‘8 పరుగులకే 7 వికెట్లు అంటే నమ్మశక్యంగా లేదు’ | Iyer fumes after Delhi lose 7 wickets for 8 runs vs Kings XI Punjab | Sakshi
Sakshi News home page

‘8 పరుగులకే 7 వికెట్లు అంటే నమ్మశక్యంగా లేదు’

Apr 2 2019 5:02 PM | Updated on Apr 2 2019 5:06 PM

Iyer fumes after Delhi lose 7 wickets for 8 runs vs Kings XI Punjab - Sakshi

మొహాలి: ఐపీఎల్‌లో భాగంగా కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ 14 పరుగుల తేడాతో ఓటమి చవచూసిన సంగతి తెలిసిందే. వరుసగా వికెట్లు కోల్పోయి గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా కోల్పోయింది. దీనిపై మ్యాచ్‌ అనంతరం ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. 8 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఓటమి పాలుకావడం అసలు నమ్మశక్యంగా లేదన్నాడు. ‘ఈ ఓటమిని వివరించడానికి నా దగ్గర మాటల్లేవు. ఒకవైపు ఇన్‌గ్రామ్‌ ఆచితూచి ఆడుతుంటే.. మేమంతా పెవిలియన్‌కు క్యూ కట్టాము. జట్టును విజయం దిశగా నడిపించేందుకు ఏ ఒక్కరూ ముందడుగు వేయలేదు. పంజాబ్‌ జట్టు అన్నివిభాగాల్లోనూ రాణించింది. వాళ్లు ఒత్తిడిని బాగా ఎదుర్కొన్నారు’ అని శ్రేయస్‌ పేర్కొన్నాడు.
(ఇక్కడ చదవండి: పంజాబ్‌ భల్లే.. భల్లే..)

ఢిల్లీ విజయానికి చివరి నాలుగు ఓవర్లలో 30 పరుగులు కావాలి. అప్పటికి చేతిలో  ఏడు వికెట్లు ఉన్నాయి. దాంతో ఢిల్లీ విజయం ఖాయమనుకున్నారు. ఆ సమయంలో క్రీజ్‌లో ఉన్న రిషభ్‌ పంత్‌-ఇన్‌గ్రామ్‌లు కుదురుగా ఆడుతున్నారు. అయితే జట్టు స్కోరు 144 పరుగుల వద్ద ఉండగా రిషభ్‌ పంత్‌ బౌల్డ్‌ అయ్యాడు. షమీ వేసిస 17 ఓవర్‌ మూడో బంతికి  సిక్సర్‌ కొట్టి మంచి దూకుడుగా కనిపించిన పంత్‌..ఆ మరుసటి బంతికి బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత ఢిల్లీ పతనం మొదలైంది. ఎనిమిది పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కోల్పోవడంతో ఢిల్లీ పరాజయం చెందింది.  పంజాబ్‌ ఆల్‌ రౌండర్‌ సామ్‌కరన్‌ విజృంభించి హ్యాట్రిక్‌ వికెట్లు ఢిల్లీ పతనాన్ని శాసించాడు. ప్రధానంగా 144 పరుగుల వద్ద నాల్గో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ.. 152 పరుగులకు ఆలౌట్‌ కావడం ఆ జట్టును తీవ్ర నిరూత్సాహానికి గురిచేసింది.

Advertisement
 
Advertisement
Advertisement