కావ్యం/ మేఘసందేశం: మళ్లీ ఆషాఢ మాసం వచ్చింది. ప్రతి మాసానికి దాని ప్రత్యేకతలున్నాయి. ఆషాఢమంటే కర్షకుడు ఏమరుపాటు లేకుండా ఒళ్లు వంచవలసిన కాలం. సన్యాసులకు చాతుర్మాసానికి సన్నాహం చేసుకునే సందర్భం. అత్తాఅల్లుళ్లు ‘ఒకే గడప దాటకూడని వేడుక’ వేళ వివాహ మహోత్సవాలకు విరామం. విరహోత్కంఠ విజృంభించే విషమ సమయం.
కాళిదాస మహాకవి మేఘసందేశ కావ్యం కథ ఆషాఢంలో మొదలవుతుంది. ఒకానొక యక్షుడు భార్య మీద నిరంతర ధ్యాసతో తన విధులు నిర్లక్ష్యం చేసి తన ప్రభువైన కుబేరుడి వల్ల శాపం పొందాడు. ఒక సంవత్సరంపాటు అలకానగరం నుంచి బహిష్కృతుడై ఎక్కడో దక్షిణాన దూరంగా పూర్వం సీతాదేవి తన భర్తతో వనవాసం చేస్తూ గడిపిన రామగిరి ఆశ్రమాల ప్రాంతంలో కాలం గడపవలసి వచ్చింది. దుర్భరమైన భార్యావియోగ భారంతో ఎనిమిది నెలలు ఎలాగో గడిపేశాడు. ఇంతలో ఆషాఢం వచ్చి ఆకాశం మేఘావృతమైంది. ఇక యక్షుడు తన విరహ వేదన భరించలేకపోయాడు.
తస్మిన్-అద్రౌ, కతిచిత్-అబలా విప్రయుక్తః స కామీ
నీత్వా మాసాన్ కనక వలయ భ్రంశ రిక్త ప్రకోష్ఠః
ఆషాఢస్య ప్రథమ దివసే మేఘం - అశ్లిష్ట సానుం
వప్రక్రీడా పరిణత గజ ప్రేక్షణీయం దదర్శ.
ఆ రామగిరి మీద అబలా విప్రయోగాన్ని భరిస్తూ ఆ ప్రేమైక జీవి విరహ తాపం వల్ల కృశించిపోయి, బంగారు చేతి అందె జారిపోవడం వల్ల బోసిపోయిన ముంజేతితో కొన్ని మాసాలు గడిపిన తరువాత, ఆషాఢమాసంలో తొట్ట తొలిరోజున కొండ కొమ్మను పట్టుకుని నిలిచిన మబ్బు కనిపించింది. ఆ మేఘం- వంగి తన దంతాలతో గుట్టలను ఢీకొంటూ ఆడుకుంటున్న ఏనుగులా ఉంది. మేఘాన్ని చూస్తే ఏ పడుచువాడికైనా ప్రేయసి ధ్యాసే మనసు నిండా పరుచుకుంటుంది గదా. ఇక భార్యావిరహంతో తల్లడిల్లుతున్న యక్షుడిమాట చెప్పేదేముంది?
పైగా అతగాడికి మరో బెంగ. అక్కడెక్కడో అలకాపురంలో తనలాగే విరహాగ్నితో కాగిపోతున్న తన భార్య మాటేమిటి? ఆమెకు కూడా అక్కడ మేఘాలోకనంతో గుండెగొంతుకలోన కొట్టాడుతుంటుంది కదా! అసలే సుకుమారి. అందులో విరహిణి. ఆపైన ఆషాఢమాసం. రాబోయేవి శ్రావణ, భాద్రపదాలు. అసలు ఆమె ప్రాణమన్నా నిలుపుకో గలుగుతుందా? భయంతో యక్షుడి మనసు కల్లోలమైంది. ఒక వెర్రి ఆలోచన వచ్చింది. ఎదురుగా కనిపిస్తున్న మేఘం ఎలాగూ ఉత్తరంగా ప్రయాణిస్తున్నది. చల్లగా ఆకాశమార్గంలో పోయిపోయి కొద్ది రోజులలో అలకా నగరం చేరుకొంటుంది. తన ప్రియురాలికి ఊరటనిచ్చి ఉసురు నిలిపే సందేశం ఆ ఆషాఢమేఘం ద్వారానే పంపితే?
అచేతనమై కేవలం ధూమ, జ్యోతి, సలిల, మరుతాల సమూహమైన మేఘం ఎక్కడా! గ్రహింపూ, కాళ్ళు చేతులూ, వాక్కూ ఉన్న మనుషుల ద్వారా పంపించాల్సిన ప్రేమ సందేశం ఎక్కడా? ఈ రెంటికీ పొంతన లేదేమోనని ఆ ప్రేమార్తుడికి సందేహం కూడా కలగలేదు. అప్పటికప్పుడే కొండమల్లెలు కోసి, వాటితో మేఘుడిని పూజించి, ప్రార్థించాడు.
‘ఓ మేఘుడా! అసంతృప్తులకు నువ్వే శరణు కదా. నా ప్రియురాలికి నా సందేశం చేరవేసి పుణ్యం కట్టుకోవయ్యా మిత్రమా! నువ్వు వెళ్ళాల్సింది అలకానగరం. వెళ్ళవలసిన త్రోవ నేను వివరంగా చెప్తాను. ఎనిమిది నెలలెలాగూ గడిచాయి, మరో నాలుగు నెలల్లో నేను వచ్చేస్తున్నానని నా భార్యకు చెప్పు. నేనూ తన కోసం తపిస్తున్నానని చెప్పు.
కంటికి కునుకు లేక కలలో కూడా ఆమెను దర్శించలేక పోతున్నానని చిత్తరువు కూడా కానరాక అలమటిస్తున్నానని చెప్పు. విరహతప్తమైన నా శరీరంతో అంతే తప్తమైన ఆమె శరీరాన్నీ నా అశ్రువులతో ఆమె అశ్రువులనూ నా నిట్టూర్పులతో ఆమె నిట్టూర్పులనూ కలపటం ప్రస్తుతం మనసు ద్వారా సాధ్యం! ఏం చేస్తాం యిది విధి! అయినా దిగులు పడవద్దని నా మాటగా చెప్పు. భాగ్య చక్ర భ్రమణంలో కింది దశ తరవాత పైదశ వచ్చి తీరుతుంది. మళ్ళీ మనం గువ్వల జంటలా కాలం గడిపే మంచిరోజులు వస్తాయని గుర్తు చెయ్యి!’ అని వేడుకొంటాడు. ఆషాఢంలో యక్షుడి విరహవేదన పాఠకుడి చేత కంటతడి పెట్టిస్తే కాళిదాస కవి పదాల పోహళింపూ, శయ్యా సౌందర్యం, వర్ణనా చమత్కృతీ శ్రావణ మేఘాలలా రసానంద బాష్పవర్షమే కురిపిస్తాయి. అందుకే ఆషాఢం వచ్చిందన్నా, ఆషాఢమేఘం కానవచ్చిందన్నా ఆ మేఘాల నడిమధ్యలో కవికుల గురువు ‘కశ్చిత్ కాంతా విరహ గురుణా స్వాధికారత్ ప్రమత్తః....’ అంటూ కమనీయమైన కావ్యగానం చేస్తూ కళ్ళముందు నిలుస్తాడు. ఆ మబ్బుకు ఆ వైపు రామగిరి అడవులలో ఒంటరిగా, దీనంగా నిలిచిన యక్షుడూ, ఈ వైపు చంద్రిక కోసం చాతక పక్షిలా అలకాపురంలో అమాయకంగా ఎదురుచూస్తున్న అన్నుల మిన్నా మనోగోచరమౌతారు.
- ఎం. మారుతి శాస్త్రి
Related news
-
ఉచితంగా ఇంగ్లిష్ నైపుణ్యాలు : ఈజీగా స్పొకెన్ ఇంగ్లీష్
సాక్షి, హైదరాబాద్: ఉపాధికి తప్పనిసరి అర్హతగా మారుతున్న ఇంగ్లీషులో మరింత మంది నైపుణ్యం సాధించాల్సిన అవసరం ఉందని ‘మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్’ వ్యవస్థాపకుడు, చీఫ్ కోచ్ డాక్టర్ ఏ. చిరంజీవి అభిప్రాయపడ్డారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ఏ రంగంలోనైనా ఇంగ్లిష్పై పట్టున్న వారికే అవకాశాలు మెరుగ్గా ఉంటున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్కారీ స్కూళ్లలో ప్రాథమిక విద్య నుంచీ ఇంగ్లీషు మీడియాన్ని అందుబాటులోకి తేవటం చాలా ప్రశంసనీయమన్నారు. రేపటి తరం పిల్లలంతా ఇంగ్లీషు విద్యను అభ్యసిస్తున్నారు కనక.. వారితో మ్యాచ్ కావాల్సిన నిన్నటితరం పెద్దలు, ఇంగ్లీషు భాషా నైపుణ్య లోపాల కారణంగా మెరుగైన అవకాశాలు అందుకోలేని యువత.. వీరందరి కోసం తమ సంస్థ ఉచితంగా ఇంగ్లీషు స్పీకింగ్ కోర్సును అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. ‘‘ఇంగ్లీషు నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్నవారికోసం ‘మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్’ సంస్థ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మా ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేసి 30 సంవత్సరాలవుతున్న సందర్భంగా ఈజీ ఇంగ్లీష్ కార్యక్రమాన్ని తలపెట్టాం. ఆన్లైన్లో ఉచితంగా అందజేస్తాం’‘ అని చిరంజీవి తెలియజేశారు. ఈజీ ఇంగ్లీష్ ద్వారా రాష్ట్రంలోని యువతకు కేవలం స్పోకెన్ ఇంగ్లీష్ మాత్రమే కాకుండా దాదాపు 9 రకాల అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలియజేశారు. ఈ నెల రెండో వారం నుంచి తరగతులు ప్రారంభించాలని భావిస్తున్నామన్నారు. ఉచితంగా.. అందరికీ ‘‘మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ను 1994లో ప్రారంభించాం. విశాఖపట్నంలో ఆరంభించి తెలుగు రాష్ట్రాల్లో 18 శాఖలుగా విస్తరించాం. ప్రస్తుతం ఆన్లైన్ మాడ్యూల్స్పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాం. మా సంస్థకు 30 ఏళ్లయిన సందర్భంగా అందిస్తున్న ఉచిత ఇంగ్లిష్ నైపుణ్య కోర్సుకు ఆసక్తి ఉన్న ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కోసం దిగువ ఇచ్చిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుకుంటే చాలు. వారి మొబైల్కు రిజిస్ట్రేషన్ లింకు వస్తుంది. లేనిపక్షంలో 9866006662 ఫోన్ నంబర్కు వాట్సాప్ ద్వారా వివరాలు పంపినా వారి మొబైల్ ఫోన్కు లింకును పంపిస్తాం". అదే విధంగా పది అంశాల్లో శిక్షణ.. "ఈజీ ఇంగ్లీష్ ద్వారా స్పొకెన్ ఇంగ్లీష్ తరగతులే కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, గోల్ సెట్టింగ్, పాజిటివ్ మెంటల్ ఆటిట్యూడ్, పబ్లిక్ రిలేషన్స్, స్ట్రెస్ మేనేజ్మెంట్, టైమ్ మేనేజ్మెంట్, మైండ్ మేనేజ్మెంట్, లీడర్షిప్ క్వాలిటీస్పై శిక్షణ ఇస్తాం. ప్రతి రోజు శిక్షణ ముగిసిన తర్వాత పరీక్ష పెట్టడంతో పాటు స్టడీ మెటీరియల్నూ ఇస్తాం. ఈ కార్యక్రమాలను ఆన్లైన్ పద్దతిలో లైవ్లో అందిస్తాం. అభ్యర్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత తరగతులు ప్రారంభిస్తాం. ఈ శిక్షణ కోసం మేధా ఇన్స్టిట్యూట్ తరపున 30 మంది నిపుణుల బృందం పనిచేస్తుంది. లైవ్లో నిర్వహించే ఈ తరగతులపై ఏవైనా సందేహాలుంటే చాట్ ద్వారా జవాబులిస్తాం’’ అని చిరంజీవి తెలిపారు. ఇవి చదవండి: వారెవ్వా.. నిఖిత : కోతులకు చుక్కలు చూపించింది.. దెబ్బకు! -
"కృష్ణ కృష్ణ - ఇదేమి ఘోరం!"
కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో టీఎం కృష్ణగా పేరు తెచ్చుకున్న తోడూరు మాడభూషి కృష్ణ చుట్టూ వివాదాలు ఎగసిపడుతున్నాయి. సంగీతంలో 'నోబెల్ ప్రైజ్' స్థాయిలో అభివర్ణించే మద్రాస్ మ్యూజిక్ అకాడమీవారి 'సంగీత కళానిధి' పురస్కారం-2024 టీఎం కృష్ణకు ప్రదానం చేయబోతున్నామని ఈ నెల 18వ తేదీన అకాడమీ ప్రకటించింది. అప్పటి నుంచి సంప్రదాయ సంగీత వాదుల నుంచి నిరసనల గళం పెద్దఎత్తున వినపడుతోంది. ఇది ప్రస్తుతం సంగీత ప్రపంచంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. టీఎం కృష్ణను సమర్థిస్తూ కూడా కొన్ని వర్గాలు తమ వాణిని బలంగా వినిపిస్తున్నాయి. ఆయనకు మద్దతు పలికేవారిలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా వున్నారు. ముఖ్యంగా ద్రవిడ సిద్ధాంతాలను బలపరిచేవారు, సనాతన సంప్రదాయం పట్ల గౌరవంలేనివారు, నాస్తికులు అందులో వున్నారు. టీఎం కృష్ణకు సంగీత కళానిధి పురస్కార ప్రకటనను నిరసిస్తూ, గతంలో ఈ పురస్కారాన్ని తీసుకున్న కొందరు వెనక్కు ఇచ్చేస్తున్నారు. చాలామంది కళాకారులు ఇక నుంచి మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో పాడబోమని, సంగీత కచేరీలు చేయబోమని తమ నిరసనను చాటుకుంటున్నారు. ఒక ప్రఖ్యాత ఇంగ్లీష్ పత్రిక అధినేతలలో ఒకరైన ఎన్.మురళి ప్రస్తుతం మద్రాస్ మ్యూజిక్ అకాడమీకి అధ్యక్షులుగా వున్నారు. టీఎం కృష్ణను ఈ పురస్కారానికి ఎంపిక చేయడంలో మురళి పాత్ర ప్రధానంగా వున్నదని సంగీత సమాజంలో గట్టిగా వినపడుతోంది. ఈ వివాదం ఇంతటితో ముగిసేట్టు లేదు. రకరకాల రూపం తీసుకుంటోంది. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ చరిత్రలో ఇంతటి వివాదం గతంలో ఎన్నడూ చెలరేగలేదు. టీఎం కృష్ణకు ఒక వర్గం మీడియా మద్దతు, సహకారం కూడా బాగా వున్నాయని అనుకుంటున్నారు. ఈయన ప్రస్థానాన్ని గమనిస్తే.. మొదటి నుంచీ వివాదాస్పద వ్యక్తిగానే ప్రచారం వుంది. వేదికలపైన పాడేటప్పుడే కాక, వివిధ సందర్భాల్లోనూ ఆయన చేసే విన్యాసాలు, హావభావాలపై చాలా విమర్శలు వచ్చాయి. అట్లే, ఆయనను మెచ్చుకొనే బృందాలు కూడా వున్నాయి. సంప్రదాయవాదులు ఎవ్వరూ ఇతని తీరును ఇష్టపడరు. ఈ క్రమంలో రేపు డిసెంబర్ లో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వేదికలో జరగబోయే ప్రతిష్ఠాత్మకమైన వేడుకలకు చాలామంది దూరంగా జరుగుతారని అనిపిస్తోంది. ప్రసిద్ధ జంట కళాకారిణులు రంజని - గాయత్రి పెద్ద ప్రకటన కూడా చేశారు. హరికథా విద్వాంసులు దుష్యంతి శ్రీథర్, విశాఖ హరి వంటీఎందరో నిరసన స్వరాన్నే అందుకున్నారు. తెలుగునాట కూడా అవే ప్రతిధ్వనులు వినిపిస్తున్నాయి. 1976లో తమిళనాడులో బ్రాహ్మణ కుటుంబంలో, శాస్త్రీయ సంగీత కుటుంబంలో జన్మించిన కృష్ణ మొదటి నుంచీ కొత్త గొంతును వినిపిస్తున్నారు. బ్రాహ్మణత్వంపైన, కర్ణాటక సంగీత ప్రపంచంలో బ్రాహ్మణుల పెత్తనం పెరిగిపోతోందంటూ కృష్ణ నినదిస్తున్నారు. సమాజంలో, సంగీత సమాజంలో ఎన్నో సంస్కరణలు రావాలని, సమ సమాజ స్థాపన జరగాలని మాట్లాడుతున్నారు. తాను గురుశిష్య పరంపరలోనే సంగీతం నేర్చుకున్నప్పటికీ దాని పైన తన దృక్పథం వేరని చెబుతున్నారు. చెంబై విద్యనాథ భాగవతార్ - కె జె ఏసుదాసు, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు - అన్నవరపు రామస్వామి వంటివారి గురుశిష్య బంధాలు ఆయనకు ఏ విధంగా అర్ధమవుతున్నాయో? అనే ప్రశ్నలు వస్తున్నాయి. త్యాగయ్య మొదలు మహా వాగ్గేయకారులందరిపైనా ఆయన వివిధ సమయాల్లో విమర్శనాస్త్రాలు సంధించారు. ఎం.ఎస్ సుబ్బలక్ష్మి దేవదాసి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ బ్రాహ్మణత్వంతోనే ప్రవర్తించారని, అదే పద్ధతిని అనుసరించి పాడుతూ పెద్దపేరు తెచ్చుకున్నారని, ఆ కీర్తి కోసమే ఆమె ఆలా చేశారని గతంలో కృష్ణ చేసిన విమర్శలు పెద్ద దుమారం రేపాయి. బ్రాహ్మణత్వాన్ని పులుముకోకపోతే ఈ శాస్త్రీయ సంగీత రంగంలో ఇమడలేరని, రాణించలేరని, అందుకే సుబ్బలక్ష్మికి కూడా అలా ఉండక తప్పలేదని కృష్ణ బాధామయ కవి హృదయం. కులాన్ని బద్దలు కొట్టాలని, కళలు, సంగీతం అందరికీ అందాలని, అది జరగడంలేదని వాదిస్తూ, సముద్ర తీరాలలో, మత్స్యకార వాడల్లో, వివిధ సమాజాల్లో కచేరీలు, సంగీత ఉత్సవాలు చేస్తూ వార్తల్లోకి ఎక్కారు. పర్యావరణ విధ్వంసంపైన, బీజేపీ ప్రభుత్వ విధానాలపైన, వివిధ ఉద్యమ వేదికల ద్వారా తన వ్యతిరేకతను చాటుకుంటూ వస్తున్నారు. కర్ణాటక సంగీతాన్ని గ్రామీణ ప్రాంతాలకు, వెనుకబడిన వర్గాల దగ్గరకు తీసుకెళ్లాలంటూ చేసిన ప్రదర్శనలు మీడియాను కూడ బాగా ఆకర్షించాయి. ఈ నేపథ్యంతో 2016లో ప్రతిష్ఠాత్మక 'రామన్ మెగసెసే అవార్డు' కూడా అందుకున్నారు. తమిళ భాషను, యాసను ప్రచారం చేసే క్రమంలో కృష్ణ తెలుగును చిన్నచూపు చూస్తూ వస్తున్నారు. త్యాగయ్య కీర్తనలు ఈనాటికి పనికిరావని, ఆ సాహిత్యం మూఢమైనదనే భావనలను కూడా ప్రచారం చేశారు. మహా వాగ్గేయకారులు రచించిన కీర్తనలను సాహిత్యానికి, భావానికి, భాషకు సంబంధం లేకుండా నడ్డివిరచి పాడుతూ మహనీయులను హేళన చేస్తున్నాడని, తెలుగు భాషను అవమానపరుస్తున్నాడనే విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇతను కేవలం సంగీత విద్వాంసుడుగానే కాక, ఉద్యమకారుడుగానూ ప్రచారంలోకి వచ్చాడు. ఈ.వి రామస్వామి పెరియార్ భావాలను అనుసరిస్తూ, గీతాలను సృష్టిస్తూ, గానం చేస్తూ, ప్రచారం చేస్తూ వున్నారు. ఇస్లాం, క్రిస్టియన్ పాటలు కూడా కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో స్వరపరచి ఎందుకు పాడకూడదు? అన్నది అతి వాదన. బ్రాహ్మణులు, దైవం, హిందూమతం, కాంగ్రెస్, మహాత్మాగాంధీని పెరియార్ వ్యతిరేకించారు. కృష్ణ కూడా ఇంచుమించు అవే భావనలలో వున్నారు. బీజేపీ, సంఘ్ పరివార్పైన కూడా అనేకసార్లు తీవ్రమైన విమర్శలు చేశారు. ఈయన ప్రస్తుత పురస్కారం ఎంపిక విధానాన్ని, అర్హతను గమనిస్తే, ఇతని కంటే గొప్పవాళ్ళు, జ్ఞాన, వయో వృద్ధులు ఎందరో వున్నారు. వాళ్లందరినీ కాదంటూ ఈయనకు ఈ పురస్కారం ఇవ్వాల్సినంత శక్తి సామర్ధ్యాలు, అనుభవం ఆయనకు లేవన్నది మెజారిటీ వర్గాల అభిప్రాయం. సంప్రదాయ వ్యతిరేకత ముసుగులో, సంస్కరణ మాటున సాహిత్యంతో పాటు శాస్త్రీయ సంగీతాన్ని కూడా అవమానిస్తున్నాడని సంప్రదాయవాదులంతా ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు భాషను ముక్కలు ముక్కలుగా నరికివేస్తున్నాడని తెలుగు భాషాప్రియులెందరో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రీయ సంగీతం పట్ల, వాగ్గేయకార మహనీయుల పట్ల, తెలుగు భాష పట్ల గౌరవం లేనప్పుడు అసలు ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నాడని అనేకులు మండిపడుతున్నారు. సంగీత కళానిధి పురస్కారం సంగతి అటుంచగా, ఇంతటి విపరీత ధోరణులతో ప్రవర్తిస్తున్న వ్యక్తిని చూస్తూ ఊరుకోబోమనే మాటలు సనాతన సమాజాల నుంచి వినపడుతున్నాయి. ఈ పురస్కార ప్రకటనను మ్యూజిక్ అకాడమీ విరమించుకుంటుందని చెప్పలేం. ఈ ధోరణులతో నడుస్తున్న కృష్ణ శాస్త్రీయ రాగాలను ఎంచుకోకుండా, తాను కొత్త కొత్త రాగాలను పుట్టించుకొని అందులో పాడుకొమ్మని కొందరు సలహా ఇస్తున్నారు. ఈ సనాతన భారతంలో "కృష్ణ కృష్ణ - ఇదేమి ఘోరం " అని సంప్రదాయ ప్రేమికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికే అనేకమంది అతనిపై న్యాయస్థానాలలో కేసులు కూడా పెడుతున్నారు. ఏమవుతుందో చూద్దాం. - రచయిత, మా శర్మ, సీనియర్ జర్నలిస్టు -
కేంద్ర సాహిత్య అకాడెమికి ఘన గౌరవం!
అవును,మనం వింటున్నది నిజమే!ఈ ఉత్సవం పెద్ద చరిత్ర సృష్టించింది, రికార్డుల పంట పండించింది, భారతదేశానికి,కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖకు మునుపెన్నడు లేని పెద్ద ప్రతిష్ఠను తెచ్చిపెట్టింది. ఇది చిన్న ఉత్సవం కాదు, మహోత్సవం,సారస్వత మహాయజ్ఞం. ఈ మహాయగాన్ని నిర్వహించింది 'కేంద్ర సాహిత్య అకాడెమి'. దీనిని నడిపింది ఆ సంస్థ కార్యదర్శి కె.శ్రీనివాస్. ఈ శ్రీనివాస్ పదహారణాల మన తెలుగువాడు. కృష్ణా తీరంవాడు, దివిసీమవాడు,కవిసీమవాడు. దశాబ్దాల కేంద్ర సాహిత్య అకాడెమి చరిత్రలో కార్యదర్శి హోదాను పొందిన మొట్టమొదటి తెలుగువాడు శ్రీనివాస్. అకాడెమి ప్రయాణంలో ఈ స్థాయిలో సాహిత్య మహోత్సవాలు జరగడం గొప్ప చరిత్ర. 'ప్రపంచ అతి పెద్ద సాహిత్య మహోత్సవం ' పేరుతో దిల్లీలో, కేంద్ర సాహిత్య అకాడెమి ప్రాంగణంలో,రవీంద్ర భవన్ లో ఈ మార్చి 11 వ తేదీ నుంచి 16 వ తేదీ వరకూ వేడుకలు ఘనంగా జరిగాయి.పోయిన ఏడాది కూడా జరిగాయి. ఈసారి ప్రత్యేకత ఏంటంటే? 'ఐన్ స్టీన్ వరల్డ్ రికార్డ్స్', దుబాయ్, 'వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్',లండన్ నుంచి ఘనమైన గుర్తింపు లభించింది. కేంద్ర సాహిత్య అకాడెమి సంస్థకు,అధిపతి కె.శ్రీనివాస్కు కూడా విశేషమైన అభినందనలు అందాయి. ఒక్కరోజులోనే, అతిపెద్ద సంఖ్యలో, అనేక భాషలవారు వివిధమైన సారస్వతాన్ని వినిపించినందుకు 'వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్ ', లండన్ గొప్ప రికార్డుగా నమోదు చేస్తూ సర్టిఫికెట్ పంపించింది. 1100 మంది ప్రతినిధులు 175 భాషలకు ప్రాతినిధ్యం వహిస్తూ,190 సెషన్స్ గా, వరుసగా 6రోజుల పాటు సారస్వత మహోత్సవంలో పాల్గొనడాన్ని అపూర్వమైన విశేషంగా అభివర్ణిస్తూ దుబాయ్ కి చెందిన ప్రతిష్ఠాత్మకమైన సంస్థ 'ఐన్ స్టీన్ వరల్డ్ రికార్డ్స్ ' ఈ ఉత్సవాన్ని ప్రపంచ స్థాయిలో అద్భుతమైన విషయంగా భావిస్తూ సర్టిఫికెట్స్ అందజేసింది.భాషా,సాహిత్య, సాంస్కృతిక ప్రేమికులకు గొప్ప ఆనందాన్నిచ్చే గొప్ప సందర్భం, సంరంభం మన దేశరాజధానిలో వెల్లివిరిసాయి. 'సామాజిక న్యాయం' అనే మాట ఈమధ్య మనం తరచుగా వింటున్నాం. సామాజిక న్యాయంతో పాటు సాహిత్యానికి కూడా ఈ మహోత్సవంలో గొప్ప న్యాయం జరిగింది. ప్రతి ఏటా జరుగుతోంది, ఈ ఏడు మరింత విశేషంగా జరిగింది.సాహిత్యంలోని విభిన్న ప్రక్రియలకు ప్రాతినిధ్యం కల్పించిన వేళ,ఆ యా రూపాలకు తత్ తుల్యమైన గౌరవం కూడా దక్కింది. దేశంలోని అనేక భాషల వాణి వినపడడమే కాక,లింగవివక్షకు తావులేకుండా అందరికీ సమ ప్రాతినిధ్యం లభించింది. కవితలు,కథలు,చిన్న కథలు, కళలు,సమీక్షలు,విమర్శలు,చర్చలు ఒకటేమిటి? ఈ ఆరురోజుల్లో ఎన్నో జరిగాయి. లబ్దప్రతిష్ఠులే కాక,మాన్యులు, సామాన్యులు,అతి సామాన్యులకు కూడా ఈ వేడుకలకు ఆహ్వానం అందింది. ఒక్కొక్క సభా వేదికకు ఒక్కొక్క మహనీయుని పేరు పెట్టి, ఆ మాననీయులకు నీరాజనం పలికారు. మహాకవి వాల్మీకి, వేదవ్యాసుడు,మీరాబాయి, కబీర్,శంకరదేవుడు,తులసీదాస్, తిరువాళ్వార్ వంటి మహానీయులను వేదికల ద్వారా తలచుకొని,తలపులలో నిలుపుకొని,నమస్కరించుకొనే సౌభాగ్యం కూడా ఈ వేదికల ద్వారా ప్రాప్తమైంది. కళలకు సాహిత్యం అవసరమా? మహిళాసాధికారికత, బాలసాహిత్యం,యువసాహితి, అనువాదం,అస్మిత,చదువరితనం, రచించే శక్తి,అభిరుచి, సమకాలీన సాహిత్య సరళులు, గిరిజన భాషా,సాహిత్య, సంస్కృతులు,నవల,నవలిక, నాట్యం,నాటకం, సారస్వత గమనంలో సవాళ్లు, భారతీయుల ఇంగ్లిష్ రచనా నిపుణత,ఈ -బుక్స్, ఆడియో బుక్స్, ప్రచురణకర్తలు ఎదుర్కొంటున్న సవాళ్లు, కవిత్వంలో స్త్రీ, సాహిత్యం అందించే ఆనందం, ప్రేరణ,ప్రభావం, సరిహద్దుల అవతల భారతీయ సాహిత్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, మన సారస్వత వారసత్వ వైభవం, విద్య అందించే సృజన, జనపదాలు, జానపదకథలు, కవిత్వ వ్యవసాయం, స్వాతంత్య్రానికి పూర్వం సాహిత్యం, భక్తి ఉద్యమ కవిత్వం, భావోద్వేగాలు, రచయితలతో ముఖాముఖీ, రామకథావిశేషాలు, మన ఘన సాంస్కృతిక వారసత్వం, మన మహాకావ్యాలు, మన తత్త్వ గ్రంథాలు, తాత్వికత,సైన్స్ ఫిక్షన్, సాహిత్యం సమకూర్చే విలువలు, ఆత్మకథలు,మీడియా, భిన్నత్వంలో ఏకత్వం, ఇతిహాసాలు,పురాణాలు, అణగారిన వర్గాల ఆలోచనా ధోరణులు,దళిత సాహిత్యం, వందేళ్ల భారత సాహిత్యం, భారతీయ భాషల సంరక్షణ, భిన్న స్వరాల్లో భారతీయ కవిత్వం, మౌఖిక సాహిత్యం, స్వాతంత్ర్యానంతర సాహిత్య సృష్టి... ఇలా ఎన్నో అంశాలను,రంగాలను స్పృశిస్తూ ఈ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇదే వేదికలపై 'కేంద్ర సాహిత్య అకాడెమి -2023' అవార్డుల ప్రదానోత్సవం కూడా ఘనంగా నిర్వహించారు. ఈ ఎంపిక ప్రక్రియలో 24 భాషీయులు పురస్కార ఘన గౌరవాన్ని అందుకున్నారు. అందులో మన తెలుగువారైన తల్లావఝల పతంజలిశాస్త్రి కూడా ఉండడం మనకు ముదావహం. సినిమా సాహిత్యంపై ప్రఖ్యాత ఉర్దూ కవి,రచయిత,గీతకారుడు గుల్జార్ ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకల్లో మాటవిడుపుగా మధ్య మధ్యలో సాగిన నృత్య,నాటక, సంగీత రూపక ప్రదర్శనలు కొంగ్రొత్త విందులను చిందించాయి. ఈ ఉత్సవాలతో పాటు గతంలో సిమ్లాలో,భోపాల్ లో నిర్వహించిన ' ఉన్మేష ఉత్సవాలు' రంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఆరు రోజుల ఉత్సవాలకు ఆహ్వానించిన ప్రతిఒక్కరికీ అన్ని ఖర్చులు,భోజన,వసతి,పారితోషిక వగైరాలన్నింటినీ అకాడెమి భరించింది. ఎన్నో వ్యయప్రయాసలతో నిర్వహించిన ఈ సాహిత్య మహోత్సవం అపూర్వ పర్వంగా అందగించింది. భారతీయ భాషా,సాహిత్య, సాంస్కృతులకు పెద్ద దివిటీలు పట్టిన శుభఘడియలు ఈ ఆరు దినములు. ప్రతి ఏటా ఇలాగే జరిగితే మన సారస్వత శోభ ప్రభాసమానమవుతుంది. 'ఆజాదీ కా అమృతోత్సవ్' లో భాగంగా జరిగిన ఉన్మేష ఉత్సవాలు కూడా ఆగకుండా జరగాలి. ఇంతటి చారిత్రక సభల ప్రభలు కట్టిన కేంద్ర సాహిత్య అకాడెమికి వీరతాళ్లు వేద్దాం. -రచయిత మా శర్మ, సీనియర్ జర్నలిస్టు (చదవండి: తెలుగు తల్లీ, అదుగోనమ్మా..!) -
మూడు దారులు.. వేరు.. వేరే!
'ముగ్గురు ముఖ్యమంత్రుల్ని దగ్గరగా చూసే అవకాశం చాలా తక్కువ మందికే ఉంటుంది. అలా చూడాలంటే అయితే రాజకీయ నాయకుడైనా అయి ఉండాలి లేకపోతే పాత్రికేయుడైనా అయి ఉండాలి. దేవులపల్లి అమర్ నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న పాత్రికేయుడు కావడంతో రాజకీయాల్లో దిగ్గజాలనదగిన ముగ్గురు నాయకులను అతి సమీపంనుంచి చూసి, వారి నడతను, వ్యవహార శైలినీ, రాజకీయ పరిణతిని అంచనా వేసే అవకాశం దొరికింది.' రాసింది ముగ్గురు నేతల గురించే అయినా, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటునుంచి మొదలుపెట్టి, ఆంధ్రప్రదేశ్ అవతరణ మీదుగా సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజన వరకూ తెలుగునాట చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను రచయిత విపులంగా కవర్ చేసే ప్రయత్నం చేశారు. రాజకీయాలపట్ల ఆసక్తి కనబరిచే ఈ తరానికి, ముఖ్యంగా యువతరానికి ఈ విషయాలన్నీ ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. (ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికైన టంగుటూరి ప్రకాశం పంతులు ప్రభుత్వం కాంగ్రెస్లో వేళ్లూనుకుపోయిన ముఠా సంస్కృతి కారణంగా కూలిపోయిందన్న సంగతి ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. ఇలాంటి విస్తుగొలిపే అనేక రాజకీయ పరిణామాల గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది) అప్పటి పరిణామాల గురించి ఈనాటి యువతరానికి జరిగింది జరిగినట్లు చెప్పేందుకు చేసిన ఓ ప్రయత్నమే ఈ పుస్తక రచన అని రచయితే స్వయంగా పేర్కొనడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. వైఎస్ఆర్, చంద్రబాబుల గురించి విశ్లేషించే క్రమంలో వారిద్దరినీ రచయిత ఒక తాసులో ఉంచి తూచే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తుంది. ఒకప్పుడు స్నేహితులుగా, తర్వాత రాజకీయ విరోధులుగా మారిన ఇద్దరు అగ్రశ్రేణి రాజకీయ నాయకులను ఇలా తూచి తీర్పు చెప్పడం తప్పేమీ కాదు. పైగా అప్పట్లో జరిగిన అనేక రాజకీయ పరిణామాలకు రచయిత సాక్షిగా ఉన్నందువల్ల సాధికారికంగా ఇలా బేరీజు వేసే అర్హత ఆయనకు ఉంది. ‘అధికారం కోసం పార్టీ మారి, అందలం కోసం అయినవాళ్లకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు, రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చి తృటిలో తప్పిపోయినా అదే పార్టీలో కొనసాగిన వైఎస్ రాజశేఖర్రెడ్డికు ఏ విషయంలోనూ పోలిక లేదు’ అంటారు రచయిత. వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేందుకు జగన్ చేసిన ప్రయత్నాలనూ, అధిష్ఠానం తృణీకార ధోరణిని భరించలేక వేరు పార్టీ పెట్టిన వైనాన్ని కూడా పుస్తకంలో విశదంగా పొందుపరిచారు. పదహారు నెలలు జైలులో ఉండి, బయటకు వచ్చి ప్రజాభిమానంతో ఆయన ముఖ్యమంత్రి అయిన క్రమాన్ని ఆసక్తికరంగా రాశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లకు పైగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన చంద్రబాబు మీద రచయిత విమర్శనాస్త్రాలు సంధించినా వాటన్నింటినీ సహేతుకంగా, సాధికారికంగా విశ్లేషించారు. ముఖ్యంగా 1984లో నాదెండ్ల భాస్కరరావు కుట్ర, 1995లో చంద్రబాబు వెన్నుపోటు ఉదంతాలను సరిపోలుస్తూ, ఈ రెండూ సంఘటనలూ ఒకే రీతిలో జరిగినా నాదెండ్ల తిరుగుబాటు జరిగినప్పుడు ప్రజల నుంచీ, ప్రజాస్వామ్య పక్షాలనుంచీ, మీడియా నుంచీ ఎన్టీఆర్కు లభించిన మద్దతు 1995లో చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే లభించలేదంటారు. వెన్నుపోటు సంఘటనను వివరించేందుకు ‘ఆ తొమ్మిది రోజుల్లో ఏం జరిగింది?’ అంటూ రచయిత ఒక ప్రత్యేక అధ్యాయాన్నే కేటాయించారు. తొమ్మిది రోజులపాటు రోజువారీ చోటు చేసుకున్న పరిణామాల గురించి చదువుతున్నప్పుడు రచయిత మరోసారి పాత్రికేయుడిగా పరకాయప్రవేశం చేశారనిపిస్తుంది. అన్నీ తనవల్లనే జరిగాయని చంద్రబాబు చెప్పుకుంటూ ఉంటారన్న రచయిత.. అబ్దుల్ కలామ్ను రాష్ట్రపతి చేసింది తానేనని, ప్రధాని అయ్యే అవకాశం తనకు రెండుసార్లు వచ్చిందనీ, తానే ఒప్పుకోలేదని చంద్రబాబు చెప్పుకోవడాన్ని తప్పుపట్టారు. ఈ రెండూ అబద్ధాలేనంటూ తగిన సాక్ష్యాలతో నిరూపించే ప్రయత్నం చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలననూ సాధికారికంగా విశ్లేషించారు. ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలు విషయంలో జగన్ చిత్తశుద్ధిని, అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యం పాటిస్తూ, అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న జగన్ పాలనను వివరించడానికి రచయిత ఒక ప్రత్యేక చాప్టర్ను కేటాయించారు. ఫోటోల ఎంపికలో రచయితకు ఫుల్ మార్కులు పడతాయి. ఆంధ్ర రాష్ట్రం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల ఫోటోలు ప్రచురించడం మెచ్చుకోదగినది. ఒకప్పుడు కాంగ్రెస్లో చెట్టపట్టాలు వేసుకుని తిరిగిన వైఎస్ఆర్, చంద్రబాబు పక్కపక్కనే కూర్చుని ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఆకట్టుకుంటుంది. రాజకీయాల్లో అవినీతి, అక్రమాలపై, నీతిబాహ్యమైన చర్యలపై రచయితకు గల ధర్మాగ్రహం ఈ పుస్తకంలో ప్రతి పేజీలోనూ కనిపిస్తుంది. తప్పయితే తప్పనీ, ఒప్పయితే ఒప్పనీ బల్లగుద్ది చెబుతూ సాగే రచయిత శైలి ఆకట్టుకుంటుంది. ఇప్పటి తరానికే కాదు, భావితరాలకు కూడా తెలుగు రాజకీయ పరిణామాలపై ఈ పుస్తకం ఒక గైడ్లా ఉపయోగపడుతుంది. – బీ.ఎస్. రామకృష్ణ (బీ.ఎస్.ఆర్) ఇవి చదవండి: భారతరత్నకు ఎంపికైన ఐదుగురూ 'పంచరత్నాలు' -
'తానా ప్రపంచ సాహిత్యవేదిక' గా 64 వ సాహిత్య సమావేశం
డాలస్, టెక్సాస్: తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో భాగంగా ఆదివారం నిర్వహించిన 64 వ సాహిత్య సమావేశం మన సినారె “విశ్వంభర” సంబురం ఘనంగా జరిగింది. తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు అతిథులందరినీ ఆహ్వానించి తన స్వాగతోపన్యాసంతో సభను ప్రారంభించారు. సభాప్రారంభకులుగా హాజరైన తెలంగాణా సారస్వత పరిషత్తు, సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి అయిన డా. జుర్రు చెన్నయ్య పద్మభూషణ్ ఆచార్య డా. సింగిరెడ్డి నారాయణ రెడ్డి జీవనరేఖలను ఆయన విద్యార్ధి దశ, సాహిత్య ప్రయాణం, నిర్వహించిన పదవులు, సాధించిన విజయాలు, చేసిన రచనలు, అందుకున్న సన్మాన సత్కారాలను సోదాహరణంగా ఒక విహంగ వీక్షణంలా నారాయణ రెడ్డి గారి ప్రతిభను గొప్పగా ఆవిష్కరించారు. తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ప్రముఖ కవి, పూర్వ రాజ్యసభ సభ్యులు, పూర్వ ఉపకులపతి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, ప్రముఖ సినీగీత రచయిత, పద్మభూషణ్, ఆచార్య డా. సి. నారాయణ రెడ్డి గారు తన జీవితకాలంలో అలంకరించిన పదవులు, సమవర్ధవంతంగా నిర్వహించిన బాధ్యతలు, సాధించిన విజయాలు ఏ సాహితీవేత్తకు దక్కని గౌరవాలు అన్నారు. ఆయన కలం నుండి జాలువారిన దీర్ఘ కావ్యం ‘విశ్వంభర’ కు సాహిత్యంలో అత్యున్నత జ్ఞానపీఠ పురస్కారం దక్కడం ప్రతీ తెలుగువాడు గర్వించదగ్గ విషయం అన్నారు. ప్రస్తుతం అదే విశ్వంభర కావ్యాన్ని ఇప్పుడు ప్రముఖ సినీ కథారచయిత జే.కే భారవి అత్యున్నత ప్రమాణాలతో శ్రవణరూపంలో ముద్రించడం హర్షదాయకం” అన్నారు. తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ “తెలుగు భాషాసాహిత్య వికాసాలకోసం తానా ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందని, ప్రముఖ కవి డా. సినారె రాసిన విశ్వంభర కావ్యాన్ని ప్రముఖ సినీ కథారచయిత జే.కే భారవి తన విశిష్టగళంలో ఆడియో రూపంలో ముద్రించడం ముదావహమని, ఇప్పుడు దానిని సాహితీలోకానికి తానా ప్రపంచ సాహిత్యవేదికగా విడుదలజేయడం ఆనందదాయకం అన్నారు.” సుప్రసిద్ధ సినీ కథారచయిత చిన్నికృష్ణ మాట్లాడుతూ.. తాను పలుమార్లు జే.కే భారవి రూపొందించిన విశ్వంభర ఆడియో విన్నానని, చాలా శ్రవణానందకరంగా ఉన్నదని, దీన్నే వీడియో రూపంలో తన స్వంత ఖర్చులతో దృశ్యమాలికగా తీసుకువచ్చే ఆసక్తి ఉన్నదని, త్వరలోనే ఈ విషయంలో సినారె కుటుంబసభ్యులను సంప్రదిస్తానన్నారు. సుప్రసిద్ధ కథారచయిత జే.కే భారవి మాట్లాడుతూ.. డా. సినారె విరచిత విశ్వంభర కావ్యాన్ని ఒక పిచ్చి వ్యామోహంతో ఎన్నో సార్లు చదివానని, ఎంతో ఆసక్తితో ఎన్నో వ్యవ ప్రయాసలకోర్చి దీన్ని అత్యున్నత ప్రమాణాలతో నేను రూపొందించిన ఆడియోని ఇప్పుడు తానా ప్రపంచ సాహిత్యవేదికగా విడుదలజేయడం చాల సంతోషంగా ఉన్నదని చెప్పారు. అలాగే దీనికి కారకులైన తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, తానా పూర్వధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూరకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. ప్రముఖ ప్రేరణాత్మక ప్రసంగకర్త ఆకెళ్ళ రాఘవేంద్ర విశ్వంభర కావ్యంలోని అనేక విషయాలను ఉటంకించి, ఆ కావ్య లోతుపాతుల్ని, కావ్య వైభవాన్ని ప్రతిభావంతంగా విశ్లేషించి సినారె సాహిత్య ప్రతిభను గొప్పగా ఆవిష్కరించారు. పద్మభూషణ్ డా. సినారె కలం నుండి వెలువడిన “విశ్వంభర” కావ్యం మొత్తాన్ని ప్రముఖ సినీ కథా రచయిత జే.కే భారవి గళంలో మీకోసం ప్రత్యేక కానుకగా ఈ క్రింది లింక్ను క్లిక్ చేసి వినవచ్చు. https://youtube.com/playlist?list=PL0GYHgMt2OQyx6qWv-kWt2bCxAl6GB5XO&si=D4SS-jzDXYhmqFQX
Related News by category
-
టెంక కాదు, టెక్నాలజీ ముఖ్యం
మామిడికాయ పచ్చళ్లకి సమయం ముంచు కొచ్చేసింది. తల్లులారా! మీరు టెక్నాలజీని వాడండి. నా మాట వినండి. ప్రపంచంలోనే మొదటిసారి మ్యాంగో పికిల్ యాప్ని ప్రారం భించనున్నారు. ఎందుకంటే ఇది మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు జాడీ. మన తెలుగింట ఆడపడుచులకు ఆవకాయల తయారీ కొట్టిన పిండి. దంచేయడం, పొడి చేయడం మన విద్య.ఈ సీజన్లో ఏపీలో కొన్ని వందల మెట్రిక్ టన్నుల మామిడి నిల్వ పచ్చళ్లని అమ్మలక్కలు జాడీలకెత్తుతారు. వీటి పాళాలు ఇంటికో తీరున, ఊరికో లెక్కన ఉంటాయ్. మన ఊళ్లలో ఆవకాయ పెద్దమ్మలు, మాగాయ మామ్మలు ఉంటారు. వాళ్లు మన ప్రాచీన ఋషుల్లా వారి అనుభవాలని క్రోడీకరించి ఫార్ము లాని ప్రచారంలోకి తెస్తారు. నమ్మిన వాళ్లు ఆచరిస్తారు. నమ్మనివాళ్లు నాస్తి కుల్లా మిగులుతారు.ఇందులో బ్రహ్మ విద్యలో ఉన్నట్లు రకరకాల వాదాలున్నాయ్. కొందరు టెంకవాదులు, మరికొందరు కండవాదులు, ఇంకొందరు టెంకండ వాదులు. అంటే రెండూ ముఖ్యమేనని విశ్వసించేవారు. పచ్చళ్లలో గ్లామర్ చింతకాయకి, గోంగూరకి లేదు. ఇది.బూర్జువా అభిరుచిగా అతి వాదులు ఆక్షేపిస్తూ ఉంటారు. ఆవకాయలో సామాజిక స్పృహమీద చర్చించడం ఆత్మలోకంలో దివాలా. కత్తిపీటల్లో ఆవకాయ కత్తిపీటలు వేరు. వూరికి రెండో మూడో ఉండేవి. ముందుగా వాటిని బుక్ చేసుకుని, తర్వాత కాయ తెచ్చు కునేవారు. ఆవకాయ ముక్క కొట్టడం ఒక విల క్షణమైన కళ. ఇది పరుష విద్య. కాయకే కాదు. ఈ పనికీ కండపుష్టి అవసరం. ప్రతి ముక్కకి అంతో ఇంతో టెంక పెచ్చు మనిషికి తత్వజ్ఞానంలా అతుక్కుని ఉండాలని శాస్త్రకారులు ఘోషిస్తున్నారు. అరిస్టాటిల్ హయాంలోనే ఈ ఆవకాయ సంప్రదాయం ఉన్నట్లు గ్రీక్ గ్రంథాలను జాగ్ర త్తగా పరిశీలిస్తే అవగతమవుతుంది. భాగవత పురాణంలో పోతన గోపాలకులు చద్దులారగించు వేళ మాగాయలాంటి నంజుళ్లని ఇష్టంగా తిన్నట్టు పేర్కొన్నారు. ఒక తెగ తెలుగువారు నూజివీడు చిన్న రసాలు, పెద్ద రసాలు ఆవకాయకి పెట్టింది పేరంటారు. ‘‘పీచు కావాలంటే హలో! నూజి వీడు రసాలకే చలో’’ అనే నినాదం ప్రచారంలో ఉంది. ప్రతి ఇంటా కారాలూ ఆవాలూ నూరే తరుణం ఇది. దినుసుల మీద కావల్సినంత గోష్టి నడుస్తుంది. ఈ రెండు నెలల్లోనే ఆవాలు, కారాలు, నూనెలు మీద జరిగే చర్చలకిగాను మొత్తంమీద రెండొం దల కోట్ల సెల్ బిల్ కాల్తుందని ఓ అంచనా. ఏ జిల్లా సంప్రదాయం ఆ జిల్లాదే. ఇప్పుడు చంద్రబాబు పూనుకుని, అందర్నీ ఓ జాడీ కిందికి తీసుకొచ్చి, అమరావతి ఆవకాయలుగా స్థిరీకరిస్తే బావుంటుందనిపిస్తోంది. ఈ వేసవిలో విదేశాలకు పంపే మామిడి పచ్చళ్లకి ప్రత్యేక కౌంటర్లు వెలుస్తాయ్. ఇండియాలో పెద్ద దిక్కు లేని వారికి, మేమున్నామంటూ కొన్ని సంస్థలు వచ్చాయ్. అన్నీ వాళ్లే చూస్తారు, ఎటొచ్చీ మనం డబ్బు చూడాలి. ఈ సీజన్లో అట్లాంటా నించి న్యూజెర్సీ నించీ, అమ్మా! హాయ్... సూపర్బ్, టిపికల్, వావ్ అంటూ లొట్టలు విని పించి, లక్షలాది తెలుగు ఇళ్లలో ఆనందాలు వెల్లివిరుస్తాయి. దీనికి ఇంత సత్తా ఉందని తెలిస్తే, చంద్రబాబు ఊరుకోడు. ఓ ఉచిత సలహా కేంద్రం, పంపడానికి ఓ సేవా కేంద్రం స్వయంగా రిబ్బన్ కత్తిరించి ప్రారంభించే అవకాశం ఉంది. ఆయనకి టెంక కంటే టెక్నాలజీయే ముఖ్యం! వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
సెప్టెంబర్ 17ను పండుగలా జరిపే రోజొస్తుంది!
సందర్భం తెలంగాణ విముక్తి పొందిన సెప్టెంబర్ 17న సంబరాలు అవసరం లేదని కేసీఆర్, ఆయన పార్టీ ఎంత ఘోషించినా ఆ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటారు ప్రజలు. భారతీయ జనతా పార్టీ చేస్తున్న డిమాండుకు తెలంగాణ యువత ముక్త కంఠంతో మద్దతు తెలిపింది. ఆ రోజున తెలంగాణలోని పట్టణాలు, పల్లెల్లోని ప్రతి వీధిలో మువ్వన్నెల జెండాలు ఎగురుతాయి. హైదరాబాద్ సంస్థాన విమోచన పోరు అంతగా పట్టించుకోదగినది కాదా? ఆ ఘట్టాన్ని ఒక రాజ్యవిలీనంగా, అధికార మార్పిడిలా మాత్రమే చూడాలా? ప్రాణాలు విడిచిన వేలాది మంది యోధుల త్యాగం గురించి మాట్లాడుకోవద్దా? రజాకార్ మూకలు చెరిచిన అసంఖ్యాక ఆడబిడ్డలకు జరిగిన అవమానం కూడా తేలికగా తీసుకోదగినదేనా? అధికారం కోసం ఏదైనా మాట్లాడొచ్చు, నాలుకను ఎన్నిసార్లు మడతవేసినా తప్పులేదనుకునే తెలంగాణ నయా నిజాం కేసీఆర్ చెబుతున్నదిదే. ఆయన పార్టీ నేతలు, మంత్రులు, సామంతులు నిజాంకు వ్యతిరేకంగా జరిగిన మహోజ్వల పోరును చిన్నదిగా చేసి చూపడాన్ని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానీకం గమనిస్తూనే ఉంది. ముందుతరం గోస గుర్తు చేసుకోదగిన చరిత్రే కాదంటున్న కేసీఆర్ ఎందుకలా అంటున్నారో తెలుసుకోలేని అమాయకులేం కాదు ప్రజలు. భారతదేశం బ్రిటిష్ పాలననుంచి స్వాతంత్య్రం పొందిన ఏడాదిదాకా ఇక్కడి భూభాగం ఎవరి పాలనలో ఉంది? సెప్టెంబర్ 17న విముక్తి పొందే దాక 13 నెలల పాటు తెలంగాణలో జరిగిన నరమేధం తేలికగా మర్చిపోగలిగేదేనా? మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (MఐM) మత సంస్థ పేరుతో ఖాసిం రజ్వీ నాయకత్వంలోని రజాకార్ల సేన సాగించిన ఊచకోతల గాథలను తెలంగాణ లోని ప్రతి పల్లె జ్ఞాపకం పెట్టుకుంది. నాడు రజ్వీని ఉసిగొల్పిన నిజాంకు, నేడు ఒవైసీ కోసం తెలంగాణ చరిత్రనే మర్చిపోమంటున్న కేసీఆర్కు మధ్య ఎంత సారూప్యం ఉందో చూస్తున్నాం. అందుకే ఆయనను నయా నిజాం అనాల్సి వస్తోంది. ‘భారత్కు స్వాతంత్య్రం వస్తే ఏమిటి...నేను పాకిస్తాన్లో భాగంగా ఉంటా...లేదా హైదరాబాద్ దక్కన్ స్వతంత్ర దేశంగా కొనసాగుతుంది. మెజారిటీ ప్రజలు హిందువులు కావచ్చు...వాళ్లు భారత్లో కలవాలంటే నేను విలీనం చేయాలా? తిరుగుబాటు చేసే వారిని మా మిలటరీ, రజాకార్లు చూసుకుంటారు’, ఆగస్టు 15, 1947న యావద్దేశం స్వాతంత్య్ర సంబరాలు జరుపుకుంటున్న వేళ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన సంస్థానంలోని ప్రముఖ్లతో అన్న పొగరుబోతు మాట లివి. మువ్వన్నెల జెండా ఎగరేసిన వారిని రజాకార్లు పిట్టల్లా కాల్చి చంపారు. లూటీలు, ఇళ్లు, ఆస్తుల దహనాలు, ఆడవాళ్లను చెరచడం, వివస్త్రలను చేసి బతుకమ్మలు ఆడిపించడం... సంస్థానమంతా ఒక అగ్నిగుండమైంది. తూర్పు పాకిస్తాన్ లాగా, దక్షిణ పాకిస్తాన్గా హైదరాబాద్ దక్కన్ను గుర్తించాలంటూ ఆఖరి గవర్నర్ జనరల్తో రాయబారాలు నడుపుతూనే, ఐక్య రాజ్య సమితికి వినతి పత్రాలు పంపించిన నక్క జిత్తుల నిజాం, ఆనాడు పన్నని కుయుక్తులు లేవు. కనీసం ప్రజా తిరుగుబాటు రాకుండా చూసుకుంటే భారత రిపబ్లిక్ నుంచి తనకు తక్షణ ముప్పు ఉండదని మిలటరీ, రజాకార్లను వదిలి పెట్టాడు. కోటి యాభైæ లక్షల మందిలో 13 శాతం మంది తన వాళ్లు తప్ప స్వాతంత్య్ర కాంక్షతో రగిలిన ప్రజలు నిజాం వదిలిన ముష్కరులకు భయపడకుండా ప్రాణాలకు తెగించి పోరాడేందుకు సిద్ధమయ్యారు. 1947 ఆగస్టు 15 తర్వాత విలీనమైన సంస్థానాల్లో ఎక్కడా ఇంత హింస, తిరుగుబాట్లు లేవు. పాలకులు ప్రజల ఆకాంక్షను మన్నించి రిపబ్లిక్లో కలపడానికి సిద్ధపడ్డారు. మరి నైజాం రాజు నేటి తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు వీరందరికి మించిన గొప్ప మానవతావాది ఎలా అయ్యోడో అర్థంకాదు. అధికారంలోకి రాకముందు విమోచన దినం జరపాలని డిమాండ్ చేసి, ఇప్పుడు ఈ సన్నాయి నొక్కులు ఎందుకు? నిజాం వార్షికాదాయం రూ. రెండున్నర కోట్లు. వజ్రాలు, వైఢూర్యాలు, బంగారం నిల్వలు, అరుదైన వస్తువుల లెక్క ఎవరికీ తెలియదు. 50 లక్షల ఎకరాల భూమి ఆయన సొంతం. ఇది మొత్తం సంస్థానం భూమిలో పది శాతం. నిజాంకు ఏజెంట్లుగా ఉన్న దేశ్ముఖ్లు, ఆయన తాబేదారులు 1,100 మంది చేతిలో 30 శాతం సేద్యపు భూమి ఉంది. సంస్థానంలో 40 లక్షల మంది కౌలుదారులే. వారికి గుంట భూమి కూడా లేదు. నిజాం సంస్థానంలో అక్షరాస్యత 9 శాతమే. అది కూడా మెజారిటీ హిందువుల మాతృభాష తెలుగులో చదువుకునే వీలే లేదు. నిజాంసాగర్, డిండీ, మూసీ ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిర్మించడం వెనుక ప్రజా సంక్షేమం కన్నా నిజాం స్వార్థమే ఎక్కువ. కృష్ణా, తుంగభద్ర, గోదావరి నదులు హైదరాబాద్ సంస్థానంలో నుంచే ప్రవహించినా వాటిపై పెద్ద డ్యాములు, బ్యారేజీలు నిర్మించే ప్రయత్నం జరగలేదు. వీటిని కట్టాలంటే సిమెంటు, ఉక్కు అవసరం. ఖజానాలోని పైకం ఖర్చవుతుంది. అందుకే అణా, కాణీ ఇచ్చి బలవంతపు కూలితో పూర్తి చేయగలిగే మట్టికట్టలనే నిర్మించారు. సంవత్సరంలో నెలకు పైగా రాజు నిర్మించే రోడ్లు, చెరువు కట్టల నిర్మాణాలకు ‘బేగార్’పేరుతో ఉచితంగా కూలీ చేయాలి. మొత్తం మీద నిజాం పాలనలో ప్రజలు తమ ఇళ్లు, గ్రామాలు అనే బహిరంగ జైలులో ఉన్నట్టే ఉండేది. పండగలు చేసుకోవాలన్నా, పెళ్లి, మరే శుభ కార్యం చేసుకోవాలన్నా రుసుం చెల్లించాల్సిందే. ఇట్లా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. రెండొందల ఏళ్ల అసఫ్ జాహి, నిజాం పాలకుల పీడనలో హైదరాబాద్ సంస్థానం ప్రజల జన్యుపటమే మారిపోయింది. సర్కారు కొలువు దొరికితే తప్ప గౌరవంగా బతకలేని స్థితి. వ్యవసాయం చేసేవారు, కూలీ పనులతో బతుకీడ్చే వారు దుర్భర దారిద్య్రంలో కొట్టు మిట్టాడుతూ దినదిన గండంగా బతికేవారు. బానిసత్వంలో మగ్గేవారు దేని గురించి ఆలోచించలేని శూన్య స్థితిలో ఉంటారు. ఇది భౌతిక హింస కంటే దారుణమైనది. ఇక్కడి ప్రజలు వ్యవసాయం, వ్యాపార గుణాలను ఇంకొకరి నుంచి నేర్చు కోవాల్సిన అవశ్యకతను కల్పించింది. వజ్రాలు, బొగ్గు ఖనిజాలు అపారంగా దొరికే చోట ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి గోస కనిపించదు. మూడు పూటలా తిండి దొరకని, ఒంటి నిండా గుడ్డలు కప్పుకోలేని దయనీయ స్థితి. 