జనసేనను వీడేది లేదు: నాదెండ్ల మనోహర్
సాక్షి, అమరావతి: జనసేనను వీడుతున్నట్లు వస్తున్న వార్తలను ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ఖండించారు. తాను పార్టీని వీడేది లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే తాను విదేశాల్లో ఉండటం వల్ల పార్టీ సమీక్షా సమావేశాలకు హాజరు కాలేకపోయినట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆయన ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గం నుంచి జనసేన తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాగా ఇప్పటికే రావెల కిషోర్ బాబు వ్యక్తిగత కారణాలతో జనసేనకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ సమీక్ష సమావేశాలకు నాదెండ్ల హాజరు కాకపోవడంతో ఆయన కూడా పార్టీని వీడతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఆ వార్తలను నాదెండ్ల మనోహర్ ఖండించారు. మరోవైపు పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్...పార్టీ ఓటమి, భవిష్యత్ కార్యాచరణపై ఆయా జిల్లాల నేతలతో సమీక్ష జరుపుతున్నారు.