మేఘన డబుల్‌ ధమాకా 

All India badminton tournament - Sakshi

ఆలిండియా బ్యాడ్మింటన్‌ టోర్నీ  

బరేలీ: ఆలిండియా సీనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో తెలుగు అమ్మాయి మేఘన జక్కంపూడి సత్తా చాటింది. ఈ టోర్నీలో మహిళల డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగాల్లో టైటిళ్లను కైవసం చేసుకుంది. శనివారం జరిగిన మహిళల డబుల్స్‌ ఫైనల్లో మేఘన– పూర్విషా రామ్‌ (ఆర్బీఐ) ద్వయం 21–19, 21–14తో మూడో సీడ్‌ వైష్ణవి భాలే– అనురా ప్రభుదేశాయ్‌ జంటపై గెలుపొందింది. మరోవైపు మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌పోరులో మేఘన– ధ్రువ్‌ కపిల (ఎయిరిండియా) జంట 22–10, 21–10తో పొదిలె శ్రీ కృష్ణ సాయి కుమార్‌– రుతుపర్ణ పాండా జోడీని ఓడించింది. 

సెమీస్‌లో సాయివిష్ణు ఓటమి... 
గుల్బర్గా: ఆలిండియా సబ్‌ జూనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో పుల్లెల సాయివిష్ణు పోరాటం సెమీస్‌లో ముగిసింది. అండర్‌–15 బాలుర సింగిల్స్‌ సెమీస్‌లో మూడోసీడ్‌ సాయివిష్ణు 16–21, 9–21తో శంకర్‌ ముత్తుస్వామి (తమిళనాడు) చేతిలో ఓడిపోయాడు. మరో తెలుగు కుర్రాడు ప్రణవ్‌రావు గంధం ఫైనల్‌కు చేరుకున్నాడు. సెమీస్‌లో టాప్‌సీడ్‌ ప్రణవ్‌రావు 21–15, 21–12తో ప్రణవ్‌ కట్టపై గెలుపొందాడు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top