‘దాన్ని ఆసరాగా తీసుకుని స్లెడ్జింగ్‌కు పాల్పడం’

du Plessis says South Africa won t sledge Australia over ball tampering scandal during upcoming tour - Sakshi

మెల్‌బోర్న్‌: సఫారీ గడ్డపై ఆస్ట్రేలియా క్రికెటర్లు సృష్టించిన బాల్ ట్యాంపరింగ్ ఉదంతం ఆ దేశ ప్రతిష్టను మసకబారేలా చేసింది. ఈ ఏడాది మార్చిలో కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో టెస్టులో ఆసీస్‌ ఆటగాళ్లు స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార‍్నర్‌, కామెరాన్‌ బెన్‌క్రాఫ్ట్‌లు ట్యాంపరింగ్‌ వివాదంలో చిక్కుకున్నారు.  దాంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా కఠిన చర్యలు తీసుకుంది. స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌‌లపై ఏడాది పాటు నిషేధం విధించగా... ఈ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన బాన్ క్రాప్ట్‌కు తొమ్మిది నెలల పాటు నిషేధం విధించింది. ఆ బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదాన్ని అడ్డుపెట్టుకొని ఆస్ట్రేలియా జట్టుపై స్లెడ్జింగ్‌కు దిగే ఆలోచన లేదని అన్నాడు దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్‌.

ఇప్పుడు సఫారీ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఈ పర్యనటలో భాగంగా నవంబర్ 4 నుంచి 17 వరకు ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుతో మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌ ఆడనుంది. ఈ సందర్భంగా డుప్లెసిస్ మాట్లాడుతూ..‘ జరిగిందేదో జరిగిపోయింది. ప్రస్తుతం దాని గురించి పట్టించుకోవాలనుకోవట్లేదు. ఈ సిరీస్‌లో కొంతమంది యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించనున్నాం. మేము అక్కడకు వెళ్లింది స్లెడ్జింగ్‌ కోసం కాదు’ అని చెప్పాడు.  కాగా, రెండేళ్ల క్రితం అడిలైడ్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌ని డుప్లెసిస్ గుర్తు చేసుకున్నాడు. ‘అడిలైడ్‌లో జరిగిన నైట్ టెస్టు మ్యాచ్‌లో నేను బ్యాటింగ్ చేసేందుకు మైదానంలో అడుగుపెట్టగా అరవై వేల మంది బూయింగ్ చేశారు’ అని చెప్పుకొచ్చాడు. ఆ మ్యాచ్‌లో డుప్లెసిస్‌ బాల్‌ ట్యాంపరింగ్ చేశాడని ఆసీస్‌ ఆరోపించింది. అయితే డుప్లెసిస్‌ ఎటువంటి ట్యాంపరింగ్‌కు పాల్పడలేదని విచారణలో తేలింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top