నేను కోరే శాంతి ఈ మామూలు శాంతి కాదు | may 19th chalam birth aniversary | Sakshi
Sakshi News home page

నేను కోరే శాంతి ఈ మామూలు శాంతి కాదు

May 16 2016 12:35 AM | Updated on Sep 4 2017 12:10 AM

నేను కోరే శాంతి ఈ మామూలు శాంతి కాదు

నేను కోరే శాంతి ఈ మామూలు శాంతి కాదు

సుఖపడవలసినవాళ్ళు జీవితంలో యివేమీ పెట్టుకోరు. అసలు జీవితంలో వాళ్ళు యివి తీసుకోరు. తమ ఆలోచనలలో గాని, జీవితంలో గాని తీసుకోరు..

మే 19న చలం జయంతి
 
నేను జీవితమంతా ఆశించింది శాంతి. కాని నా తల ఎప్పుడూ ఆలోచనలతో, సమస్యలతో బాధపడుతో వుండేది. రాత్రి పడుకున్నా, తెల్లారి లేచినా, ‘‘ఏమిటి యిదంతా?’’ అనేటటువంటి ఒక పెద్ద సమస్య పట్టుకునేది. కాని ఎన్నడూ శాంతిని నిలుపుకోలేదు. ఆనాడు నేను అనుకున్న శాంతి కావాలంటే ఏ జోలికిపోక నా డబ్బుని నేను దాచుకుని, నా తిండిని నేను తిని, ఇంకొకరి సంగతి పట్టించుకోక నిద్రపోవడం; అట్లా వుండాలనే ఆలోచనే రాలేదు నా తల్లోకి.

శాంతిని భగ్నం చేసేటటువంటి పనులన్నీ చేసేవాణ్ని. నేను సమస్యలు గనక పెట్టుకోకపోతే, నా జీవితంలో నేను ఏ మాత్రమూ అశాంతి పడవలసిన పనిలేదు. నాలో పుట్టిన ఉద్రేకాల్నించి శాంతి నాకు కావాలి. అన్ని సమస్యలూ, స్త్రీల సమస్య, మృగాల సమస్య, బిడ్డల సమస్య, లోకం సమస్య యివన్నీ గూడా నా శాంతిని నాశనం చేశాయి.

సుఖపడవలసినవాళ్ళు జీవితంలో యివేమీ పెట్టుకోరు. అసలు జీవితంలో వాళ్ళు యివి తీసుకోరు. తమ ఆలోచనలలో గాని, జీవితంలో గాని తీసుకోరు. ఎవరన్న వొస్తే ఓ అట్టానా! అని పంపించేస్తారుగాని, తమ లోపలికి తీసుకుని ఏమిటి బాధ అని వాళ్ళని ప్రశ్నించరు. ఆ విధంగా ఎవరిదో ఒకరి బాధ నా జీవితమంతా వ్యాపించి వుండేది. అబ్బ ఇంక పెట్టుకోలేననుకునేవాణ్ని, కాని ఇంకా వొచ్చేవి. మరి శాంతిని ఈ విధంగా కోరుతూ ఎందుకు ఎప్పడూ అశాంతి నిచ్చేవాటిలోకి పోవాలి? ఎందుకంటే- యిప్పుడు తెలుస్తోందన్నమాట.

అశాంతి నిచ్చేవి నా జీవితంలోకి రాకపోతే నేను వుత్త మొద్దులాగుండేవాణ్ని. బడికి వెళ్ళడం, ఇంటికి రావడం, భోజనం చెయ్యడం, కూచోడం, ఏదో పుస్తకాలు చదవడం, ఇంతకంటే నాకు పనేమిటి? అదంతా శాంతి, ఇప్పుడు ఆలోచిస్తే తెలుస్తోంది నేను కోరే శాంతి ఈ మామూలు శాంతి కాదు.
 (చలం ఆత్మకథ ‘చలం’ లోంచి...)
 
దిక్కులేని స్థితిలో చలం సమాధి
రెండేళ్ల క్రిందట యానాం ప్రాంతానికి చెందిన తొలితరం కథకుడు వి.వి.సుబ్బరాజు, తమిళనాడులోని తిరువణ్ణామలైలో దిక్కూమొక్కూ లేకుండా పడివున్న రచయిత చలం సమాధి గురించి తెలియజేశాడు.
 ఈనెల 7వ తేదీన నేను తిరువణ్ణామలై వెళ్లాను. ఎంతో కష్టపడి చలం సమాధి ఉన్న చోటు కనుక్కోగలిగాను. రమణాశ్రమానికి కొంత దూరంలో రోడ్డువార చెత్తాచెదారం మధ్య ఒక సమాధి కనిపించింది.

అక్కడ ఒక చెట్టుకింద కూర్చున్న యాచకులనూ, కొబ్బరి బొండాలు అమ్మేవాళ్లనూ ఆ సమాధి ఎవరిదని అడిగితే వెనకాల ఉన్న ఆఫీసులో కనుక్కోమన్నారు. అక్కడ ‘శాంతిమలై హేండీక్రాఫ్ట్స్ డెవలప్‌మెంట్ ట్రస్ట్’ (విలేజ్ వుమన్ హేండీక్రాఫ్ట్స్)  పేరుతో ఉన్న ఆఫీసులో ఉద్యోగినులను అడిగాము (నాతో ఉన్న మా అబ్బాయి చక్రవర్తికి తమిళం తెలుసు). అది ఎవరో జలం అనే తెలుగు రైటర్ సమాధి అనీ, అప్పుడప్పుడు ఎక్కడి నుంచో ఒక ముసలాయన వచ్చి దానిని శుభ్రం చేసి పెడుతుంటాడనీ చెప్పారు. అంతకంటె వివరాలు చెప్పలేకపోయారు.

అతిదారుణమైన విషయం ఏమిటంటే, ఆ సమాధి మీద చనిపోయిన వ్యక్తి పేరుగానీ, ఇతర వివరాలుగానీ ఏమీలేవు. సమాధి చుట్టూ ఉన్న అతిచిన్న ప్రహరీని చేర్చి కొంతమంది చిరువ్యాపారుల తోపుడుబళ్లు ఉన్నాయి. రోడ్డు విస్తరణలాంటిదేమైనా జరిగితే సమాధి మొత్తం లేచిపోయే ప్రమాదం కూడా ఉంది. తన రచనలతో ఆంధ్రదేశంలో పెను సంచలనం సృష్టించిన మహారచయిత చలం సమాధి  'unwept, unsung, unhonoured' అన్నట్టుగా ఉండటం చూసి ఎంతో బాధ కలిగింది.


- అదృష్టదీపక్
 9440528155

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement