పుల్వామా ఉగ్రదాడి కాదు.. ఓ యాక్సిడెంట్‌ : బీజేపీ నేత

BJP Leader Calls Pulwama Attack an Accident - Sakshi

న్యూఢిల్లీ : పుల్వామాలో జరిగింది ఉగ్రదాడి కాదని, అది ప్రమాదవశాత్తు జరిగిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం దిగ్విజయ్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో దిగ్విజయ్‌ పాకిస్తాన్‌ మద్దతుదారుడంటూ బీజేపీ సీనియర్‌ మంత్రులు ఆయనపై విమర్శల వర్షం కురింపించారు. ఈ వివాదం సద్దుమణగకముందే.. బీజేపీ ఎమ్మెల్యే ఒకరు పుల్వామాలో జరిగింది ఉగ్రదాడి కాదు.. ఓ యాక్సిడెంట్‌ మాత్రమే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీని ఇరుకున​ పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన దిగ్విజయ్‌.. ‘ఇప్పుడేమంటారు మోదీ’ అంటూ ప్రశ్నించారు.

దిగ్విజయ్‌.. ‘పుల్వామా ఉగ్ర దాడిని నేను ప్రమాదవశాత్తు జరిగింది అంటే నా మీద విరుచుకుపడ్డారు. ఓ ముగ్గురు కేంద్ర మంత్రులైతే.. ఏకంగా నాపై పాకిస్తాన్‌ మద్దతుదారుడిగా ముద్ర వేశారు. మరి ఇప్పుడు మీ పార్టీ నాయకుడు.. ఉత్తరప్రదేశ్‌ డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్‌ మౌర్య కూడా పుల్వామా ఉగ్ర దాడిని ఓ యాక్సిడెంట్‌ అని స్పష్టం చేశారు. దీనిపై మీ స్పందన ఏంటి.. మినిస్టర్‌పై మీరు తీసుకోబోయే చర్యలేంటి మోదీజీ’ అంటూ దిగ్విజయ్‌ ట్వీట్‌ చేశారు.

తీవ్ర దుమారం రేపిన ఈ వీడియోలో కేశవ ప్రసాద్‌ మౌర్య మీడియాతో మాట్లాడుతూ.. ‘ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగింది ఉగ్ర దాడి కాదు. భద్రతా లోపం వల్ల కూడా జరగలేదు. ఇది కేవలం ఓ యాక్సిడెంట్‌ మాత్రమే. దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో పలువురు సీఆర్పీఎఫ్‌ జవాన్లు మృతి చెందారు. దాంతో మోదీ బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఇక ఇప్పుడు బలగాలకు ఏది మంచిదనిపిస్తే దాన్నే ఆచరిస్తాయ’ని తెలిపారు. బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులకు ఆధారాలు చూపించాలని కాంగ్రెస్‌ సీనియర్‌నేత కపిల్‌ సిబాల్‌ డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top