కోడెల అరాచకం; స్పందించకపోతే నిరాహార దీక్ష! | YSRCP Leader Ambati Rambabu Demands File Case On Kodela Sivaprasad Rao | Sakshi
Sakshi News home page

‘కోడెల, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలి’

Apr 15 2019 7:59 PM | Updated on Jul 29 2019 2:44 PM

YSRCP Leader Ambati Rambabu Demands File Case On Kodela Sivaprasad Rao - Sakshi

సాక్షి, గుంటూరు : ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించిన ముప్పాళ్ల ఎస్సై ఏడుకొండలును సస్పెండ్‌ చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు. సోమవారమిక్కడ ఆయన మాట్లాడుతూ.. స్పీకర్‌ కోడెల శివప్రసాద రావు పోలింగ్‌ బూత్‌ క్యాప్చరింగ్‌కు యత్నించి దొరికిపోయారని పేర్కొన్నారు. కులాలు, ప్రాంతాలను రెచ్చగొట్టి ఆయన అరాచకాలకు పాల్పడుతూ.. అశాంతి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కోడెలపై ఐదుగురు పోలింగ్‌ ఏజెంట్లు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. రేపు సాయంత్రంలోగా పోలీసులు స్పందించకపోతే నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.

టీడీపీ నేతలు ధర్నా ఎలా చేస్తారు?
పోలింగ్‌ సమయంలో 30 యాక్ట్‌, 144 సెక్షన్‌ అమల్లో ఉంటే టీడీపీ నేతలు ఎలా ధర్నా చేస్తారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ‘మాపై నకిలీ ఫిర్యాదులు ఇచ్చారు. సంఘటనాస్థలంలో లేని వ్యక్తి మాపై ఫిర్యాదు చేశాడు. మాపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం దారుణం. మా ఫిర్యాదు స్వీకరించి పోలీసులు కేసు నమోదు చేయాలి. అశాంతి సృష్టించిన కోడెల, ఆయన అనుచరులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇనిమెట్ల కేసును నిష్పక్షపాతంగా విచారించాలి’ అని డిమాండ్‌ చేశారు.

కాగా గుంటూరు జిల్లాలోని రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామంలో టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. నేరుగా 160 నెంబర్‌ పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి ఆయన తలుపులు వేసుకున్నారు. గంటన్నరకు పైగా అక్కడే కూర్చొని ఉన్నారు. దీంతో కోడెలను బయటకు పంపాలంటూ ఓటర్లు ఆందోళకు దిగారు. నేను ఇక్కడే ఉంటాను ఏం చేసుకుంటారో చేసుకోండంటూ ఓటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఓటర్లు కోడెలపై తిరుగుబాటు చేశారు. స్వయంగా ఒక అభ్యర్థి పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి తలుపులేసుకొని ఉండడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. ఓటర్ల తిరుగుబాటుతో కంగుతిన్న కోడెల.. సొమ్మసిల్లి పడిపోయారు. ఈ క్రమంలో కోడెలపై దాడి పేరుతో వైఎస్సార్ సీపీ నాయకులు అంబటి రాంబాబు,  నిమ్మకాయల రాజనారాయణ, బాసు లింగారెడ్డిపై కేసులు బనాయించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement