'కేసీఆర్‌ అనే నేను' సినిమా తీస్తాం | Ponnam Prabhakar Satires On TRS Plenary, Cm KCR | Sakshi
Sakshi News home page

'కేసీఆర్‌ అనే నేను' సినిమా తీస్తాం

Apr 27 2018 6:35 PM | Updated on Aug 15 2018 9:06 PM

Ponnam Prabhakar Satires On TRS Plenary, Cm KCR - Sakshi

పొన్నం ప్రభాకర్‌

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశాలపై కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్లీనరీ జరగుతున్నది ప్రగతి ప్రాంగణంలో కాదని, తెలంగాణను అధోగతి చేసే ప్రాంగణం అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావుది నోరా.. మొరా అంటూ దుయ్యబట్టారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అని సాక్షాత్తు మండలిలో కేసీఆర్‌ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్లీనరీలో కనీసం సోనియాను తలుచుకోకపోవడం దారుణమని, తెలంగాణ ఇచ్చిన వారిని గౌరవించుకునే సంస్కారం కేసీఆర్‌కు లేదంటూ మండిపడ్డారు.

టీఆర్‌ఎస్‌ ప్లీనరీ అబద్ధాలకు, భజనలకు వేదిక అంటూ పొన్నం ఎద్దేవా చేశారు. దేశంలో అబద్దాల ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆరే అని అన్నారు. ప్లీనరీ కోసం పదవ తరగతి ఫలితాలను వాయిదా వేయడం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్‌ మచ్చర్‌ పహిల్వాన్‌ అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ అబద్ధాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తామని అన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆరే అని విమర్శించారు. కేసీఆర్‌ అబద్దాలు, మోసాల మీద 'కేసీఆర్‌ అనే నేను' సినిమా తీస్తామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement