భారత వన్డే జట్టు కెప్టెన్ ఎం.ఎస్.ధోని తొలి ప్యారాచూట్ జంపింగ్ను దిగ్విజయంగా పూర్తి చేశాడు.
న్యూఢిల్లీ : భారత వన్డే జట్టు కెప్టెన్ ఎం.ఎస్.ధోని తొలి ప్యారాచూట్ జంపింగ్ను దిగ్విజయంగా పూర్తి చేశాడు. బుధవారం భారత ఆర్మీకి చెందిన ఎలైట్ ప్యారా రెజిమెంట్ ప్రాంతంలో ఏఎన్-32 రవాణా ఎయిర్క్రాఫ్ట్లో బయలుదేరిన మహీ 1250 అడుగుల ఎత్తు నుంచి ప్యారాచూట్తో కిందకు దూకాడు. కనోపి స్టాటిక్ లైన్ ప్యారాచూట్ను ధరించిన ధోని.. ఆగ్రా దగ్గరలోని మల్పురా ప్రాంతంలో నేల మీద దిగాడని సైనిక వర్గాలు తెలిపాయి. ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న కెప్టెన్... ఈ నెల 6వ తేదీ నుంచి ప్యారాట్రూపర్స్ శిక్షణ స్కూల్ (పీటీఎస్)లో ప్యారా జంపింగ్లో శిక్షణ తీసుకుంటున్నాడు.
ఇందులో భాగంగా తొలి జంప్ను పూర్తి చేశాడు. క్వాలిఫయిడ్ ప్యారా జంపర్గా మారేందుకు ధోని 10వేల అడుగుల ఎత్తు నుంచి మరో నాలుగు జంప్లు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఒకటి రాత్రి వేళలో కూడా చేయాలి.