కుప్పంలోనే చర్చ పెడదాం.. బాబూ సిద్ధమా? | Gadikota Srikanth Reddy Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

కుప్పంలోనే చర్చ పెడదాం.. బాబూ సిద్ధమా?

Jun 6 2020 4:11 AM | Updated on Jun 6 2020 4:11 AM

Gadikota Srikanth Reddy Fires On Chandrababu - Sakshi

సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏడాది పాలన చూసి చంద్రబాబు కళ్లు బైర్లు కమ్మాయని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. జగనన్న పాలనలో మంచి వర్షాలు పడి రాష్ట్రం సుభిక్షంగా, రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. కానీ బాబు తమ పాలనే గొప్పగా ఉన్నట్లు చెప్పుకోవడం సిగ్గు చేటని విమర్శించారు. చంద్రబాబు, టీడీపీ నేతలు పంచభూతాలను దోచుకున్నారని శ్రీకాంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ కార్యక్రమాల అమలుపై కుప్పంలో చంద్రబాబుతో చర్చకు తాను సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. బహిరంగ చర్చను కుప్పం నియోజకవర్గం నుంచే మొదలు పెడదామని తెలిపారు. ఎవరిది విధ్వంసపాలనో, ఎవరిది సంక్షేమపాలనో కూడా తెలుసుకుందామని, తానే స్వయంగా కుప్పం వస్తానని చంద్రబాబు కూడా రావాలని గడికోట సవాల్‌ చేశారు. బాబు రాలేకుంటే లోకేష్‌ను బహిరంగ చర్చకు పంపాలని సూచించారు. ధైర్యం ఉంటే చంద్రబాబు ఈ సవాలును స్వీకరించాలన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ...  

► సీఎం వైఎస్‌  జగన్‌ ప్రభుత్వం ఏడాదిలో సుమారు నాలుగుకోట్ల మంది ఖాతాల్లో రూ.40 వేల కోట్లుకుపైగా జమ చేసింది.   
► కేవలం రూ. వందకోట్లతో ఖజానాను వదిలి వెళ్లినా కూడా ఏడాది కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేశారు. 
► బాబును ప్రజలు తిరస్కరించినా ఇంకా బుద్ధి రాలేదు. భవిష్యత్తులో టీడీపీ గుర్తింపు కూడా రద్దవుతుంది. ప్రజలు బాబు గుర్తింపునే రద్దు చేస్తారు. 

బాలకృష్ణ మానసిక స్థితిపై అనుమానాలు
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మానసిక పరిస్థితిపై అనుమానాలున్నాయని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు వెల్లడించారు. బాలకృష్ణ వాస్తవాలు తెలుసుకోకుండా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని, ఆయన మానసిక పరిస్థితి బాగోలేదని గతంలోనే డాక్టర్లు చెప్పారన్నారు. ఆయన ఎమ్మెల్యేగా అనర్హుడన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement