అంకిత్‌ బావ్నే సెంచరీ | Ankit Bawne's century | Sakshi
Sakshi News home page

అంకిత్‌ బావ్నే సెంచరీ

Oct 2 2017 1:33 AM | Updated on Oct 2 2017 1:33 AM

Ankit Bawne's century

సాక్షి, విజయవాడ: మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ అంకిత్‌ బావ్నే (166 బంతుల్లో 116 బ్యాటింగ్‌; 13 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ సెంచరీ, పార్థివ్‌ పటేల్‌ (78 బంతుల్లో 56 బ్యాటింగ్‌; 4 ఫోర్లు, ఒక సిక్స్‌) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నారు. ఫలితంగా న్యూజిలాండ్‌ ‘ఎ’తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్‌ ‘ఎ’ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. వీరిద్దరూ ఐదో వికెట్‌కు అజేయంగా 154 పరుగులు జోడించడం విశేషం. ఓవర్‌నైట్‌ స్కోరు 33/1తో రెండో రోజు బ్యాటింగ్‌ కొనసాగించిన భారత్‌ ‘ఎ’ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 82 ఓవర్లలో నాలుగు వికెట్లకు 360 పరుగులు సాధించింది. ప్రస్తుతం భారత్‌ ‘ఎ’ 149 పరుగుల ఆధిక్యంలో ఉంది.

అంతకుముందు శ్రేయస్‌ అయ్యర్‌ ధాటిగా ఆడాడు. ప్రియాంక్‌ పాంచల్‌ (46; 7 ఫోర్లు)తో కలిసి శ్రేయస్‌ అయ్యర్‌ (79 బంతుల్లో 82; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 133 పరుగులు జత చేశాక అవుటయ్యాడు. అయ్యార్‌ అవుటయ్యాక స్కోరు బోర్డుకు మరో తొమ్మిది పరుగులు కలిశాక ప్రియాంక్‌ కూడా పెవిలియన్‌ చేరుకున్నాడు. ఈ దశలో కెప్టెన్‌ కరుణ్‌ నాయర్‌ (43; 7 ఫోర్లు), అంకిత్‌ బావ్నే నిలకడగా ఆడుతూ నాలుగో వికెట్‌కు 64 పరుగులు జోడించి భారత్‌ ‘ఎ’ స్కోరును 200 పరుగులు దాటించారు. క్రీజ్‌లో నిలదొక్కుకున్న నాయర్‌ను స్పిన్నర్‌ సోధి అవుట్‌ చేయడంతో భారత్‌ ‘ఎ’ నాలుగో వికెట్‌ కోల్పోయింది. అనంతరం అంకిత్‌ బావ్నే, పార్థివ్‌ పటేల్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడి భారత్‌ ‘ఎ’ ఇన్నింగ్స్‌ను పటిష్ట పరిచారు.   

Advertisement
 
Advertisement
Advertisement