ఈటలపై కారు మాజీ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని మల్లేశ్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో మంత్రి ఈటల రాజేందర్పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన కారు మాజీ డ్రైవర్ మేకల మల్లేశ్యాదవ్ ప్రకటించారు. శుక్రవారమిక్కడ ప్రెస్క్లబ్లో మల్లేశ్ మాట్లాడుతూ.. ఈటల వద్ద డ్రైవర్గా పనిచేస్తూ ఆయనతో కలసి ఉద్యమంలో పాల్గొన్నానని చెప్పారు. అసెంబ్లీలో జరిగిన ఘటనలో 45 రోజులు జైలు శిక్ష అనుభవించినట్లు గుర్తుచేశారు.
జైలు నుంచి విడుదలయ్యాక తనను సన్మానించి ఆర్థిక సాయం కింద రూ.30లక్షలు దాతలు ఇచ్చారని, వాటిని ఈటల తీసుకున్నట్లు ఆరోపించారు. జైలుకు వెళ్లడంతో ఉద్యోగం పోయిందని, తర్వాత కూలీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు తెలిపారు. ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు. ఈటలతోపాటు, అందరూ తన కు అన్యాయం చేశారని, తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.