రాజకీయాలు వ్యాపారమయ్యాయి
అన్ని పార్టీల్లోనూ ఇదే సంస్కృతి: కారత్
సాక్షి, అమరావతి: నయా ఉదారవాద సంస్కరణల నేపథ్యం లో రాజకీయాలు వ్యాపారమయం అయ్యాయని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు ప్రకాశ్కారత్ ఆవేదన వ్యక్తంచేశారు. వ్యాపారులు, కాంట్రాక్టర్లు, మద్యం మాఫియా ముఠాలు, కార్పొరేట్ సంస్థల యజమానులు రాజకీయ పార్టీలలో చేరి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులవుతున్నారన్నారు. సీపీఎం సీనియర్ నేత మోటూరి హనుమంతరావు శత జయంతి సందర్భంగా ఆదివారం విజయవాడలో ఏర్పాటుచేసిన సభలో.. ‘నయా ఉదారవాద, నియంతృత్వ, మతతత్వ విధానాలు– ప్రత్యామ్నాయం’ అంశంపై ఆయన ప్రసంగించారు.
పీవీ నరసింహారావు మొదలు ఇప్పటివరకు అన్ని పార్టీలు దాదాపు ఇదే వైఖరిని ప్రదర్శిస్తున్నాయని చెప్పారు. మోదీ పాలన ప్రైవేటుమయమైందని, దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టినా, జాతి సంపదను ముక్కలు ముక్కలుగా అమ్మేసే పరిస్థితి వచ్చినా పార్లమెంటులో నోరు మెదపలేని, చర్చించలేని స్థితి వచ్చిందన్నారు. ఈ విధానాలను ఎదుర్కోవాలంటే ఐక్య ఉద్యమాలే పరిష్కారమని కారత్ అభిప్రాయపడ్డారు. నవంబర్లో మహాపడావ్ పేరిట పార్లమెంటు ఎదుట ఆందోళన చేయబోతున్నామని ఆయన తెలిపారు.
సంబంధిత వార్తలు