వండుకుని తినేస్తా; పిచ్చి పట్టిందా ఏంటి? | Sakshi
Sakshi News home page

పిచ్చి పీక్స్‌కు వెళ్లడం అంటే ఇదే!

Published Thu, Aug 8 2019 2:34 PM

Woman Poses With Octopus Joined Hospital - Sakshi

ఆక్టోపస్‌తో ఆటలాడిన ఓ మహిళకు భయానక అనుభవం ఎదురైంది. ముఖంపై ఆక్టోపస్‌ను వేసుకుని ఫొటోలకు ఫోజులిస్తున్న క్రమంలో తీవ్ర గాయాల  పాలై ఆస్పత్రిలో చేరింది. వివరాలు... వాషింగ్టన్‌కు చెందిన జామీ బెసీగ్లియా అనే(45) మహిళ స్థానికంగా జరుగుతున్న చేపలు పట్టే పోటీకి వెళ్లింది. అక్కడ కొంతమంది జాలరుల వలకు ఆక్టోపస్‌ చిక్కడాన్ని చూసి ఉత్సాహంగా అక్కడికి పరిగెత్తింది. ఇంకేముంది దానిని చేతుల్లోకి తీసుకుని ముఖం మీద వేసుకుని ఫొటోలకు ఫోజులు ఇవ్వడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో తొలుత గమ్మున ఉన్న ఆక్టోపస్‌.. కాసేపటి తర్వాత ఆమెను కొరకడం ప్రారంభించింది. అయినప్పటికీ జామీ మాత్రం దాన్ని వదలకుండా అలాగే ఉండిపోయింది. కానీ ఆక్టోపస్‌ విజృంభించడంతో నొప్పితో విలవిల్లాడిపోతూ ఆస్పత్రికి పరిగెత్తింది. 

ఇక తన చేదు అనుభవం గురించి జామీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ....‘నాకు పిచ్చిపట్టిందని మీరు అనుకోవచ్చు! అవును నా ముఖం మీద ఉన్నది ఆక్టోపస్!!. దానికి కత్తుల్లాంటి కోరలు ఉంటాయని.. శరీరంలోకి దిగుతాయని నాకు తెలుసు. అదే జరిగింది కూడా. నా చిన్‌ ఉబ్బిపోయింది. రక్తం కారుతూనే ఉంది. గొంతు, శరీరంలోని కొన్ని గ్రంథులు తీవ్రంగా ఉబ్బిపోయాయి. అయితే నేను దాన్ని వదిలిపెట్టబోవడం లేదు. రాత్రికి వండుకుని తినేస్తున్నా’ అని రాసుకొచ్చింది. ఈ క్రమంలో.. ‘పిచ్చి పీక్‌ స్టేజ్‌కి వెళ్లడం అంటే ఇదే. అన్నీ తెలిసి ఇలా ఎందుకు చేశావు. మళ్లీ దాన్ని వండుకు తింటా అంటావు. పిచ్చి పట్టిందా ఏంటి’ అంటూ నెటిజన్లు జామీ చర్యను విమర్శిస్తున్నారు.

Advertisement
Advertisement