ఏపీ ప్రభుత్వానికి పవన్‌ అల్టిమేటం! | Sakshi
Sakshi News home page

ఏపీ ప్రభుత్వానికి పవన్‌ అల్టిమేటం!

Published Wed, May 23 2018 6:24 PM

Pawan Kalyan Slams Chandrababu On Special Category Status To AP - Sakshi

సాక్షి, టెక్కలి : ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కు సంజీవని కాదని సీఎం చంద్రబాబు నాయుడే స్వయంగా అన్నారని, దీన్ని బట్టి చూస్తే హోదాకు తూట్లు పొడిచింది టీడీపీ ప్రభుత్వమేనని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం సరైన విధివిధానాలు 48 గంటల్లో ప్రకటించాలని.. లేని పక్షంలో నిరసన దీక్షకు కూర్చుంటానని ఏపీ ప్రభుత్వానికి పవన్‌ అల్టిమేటం జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న పవన్‌ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా రాకపోవడానికి టీడీపీ ప్రభుత్వమే కారణమంటూ మండిపడ్డారు.

కాంగ్రెస్‌ చేసిన తప్పులనే చంద్రబాబు పునరావృతం చేస్తున్నారని విమర్శించారు. భావనపాడు రోడ్డు విషయంలో ఏపీ ప్రభుత్వం లాలూచీ పడిందని పేర్కొన్నారు. ఉద్దానంలో కిడ్నీ సమస్య ఇప్పటికీ అలాగే ఉందన్నారు. విదేశీ వైద్యులను సైతం ప్రభుత్వం ఉపయోగించుకోలేక పోయిందంటూ పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆరోగ్యశాఖ మంత్రి కూడా లేరని చెప్పారు. తాను ఇచ్చిన గడువులోగా కిడ్నీ బాధితుల కోసం ఏపీ ప్రభుత్వం విధివిధానాలు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే వారి సమస్యల పరిష్కారం కోసం తాను నిరసన దీక్షకు కూర్చుంటానని పవన్‌ ప్రకటించారు.

Advertisement
Advertisement