పంచాయతీ ఎన్నికలకు సిద్ధం | TPCC Chief Uttam Kumar Comments On TRS | Sakshi
Sakshi News home page

పంచాయతీ ఎన్నికలకు సిద్ధం

Jun 21 2018 2:25 AM | Updated on Sep 4 2018 4:54 PM

TPCC Chief Uttam Kumar Comments On TRS - Sakshi

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : పంచాయతీ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పటిష్టమైన కేడర్‌తో బలంగా ఉన్న కాంగ్రెస్‌.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొంటుందని చెప్పారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా పార్టీ పరంగా టీఆర్‌ఎస్‌ నిర్మాణం కాలేదని, గ్రామాల్లో ఆ పార్టీకి అడ్రస్‌ కూడా లేదని వ్యాఖ్యానించారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ఖరారులో ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోందని విమర్శించారు.

పంచాయతీరాజ్‌ చట్టానికి విరుద్ధంగా రిజర్వేషన్లు ఉన్నాయని.. ఆయా సామాజిక వర్గాలకు ఏ ప్రాతిపదికన, ఎంత శాతం రిజర్వేషన్లు ఇస్తారో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. సమగ్ర కుటుంబ సర్వేను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రభుత్వాన్ని ఉత్తమ్‌ నిలదీశారు. సర్పంచ్‌ రిజర్వేషన్లపై త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా మండల స్థాయి నేతలతో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయాలన్నదే పార్టీ డిమాండ్‌ అని, దీనిపై కోర్టుకెళ్లే ఆలోచన లేదని చెప్పారు.

 రాహుల్‌కు శుభాకాంక్షలు చెప్పేందుకే.. 
పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి జన్మదిన శుభా కాంక్షలు చెప్పేందుకే తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కొందరు ఢిల్లీ వెళ్లారని ఉత్తమ్‌ అన్నారు. తనపై ఫిర్యా దు చేసేందుకు వారు ఢిల్లీ వెళ్లారని అనుకోవడం లేదన్నారు. కాంగ్రెస్‌లో చేరేందుకు అనేకమంది టీఆర్‌ఎస్, బీజేపీ, టీడీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని, ఈ విషయమై స్థానిక నేతలతో మాట్లాడుతున్నామని, త్వరలోనే చేరికలు ఉంటాయని వెల్లడించారు.  
ఘనంగా జన్మదిన వేడుకలు 
ఉత్తమ్‌ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసం వద్ద, మధ్యాహ్నం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ నేతల సమక్షంలో ఆయన వేడుక జరుపుకున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement