‘ఇందూరుకు నిజామాబాద్‌ పేరు అరిష్టం’

Nizamabad MP Dharamapuri Aravind Said TRS Candidate D Srinivas Joins In BJP - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: ఇందూరుకు నిజామాబాద్‌ పేరు ఉండటం అరిష్టమని ఎంపీ అర్వింద్‌ ధర్మపురి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే దేశానికి ప్రధాని మోదీ అవసరమని అన్నారు. తన తండ్రి, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ ప్రధాని మోదీ నాయకత్వాన​న్న బలపరిచే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన అన్నారు. తనను నమ్మి బీజేపీలో చేరుతున్న డీఎస్‌ అనుచర వర్గానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

తొలుత తాను బీజేపీలో చేరతానంటే వద్దన్న మా నాన్న ఇప్పుడు  తన నిర్ణయాన్ని సమర్థిస్తున్నారని ఎంపీ అర్వింద్‌ ధర్మపురి అన్నారు. ఆయన బీజేపీ కండువా కప్పకొనే యోచనలో ఉన్నారని, పెద్దాయన కాబట్టి బయటపడట్లేదని వెల్లడించారు. జిల్లాకు నిజామాబాద్‌ పేరు ఉండటాన్ని ప్రజలు అరిష్టంగా భావిస్తున్నారన్నారు. పేరులో నిజాం ఉండటం వల్ల నిజాంసాగర్‌ నిండటం లేదని, నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీ మూత పడిందని, నిజామాబాద్‌ రైతులు బాగుపడటం లేదని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ కుటుంబ పార్టీగా మిగిలిపోయిందని, దిశానిర్దేశం చేసే నాయకుడు లేకుండా పోయారని ఆయన ఎద్దేవా చేశారు. ట్రిపుల్‌ తలాక్‌ను రద్దు చేసిన ప్రధాని....దేశంలో కామన్‌ సివిల్‌ కోడ్‌ (సీసీసీ)ను తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీ నాయకులందరూ ఒక కుటుంబంగా కలిసిమెలిసి ఉండి రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలోని అన్ని బల్దియాలపైనా కాషాయజెండా ఎగుర వేసేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top