రఫ్పాడిస్తానంటున్న వరలక్ష్మి
తమిళసినిమా: వైవిధ్యభరిత కథా చిత్రాలు నటి వరలక్ష్మీని వెతుక్కుంటూ వస్తున్నాయి. తారైతప్పట్టై చిత్రంలో డాన్స్లో దుమ్మురేపిన ఈ బ్యూటీ తాజాగా ఫైట్స్లో అదరగొడుతున్నారట. వరలక్ష్మీశరత్కుమార్ చేతి నిండా చిత్రాలతో యమ బిజీగా ఉన్నారు. ఆమె నటిస్తున్న తాజా చిత్రాల్లో వెల్వెట్ నగరం ఒకటి. ఈ చిత్రం ప్రత్యేకత ఏమిటంటే ఇది లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రం. ఈ తరహా కథా చిత్రంలో వరలక్ష్మి నటించడం ఇదే ప్రథమం. ఇందులో తను డైనమిక్ రిపోర్టర్గా నటిస్తున్నారట. దీనికి మనోజ్ కమార్నటరాజన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
ఈ చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ ఇది కథానాయికకు ప్రాధాన్యత ఉన్న కథా చిత్రం అని చెప్పారు. కొంత కాలం క్రితం కోడైకెనాల్, చెన్నైలో జరిగిన వేర్వేరు యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం వెల్వెట్ నగరం అని తెలిపారు. భారీ ఫైట్స్ సన్నివేశాలతో కూడిన సస్పెన్స్ «థ్రిల్లర్ కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. 48గంటల్లో జరిగే కథాంశంతో కూడిన ఈ చిత్రం జెట్ వేగంతో సాగుతుందన్నారు. ఇందులో మదురైకి చెందిన క్రైమ్ రిపోర్టర్గా నటి వరలక్ష్మీ శరత్కుమార్ నటిస్తున్నారని చెప్పారు. కోడైకెనాల్లో నివశించే గిరిజన సామాజిక వర్గ ప్రజలకు జరిగిన అన్యాయం గురించి ఆధారాలు సేకరించడానికి మదురై నుంచి చెన్నైకి వచ్చిన వరలక్ష్మి ఎలాంటి సంఘటనలను ఎదుర్కొన్నారన్న పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రంగా వెల్వెట్ నగరం ఉంటుందన్నారు. చెన్నై, మదురై, కోడైకెనాల్ ప్రాంతాల్లో చిత్రీకరణ నిర్వహించినట్లు తెలిపారు. చివరి ఘట్ట షెడ్యూల్ చెన్నైలో జరపనున్నట్లు తెలిపారు.
మరిన్ని వార్తలు