బోపన్న-సాకేత్ జంటకు షాక్ | rohan bopanna team got shock | Sakshi
Sakshi News home page

బోపన్న-సాకేత్ జంటకు షాక్

Jul 19 2015 12:43 AM | Updated on Sep 3 2017 5:45 AM

బోపన్న-సాకేత్ జంటకు షాక్

బోపన్న-సాకేత్ జంటకు షాక్

కచ్చితంగా గెలుస్తారనుకున్న చోట భారత పురుషుల టెన్నిస్ జట్టుకు మరో షాక్ తగిలింది.

కివీస్ జోడీ చేతిలో అనూహ్య ఓటమి
 భారత్ 1-2తో వెనుకంజ     
 నేటి రివర్స్ సింగిల్స్ కీలకం

 
 క్రైస్ట్‌చర్చ్: కచ్చితంగా గెలుస్తారనుకున్న చోట భారత పురుషుల టెన్నిస్ జట్టుకు మరో షాక్ తగిలింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న డేవిస్ కప్ ఆసియా ఒషియానియా గ్రూప్-1 పోటీలో భాగంగా డబుల్స్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న-సాకేత్ మైనేని (భారత్) జోడీకి ఊహించని ఓటమి ఎదురైంది. శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో బోపన్న-సాకేత్ ద్వయం 3-6, 6-7 (1/7), 3-6తో ఆర్తెమ్ సితాక్-మార్కస్ డానియల్ (న్యూజిలాండ్) జంట చేతిలో ఓడిపోయింది.
 
 గంటా 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కివీస్ ద్వయం ఏదశలోనూ భారత్ జోడీకి పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. ఈ పరాజయంతో భారత్ 1-2తో వెనుకబడింది. వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలకు అర్హత సాధించాలంటే ఆదివారం జరిగే రెండు రివర్స్ సింగిల్స్‌లలో భారత ఆటగాళ్లు తప్పనిసరిగా గెలవాల్సిందే. తొలి మ్యాచ్‌లో జోస్ స్థాతమ్‌తో సోమ్‌దేవ్; మైకేల్ వీనస్‌తో యూకీ బాంబ్రీ తలపడతారు.
 
 బోపన్న-సాకేత్ జంటకు డేవిస్ కప్‌లో ఇదే తొలి ఓటమి. గతంలో ఈ జంట కొరియా, చైనీస్ తైపీలతో జరిగిన మ్యాచ్‌ల్లో గెలిచింది. డేవిస్ కప్‌లో మూడేళ్ల తర్వాత భారత జంటకు ఎదురైన ఓటమి ఇదే కావడం గమనార్హం. 2012లో డెనిస్ ఇస్టోమిన్-మురాద్ ఇనోయతోవ్ (ఉజ్బెకిస్థాన్) జోడీ చేతిలో బోపన్న-లియాండర్ పేస్ జంట ఓటమి చవిచూసింది.
 ఆజానుబాహులైన బోపన్న, సాకేత్‌లు భారీ సర్వీస్‌లతో హడలెత్తిస్తారని భావించినా అలా జరగలేదు. కేవలం ఐదు ఏస్‌లు సంధించిన భారత జంట మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయిన బోపన్న-సాకేత్‌లు ప్రత్యర్థి సర్వీస్‌ను ఒక్కసారి కూడా బ్రేక్ చేయలేకపోయారు. ‘డబుల్స్‌లో ఓడినప్పటికీ భారత్‌కు ఇంకా విజయావకాశాలు ఉన్నాయి. ఆదివారం జరిగే రెండు రివర్స్ సింగిల్స్‌లో మనోళ్లు గెలుస్తారనే నమ్మకంతో ఉన్నాను’ అని భారత కోచ్ జీషాన్ అలీ తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement