
సాక్షి, సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో పాలక కాంగ్రెస్ను మట్టికరిపించి బీజేపీ అధికార పగ్గాలు చేపట్టేందుకు అవసరమైన మెజారిటీ సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ను చేజిక్కించుకుంది. 68 స్ధానాలు కలిగిన హిమాచల్ ప్రదేశ్లో హాఫ్వే మార్క్ను దాటిన బీజేపీ 40 స్ధానాల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. కాంగ్రెస్ కేవలం 22 స్ధానాలకే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇతరులు 5 చోట్ల విజయం సాధించనున్నారు.
వీరభద్రసింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత బీజేపీకి కలిసివచ్చింది. హిమాచల్ మాజీ సీఎం ప్రేమ్ కుమార్ ధుమల్ను బీజేపీ తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్లింది. ధుమల్ బీజేపీ నేతృత్వంలో1998 నుంచి 2003 వరకూ, తిరిగి 2008 నుంచి 2012 వరకూ రెండు సార్లు హిమాచల్ సీఎంగా వ్యవహరించారు. సీఎం వీరభద్రసింగ్ అవినీతి కేసుల్లో సీబీఐ, ఈడీ విచారణను ఎదుర్కొంటుడటంతో అవినీతి ప్రధాన ప్రచారాస్త్రంగా బీజేపీ ప్రజల్లోకి వెళ్లింది.
ప్రధాని నరేంద్ర మోదీ హిమాచల్ ఎన్నికల్లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్గా పలు ర్యాలీల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ సర్కార్ అవినీతిని ప్రచార సభల్లో ఎండగట్టారు. పేదలకు ఉద్దేశించిన రూ 57,000 కోట్లను వీరభద్రసింగ్ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపణలు గుప్పించారు.