.

సాక్షి, హైదరాబాద్: ఐసీసీలో మార్పుల గురించి ప్రపంచ క్రికెట్‌లో పెద్ద దుమారమే రేగుతోంది. మాజీ క్రికెటర్లంతా కొత్త ప్రతిపాదనలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి శ్రీనివాసన్... భారత్ వైఖరి గురించి, ఐసీసీలో మార్పుల గురించి మీడియాతో మాట్లాడారు.
 
 ఈ మార్పుల ఆలోచన శ్రీనివాసన్‌దేనని, దీనివల్ల భారత్‌తో పాటు ప్రపంచ క్రికెట్‌లో కూడా ఆదాయం పెరుగుతుందని ఆయన చెప్పారు. పటేల్ చెప్పిన వివరాలు ఆయన ఆటల్లోనే..
 అది మన హక్కు: ఆట విషయంలో గానీ, ఆర్థి కాంశాల విషయంలో గానీ ఎన్నో ఏళ్లుగా భారత్‌దే పెద్ద పాత్ర. కాబట్టి వాటిలో వాటా కోరడం మన హక్కు. దురదృష్టవశాత్తూ గత  బీసీసీఐ నాయకత్వంలో దీనిపై ఎవరూ దృష్టి పెట్టలేదు.
 
 శ్రీనివాసన్ ఆలోచన: ప్రస్తుత అధ్యక్షులు శ్రీనివాసన్ పూర్తిగా అన్ని అంశాలను అధ్యయనం చేసిన తర్వాత ఈ ప్రతిపాదనలు తెచ్చారు. వీటిని రూపొందించేందుకు ఆయన నేతృత్వంలోని బృందం తీవ్రంగా శ్రమించింది.
 
 అధికారం కోసం కాదు: కొత్త ప్రతిపాదనల గురించి అనవసరపు అపోహలు ఉన్నాయి. మేం వాస్తవిక దృష్టిలో దీనిని రూపొందించాం. పవర్ గేమ్ ఆడుతున్నామని మా గురించి చెబుతున్నారు. అయితే ఇది అధికారానికి సంబంధించిన విషయం కాదు. మా మూడు పెద్ద దేశాలనుంచి ఎవరో ఒకరు ఐసీసీని నడిపించాల్సిన అవసరం ఉంది. ఆటలో, ఆదాయంలో భారత్ పాత్ర ఏమిటనేది అందరికీ తెలుసు. ఆర్థికంగా కూడా మాకు ఏది దక్కాలో అదే కోరుతున్నాం. అంతా అనుకున్నట్లే జరుగుతుందని మేం నమ్ముతున్నాం.
 
 అది నిరసన కాదు: కొత్త ప్రతిపాదనలపై స్వేచ్ఛగా చర్చించేందుకు అందరికీ అవకాశం ఇచ్చాం. ఒక్క పాకిస్థాన్ మినహా అందరూ దీనిని ఒప్పుకుంటారు. ఒక్కరి కోసం మేం ఆపాల్సిన అవసరం లేదు. ఇన్నాళ్లూ ఐసీసీ నుంచి అన్ని దేశాలకు ఏం లభిస్తుందో, ఇకపై కూడా అదే లభిస్తుంది.
 
 ఐసీసీలో బీసీసీఐ ఆధిపత్యం: అలాంటిదేమీ లేదు. మేం ఐసీసీ ఆదాయంలో అడుగుతున్న వాటా న్యాయమైనదే. భారత్ నుంచి 60 నుంచి 70 శాతం ఆదాయం వస్తోంది. కానీ ఐసీసీ నుంచి మనకు తిరిగి 4 శాతం మాత్రమే వచ్చేది. ఇది న్యాయం కాదు. ఆదాయాన్ని ఇస్తున్న దేశానికి ఎక్కువ వాటా రావాలి. ఇకపై అలా జరుగుతుంది. అలాగే ఐసీసీ ఆదాయం కూడా కొత్త ప్రతిపాదనల వల్ల కచ్చితంగా పెరుగుతుంది.
 
 టెస్టుల కోసం నిధి: టెస్టు క్రికెట్ ఆదాయ వనరు కాదు. కానీ అది ఆటలో భాగం. భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాను మినహాయించి మిగిలిన దేశాలు టెస్టులు ఆడినా నష్టపోకుండా ఉండేలా ప్రత్యేక నిధిని కేటాయిస్తాం. ఇంటర్ కాంటినెంటల్ కప్‌లో విజేతగా నిలిచిన జట్టుకు టాప్-10 దేశాలతో ఆడే అవకాశం దక్కుతుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement