ప్రేక్షకులు లేకుండా మెగా టోర్నీ వద్దు.. ప్లీజ్‌ | Can't See World Cup Behind Closed Doors, McCullum | Sakshi
Sakshi News home page

ప్రేక్షకులు లేకుండా మెగా టోర్నీ వద్దు.. ప్లీజ్‌

Apr 23 2020 3:10 PM | Updated on Apr 23 2020 3:12 PM

Can't See World Cup Behind Closed Doors, McCullum - Sakshi

మెల్‌బోర్న్‌: ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్‌కప్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తేనే మంచిదని న్యూజిలాండ్‌ మాజీ ఆటగాడు బ్రెండన్‌ మెకల్లమ్‌ అభిప్రాయపడ్డాడు. కరోనా వైరస్‌ నివారణ అనేది ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా లేకపోవడంతో ప్రధాన క్రీడా ఈవెంట్లను వచ్చే ఏడాదికి జరిపితేనే మంచిదన్నాడు. ఈ క్రమంలోనే టీ20 వరల్డ్‌కప్‌ను తదుపరి ఏడాదికి  వాయిదా వేస్తూ ముందుగానే నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. టీ20 వరల్డ్‌కప్‌ నిర్వహణ అంశంపై జూలైలో నిర్ణయం తీసుకుంటామని ఐసీసీ స్పష్టం చేసిన తరుణంలో మెకల్లమ్‌ మాత్రం భిన్నంగా స్పందించాడు. (‘ధోనికి చాన్స్‌ ఇవ్వడం బాధించింది’)

ఐపీఎల్‌-13వ సీజన్‌ను అక్టోబర్‌ విండోలో జరిపే యోచనలో ఉన్న క్రమంలో వరల్డ్‌కప్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభిస్తే బాగుంటుందన్నాడు. మహిళల వన్డే వరల్డ్‌కప్‌ను నిర్వహించే సమయంలోనే పురుషుల మెగా టోర్నీకి కూడా నిర్వహిస్తే బాగుంటుందన్నాడు. ప్రేక్షకులు లేకుండా అక్టోబర్‌లో నిర్వహించాలనే చూస్తే వరల్డ్‌కప్‌ కళ తప్పుతుందన్నాడు. స్టేడియాలను మూసివేసి క్రికెట్‌ మ్యాచ్‌లను ఆటగాళ్లతోనే నిర్వహిస్తే అసలు మజానే ఉండదన్నాడు. కరోనా వైరస్‌ నేపథ్యంలో 16 జాతీయ జట్లు ఆస్ట్రేలియాకు రావాల్సి ఉంటుందని, ఈ క్రమంలోనే 20 లక్షలకు పైగా ప్రభావితులు అయ్యే అవకాశం ఉండటంతో అక్టోబర్‌లో వరల్డ్‌కప్‌ మాటను వదులుకోవాలన్నాడు. (‘గేర్’ మార్చి దంచి కొట్టిన వేళ..!)

Advertisement
 
Advertisement
Advertisement