ఈటలను తప్పించేందుకు స్కెచ్
ఎమ్మెల్యే రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పరిపాలనపై సీఎం కేసీఆర్కు పట్టులేదని, ఆర్థిక వ్యవస్థ మీద ఆయనకు నిబద్ధత లేదనేందుకు కాగ్ నివేదికలే నిదర్శనమని ఎమ్మెల్యే రేవంత్రెడ్డి విమర్శించారు. శనివారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సమర్థ పాలనను అందించడంలో కేసీఆర్ విఫలమయ్యారని, కమీషన్ల కక్కుర్తితో ఎడాపెడా అప్పులు తీసుకుని రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆరోపించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారడానికి సీఎం కేసీఆర్ కారణమైతే, ఆర్థిక మంత్రి రాజేందర్ను కారణంగా చూపించి ఆయనపై వేటు వేసే అవకాశం ఉందని తెలుస్తోందని రేవంత్ అన్నారు. కాగ్ నివేదికను అడ్డుపెట్టుకుని ఈటలను తొలగించేందుకు సీఎం స్కెచ్ వేశారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు. తన వైఫల్యాలకు బాధ్యత వహించి సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు.