ధోనికి బీసీసీఐ ఝలక్‌

Dhoni Left Out of BCCIs New Annual Player Contracts - Sakshi

న్యూఢిల్లీ: గతేడాది ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరంగా ఉంటూ వస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనికి భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ)ఝలక్‌ ఇచ్చింది. ఈ సీజన్‌కు సంబంధించి విడుదల చేసిన భారత క్రికెటర్ల కాంట్రాక్ట్‌ జాబితా నుంచి ధోని పేరును తొలగించింది. అసలు ఏ కేటగిరీలోనూ ధోనికి అవకాశం కల్పించలేదు. తాజాగా ఎ+, ఎ, బి, సి గ్రేడ్‌లను ప్రకటించిన బీసీసీఐ.. అందులో ధోని పేరును చేర్చలేదు. గతంలో ఎ+ గ్రేడ్‌ను ధోనికి కేటాయించిన సంగతి తెలిసిందే.

మూడు ఫార్మాట్లూ ఆడే క్రికెటర్‌ కోసమే ఎ+ కేటగిరీని తీసుకురాగా, సుదీర్ఘ కాలంగా ధోని పరిమిత ఓవర్ల క్రికెట్‌  మాత్రమే ఆడుతూ వస్తున్నాడు. కాగా, ఈ నిబంధనను పక్కకు పెట్టిన బీసీసీఐ.. గత సీజన్‌లో ధోనికి ఎ+ గ్రేడ్‌ను కేటాయించింది. అయితే ఇప్పుడు ఎందులోనూ అవకాశం ఇవ్వకుండా ధోనిని తప్పించింది. దాంతో ధోని శకం ఇక ముగిసినట్లేనని బీసీసీఐ చెప్పకనే చెప్పేసింది.  ఎ+ గ్రేడ్‌లో విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రాలకు మాత్రమే అవకాశం ఇచ్చింది. ఇక ఎ-గ్రేడ్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, చతేశ్వర పుజారా, అజ్యింకా రహానే, కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌, షమీ, ఇషాంత్‌ శర్మ, కుల్దీప్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌లకు చోటు కల్పించారు.

బి-గ్రేడ్‌లో వృద్ధిమాన్‌ సాహా, ఉమేశ్‌ యాదవ్‌, చహల్‌, హార్దిక్‌ పాండ్యా, మయాంక్‌ అగర్వాల్‌కు అవకాశం దక్కగా, సి-గ్రేడ్‌లో కేదార్‌ జాదవ్‌, నవదీప్‌ సైనీ, దీపక్‌ చాహర్‌, మనీష్‌ పాండే, హనుమ విహారి, శార్దూల్‌ ఠాకూర్‌, శ్రేయస్‌ అ‍య్యర్‌, వాషింగ్టన్‌ సుందర్‌లు చోటు దక్కించుకున్నారు. ఈ సీజన్‌ సమయంలో ఎ+ గ్రేడ్‌లో ఉన్న ఆటగాడికి రూ. 7 కోట్ల వరకూ బీసీసీఐ ఇస్తుండగా, ఎ-గ్రేడ్‌లో ఉన్న క్రికెటర్లకు రూ. 5 కోట్లు, బి-గ్రేడ్‌లో ఉన్న క్రికెటర్లకు 3 కోట్లు, సి-గ్రేడ్‌లో ఉన్న క్రికెటర్లకు ఒక కోటి చొప్పున లభిస్తుంది. వీరిలో నవదీప్‌ సైనీ, మయాంక్‌ అగర్వాల్‌, శ్రేయస్‌ అ‍య్యర్‌, వాషింగ్టన్‌ సుందర్‌, దీపక్‌ చాహర్‌లు తొలిసారి కాంట్రాక్ట్‌ జాబితాలో చోటు దక్కించుకున్నారు.(ఇక్కడ చదవండి: ‘ధోని వన్డే కెరీర్‌ ముగిసినట్లే’)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top