29 సార్లు ఢిల్లీకి వెళ్లిఏం సాధించారు.. | Sakshi
Sakshi News home page

చంద్రబాబు వల్లే హోదా దూరం

Published Wed, Apr 4 2018 9:27 AM

Y visweshwar reddy Fires On Cm Chandrababu Naidu - Sakshi

ఉరవకొండ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాకపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీరే కారణమని వక్తలు అభిప్రాయపడ్డారు. నాలుగేళ్ల పాటు హోదా మాటెత్తని చంద్రబాబు.. రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పుడు హోదా రాగం అందుకున్నాడన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం ఉరవకొండలోని తొగటవీరక్షత్రియ కళ్యాణ మండపంలో స్థానిక ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ‘‘ఏపీకి ప్రత్యేక హోదా...విభజన హామీల అమలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. విద్యావేత్త డి.ఎర్రిస్వామి అధ్యక్షతన జరిగిన సదస్సులో మేధావులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక హోదా ఉద్యమంలో తమపార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన విధానంతో ముందుకు సాగుతున్నారన్నారు.

హోదా కోసం రెండు సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత కేంద్రం ప్యాకేజీ అంటే చంద్రబాబుకు ఎందుకు ఒప్పుకున్నారని ప్రశ్నించారు. హోదా ఇచ్చేందుకు 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోదని కేంద్రం డ్రామా ఆడిందనీ, అప్పుడు చంద్రబాబు కనీసం ఆర్థిక సంఘం సభ్యులతో ఆరా తీశారా అంటూ ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసుకు భయపడి 85 రోజులు అసెంబ్లీకు రాలేకపోయారన్నారు. హోదాను ఇంకా సజీవంగా ఉంచింది వైఎస్‌ జగన్‌మాత్రమేనన్నారు. అన్నీ వర్గాలను కలుపుకోని చంద్రబాబు పోరాడి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. హోదా ఉద్యమం మరింత ఉధృతం చేసేందుకు అందురూ ముందుకు రావాలని కోరారు. సదస్సులో విశ్రాంత బ్యాంకు మేనేజర్‌ ఓబులేసు, వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సుశీలమ్మ, జెడ్పీటీసీ సభ్యులు తిప్పయ్య, లలితమ్మ, చేనేత విభాగం నేతలు చంద్రమౌళి, ఎంసీ నాగభూషణం, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు రసూల్‌సాబ్, ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి హనుమప్ప, న్యాయవాదులు ఆదినారాయణరెడ్డి, రామ్మోహన్, అధ్యాపకులు ముండాసు ఓబులేసు, డాక్టర్‌ ఎర్రిస్వామి, డాక్టర్‌ నారాయణస్వామి పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement