సాక్షి, అమరావతి : ప్రత్యేక హోదా–ఆంధ్రుల హక్కు నినాదం మిన్నంటడంతో పాటు దేశ రాజధాని ఢిల్లీలో ఎంపీలు చేపట్టే ఆమరణ దీక్షలకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గ కేంద్రాల్లో రిలే దీక్షలు ప్రారంభించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన శ్రేణులకు పిలుపునిచ్చింది. హోదాపై తాడోపేడో తేల్చుకునేందుకు ఉద్దేశించిన ఈ పోరాటంలో అన్ని వర్గాలను భాగస్వాములను చేయాలని విజ్ఞప్తి చేసింది. ప్రత్యేక హోదా నినాదం ఊరూవాడా మార్మోగేలా చూడడంతోపాటు హోదా అవసరాన్ని ప్రజలకు వివరించేలా ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్తలకు దిశానిర్దేశం చేస్తూ కేంద్ర పార్టీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించండి: ఉద్యమాన్ని పెద్దఎత్తున నిర్వహించేలా కార్యాచరణను రూపొందించేందుకు తక్షణమే జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించాలంది. పార్టీ ముఖ్య నాయకులతో పాటు పార్టీ విద్యార్థి, యువజన, మహిళా విభాగాల నాయకులను ఆహ్వానించి, చర్చించి కార్యాచరణ రూపొందించాలని పేర్కొంది. ఈ పోరాటంలో వైఎస్సార్సీపీతో కలసి వచ్చే పార్టీలను, ప్రజా, ఇతర సంఘాల వారిని లిఖితపూర్వకంగా సంప్రదించి ముఖ్యులతో నేరుగా మాట్లాడి వారి మద్దతు కూడగట్టేలా చూడాలని పార్టీ కోరింది.
‘హోదా’ ఉద్యమం హోరెత్తాలి
Apr 3 2018 1:47 AM | Updated on Mar 23 2019 9:10 PM
Advertisement


