సాక్షి, అమరావతి: అసెంబ్లీని వైఎస్సార్సీపీ సభ్యులు పార్టీ కార్యాలయంగా మార్చారంటూ టీడీపీ సభ్యులు చేసిన ఆరోపణలపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ పదాన్ని వారు ఉపసంహరించుకోవాలని ఆయన సూచించారు. తన విచక్షణాధికారాన్ని ఉపయోగించుకొని సభలో వల్లభనేని వంశీ మాట్లాడేందుకు అనుమతి ఇచ్చానని ఆయన స్పష్టం చేశారు. గతంలో ఎన్టీఆర్కు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, ఆ పాపంలో తానూ భాగస్వామినేనని, అందుకే భగవంతుడు తనను 15 ఏళ్ల పాటు అధికారానికి దూరం చేశాడని స్పీకర్ అన్నారు.
టీడీపీ రెబల్ నేత వల్లభనేని వంశీ మాట్లాడుతూ.. చంద్రబాబు, ఆయన తనయుడి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరకాటంలో పడిన టీడీపీ సభ్యులు సభలో స్పీకర్పై విమర్శలు చేస్తూ.. వాకౌట్ చేశారు. వంశీ మాట్లాడిన అనంతరం టీడీపీ సభ్యులు మళ్లీ సభకు హాజరయ్యారు.


