సింధు, శ్రీకాంత్‌ శుభారంభం | Indonesia Open Srikanth and Sindhu Enter Into 2nd Round | Sakshi
Sakshi News home page

సింధు, శ్రీకాంత్‌ శుభారంభం

Jul 17 2019 10:23 PM | Updated on Jul 17 2019 10:23 PM

Indonesia Open Srikanth and Sindhu Enter Into 2nd Round - Sakshi

జకార్తా: ఇండోనేషియాలో ఓపెన్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత అగ్రశ్రేణి షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌ శుభారంభం చేశారు. బుధవారం మహిళల సింగిల్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఐదో సీడ్‌ సింధు 11–21, 21–15, 21–15 అయా ఒహొరి(జపాన్‌)పై చెమటోడ్చి నెగ్గింది. ఈ ఏడాది తొలి టైటిల్‌ సాధించాలని బరిలోకి దిగిన సింధుకు తొలి సెట్‌లో ప్రత్యర్థి షాక్‌ ఇచ్చింది. అనంతరం పుంజుకున్న సింధు రెండు, మూడు సెట్లతోపాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్, వరల్డ్‌ నెం.9 శ్రీకాంత్‌ 21–14, 21–13 కెంటా నిషి మోటో(జపాన్‌)ను చిత్తుచే శాడు.

38 నిమిషాల్లో్లనే ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌ ధాటికి ప్రత్యర్థి తేలిపోయాడు. కాగా, మరో ఇద్దరు భారత ఆట గాళ్లు హెచ్‌ఎస్‌ ప్రణయ్, భమిడిపాటి సాయిప్రణీత్‌ టోర్నీ నుంచి నిష్క్రమిం చారు. వరల్డ్‌ నెం.23 సాయిప్రణీత్‌ 15–21, 21–13, 10–21తో ప్రపంచ 37వ ర్యాంకర్‌ వాంగ్‌ వింగ్‌ కి విన్సెంట్‌(హాంగ్‌కాంగ్‌) చేతిలో చిత్తవగా, వరల్డ్‌ నెం.32 ప్రణయ్‌ 21–19, 18–21, 20–22తో ప్రపంచ నెం.2 షి యుకి(చైనా) చేతిలో పోరాడి ఓడాడు. అలాగే మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్‌ రంకిరెడ్డి– అశ్విని పొన్నప్ప(భారత్‌) జోడీ 13–21, 11–21తో టొంటొవి అహ్మద్‌–విన్నీ ఒక్తవిన కండౌ(ఇండోనేషియా) చేతిలో ఓడింది.  

Advertisement
 
Advertisement
Advertisement