‘అజిత్‌తో అన్ని బంధాలు తెగిపోయాయి’ | Supriya Sule Says Ajit Pawar Is Traitor As He Takes Oath As MH DCM | Sakshi
Sakshi News home page

అజిత్‌ నమ్మకద్రోహి: సుప్రియా సూలే

Nov 23 2019 11:46 AM | Updated on Nov 23 2019 4:44 PM

Supriya Sule Says Ajit Pawar Is Traitor As He Takes Oath As MH DCM - Sakshi

ముంబై : అజిత్‌ పవార్‌ ఎన్సీపీని మోసం చేసి నమ్మకద్రోహిగా మిగిలిపోయారని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అజిత్‌ పవార్‌ నిర్ణయం పార్టీతో పాటు తమ కుటుంబంలోనూ చీలిక తెచ్చిందని పేర్కొన్నారు. ఇకపై తన తండ్రి అజిత్‌తో కలిసి పనిచేసే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ‘ఇంకెవరిని నమ్మాలో అర్థం కావడం లేదు. నా జీవితంలో ఎన్నడూ ఇంతగా మోసపోలేదు. తనకు అండగా నిలబడ్డాను. ప్రేమించాను. కానీ నాకు తిరిగి ఏం లభించిందో చూడండి’ అని తన కజిన్‌ అజిత్‌ పవార్‌ను ఉద్దేశించి సోషల్‌ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్‌, డిప్యూటీ సీఎంగా అజిత్‌ పవార్‌ శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. శివసేన, కాంగ్రెస్‌ పార్టీతో కలిసి ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని శరద్‌ పవార్‌ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకోవడంతో మహా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. (పవార్‌కు అజిత్‌ వెన్నుపోటు!)

ఈ నేపథ్యంలో సుప్రియా సూలే శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఎన్సీపీని వీడి నేతలంతా బీజేపీలో చేరిన సమయంలో తమ కార్యకర్తలంతా పార్టీకి అండగా నిలిచారన్నారు. అయితే అజిత్‌ పవార్‌ మాత్రం వారి నమ్మకాన్ని వమ్ముచేస్తూ బీజేపీతో చేతులు కలిపి తమకు షాకిచ్చారని వాపోయారు. ఇకపై ఆయనతో తమకు ఎటువంటి సంబంధాలు ఉండబోవన్నారు. కాగా బారమతి ఎంపీగా గెలుపొందిన సుప్రియ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ స్టార్‌ క్యాంపెయినర్‌గా ప్రచారం నిర్వహించారు. బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని... ఇతర పార్టీ నాయకులను భయపెట్టి లొంగదీసుకుంటుందంటూ దూకుడుగా ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం తన కజిన్‌ అజిత్‌ ఈ విధంగా బీజేపీకి మద్దతు ప్రకటించడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.(మహా ట్విస్ట్‌: శరద్‌ పవార్‌ స్పందన)

Advertisement
 
Advertisement
Advertisement