86శాతం మంది హిందువులు మైనారిటీలుగా మనుగడ సాగించిన ఘోరం. 13 శాతం మంది ముస్లిములదే ఆధిపత్యం. తెలంగాణ విముక్తి పొందిన సెప్టెంబర్ 17న సంబరాలు అవసరం లేదని కేసీఆర్, ఆయన పార్టీ ఎంత ఘోషించినా ఆ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటారు ప్రజలు. భారతీయ జనతా పార్టీ చేస్తున్న డిమాండుకు తెలంగాణ యువత ముక్త కంఠంతో మద్దతు తెలిపింది. ఆ రోజున తెలంగాణలోని పట్టణాలు, పల్లెల్లోని ప్రతి వీధిలో మువ్వన్నెల జెండాలు ఎగురుతాయి. దీన్ని ఎవరూ ఆపలేరు. మీరు బతుకమ్మను జరుపుకోవడానికి ప్రభుత్వ నిధులు కేటాయించనపుడు, అధికారిక ఉత్సవంగా ప్రకటించకపోయినా ఆ పండుగను ప్రజలు జరుపుకోలేదా? ఇది ఐదేళ్లు పాలించడానికి ఎన్నికైన ప్రభుత్వాలు నిర్ణయిస్తే తప్ప జరగాల్సిన పర్వదినమేమీ కాదు. కాకపోతే ఆరోజు అన్న మాటలు ఇప్పుడెందుకు మర్చిపోయారని మాత్రమే అడుగుతున్నాం. ముందు తరాల వాళ్లు సెప్టెంబర్ 17 విముక్తి దినాన్ని ఒక దసరాలా, దీపావళిలా జరుపుకుంటారు. వ్యాసకర్త బీజేపీ శాసనసభాపక్ష నేత జి.కిషన్ రెడ్డి మొబైల్ : 99490 99997 -
విద్యార్థులే ‘విమోచన’ సేనానులు
సందర్భం నిజాం నుంచి విముక్తి పొంది ఇండియన్ యూనియన్లో విలీనమయ్యే దిశగా సాగిన హైదరాబాద్ స్వాతంత్య్ర పోరాటంలో 1948వ సంవత్సరం అత్యంత విషాదకరమైన కాలం. భారత్ 1947 ఆగస్టు 15వ తేదీనే స్వాతంత్య్రం పొందినప్పటికీ హైదరాబాద్ సంస్థానం మాత్రం ఇండియన్ యూనియన్ నుంచి స్వతంత్రంగా ఉండాలని భావించడంతో నిజాం నియంతృత్వ పాలనలోనే మగ్గుతుండేది. దీంతో నిజాం వ్యతిరేక పోరాటం మరింత విస్తృతి పొందింది. ఈ కాలం లోనే ప్రభుత్వాన్నే స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తున్న చట్ట వ్యతిరేక మతోన్మాదుల కారణంగా సంస్థానంలో హింసాత్మకమైన, అసహనంతో కూడిన భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఆనాడు ప్రజలు ఈ ద్వంద్వపాలనను ఒక విచిత్ర పరిస్థితిలా చెప్పుకునేవారు. పగటిపూట ప్రభుత్వ పోలీసులు, ఎమ్ఐఎమ్ పాలన సాగుతుండగా, రాత్రిపూట మాత్రం కమ్యూనిస్టు పాలన సాగేది. ఈ అరాచక స్థితిలో బూర్గుల రామకృష్ణారావు, చెన్నారెడ్డి వంటి కాంగ్రెస్ నేతలు గ్రామాల్లో పర్యటించి పరిస్థితులను నిబ్బరంగా ఎదుర్కోవాలంటూ ధైర్యం నూరిపోసేవారు. దీంతో మంచి రోజులు మరెంతో దూరంగా లేవని ప్రజల్లో ఆత్మవిశ్వాసం కలి గింది. ఈ కాలంలోనే ప్రజల ప్రాణాలను, ఆత్మగౌరవాన్ని కాపాడటంలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా న్యాయవాదులు కోర్టులను బహిష్కరించాల్సిందిగా స్టేట్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ప్రభుత్వం స్తంభించిపోయేలా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలూ నిరసన తెలపాలని హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ సార్వత్రిక పిలుపునిచ్చింది. స్వాతంత్య్రోద్యమంలో విద్యార్థుల భాగస్వామ్యం కోసం ఈ రచయిత అధ్యక్షతనే విద్యార్థి కార్యాచరణ కమిటీ ఏర్పడింది. కళాశాలలను బాయ్కాట్ చేయాలని కోరుతూ హైదరాబాద్ స్టూడెంట్స్ కాంగ్రెస్ విద్యార్థులకు పిలుపునిచ్చింది. దీంతో దాదాపు 20 వేలమంది విద్యార్థులు కాలేజీలను బహిష్కరించారు. ఈ నేపథ్యంలో స్టేట్ కాంగ్రెస్ నేషనల్ ఫ్లాగ్స్ పిలుపు మేరకు హైదరాబాద్ స్టూడెంట్స్ కాంగ్రెస్ 1948 ఆగస్టు 15న పతాకావిష్కరణ దినోత్సవాన్ని పాటించింది. పలు ప్రాంతాల్లో ప్రత్యేకించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భవనాలపై పతాకావిష్కరణ చేశారు. ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో పతాకావిష్కరణ తర్వాత విశ్వవిద్యాలయం నుంచి, నిజాం కాలేజీతోపాటు ఇతర కాలేజీలనుంచి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నిజాం కాలేజీలో ఈ రచయిత నేతృత్వంలో ఒక ప్రదర్శన జరిగింది. తర్వాత వివేక వర్ధిని నుంచి మరొక విద్యార్థి ప్రదర్శనపై పోలీసులు దాడి చేసి కాల్పులు జరపడంతో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. ఆ సాయంత్రం భారత ప్రభుత్వ ఏజెంట్ జనరల్ కేఎం మున్షీ పతాకావిష్కరణ కార్యక్రమానికి ప్రజలను, నాయకులను ఆహ్వానించారు. నేనూ, సంగం లక్ష్మీబాయి (తదనంతర కాలంలో మంత్రి అయ్యారు), ఇతర స్టేట్ యూత్ కాంగ్రెస్ నేతలు ఆ ఉత్సవంలో పాల్గొనడానికి వెళుతుండగా రజాకార్లు దాడి చేశారు. నా తలలోంచి రక్తం కారింది. అలాగే దక్షిణ సదన్ వెళ్లి పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాను. హాజరవుతున్న విద్యార్థులపై రజాకార్ల పాశవిక దాడిని కేఎం మున్షీ గర్హించారు. హైదరాబాద్ నిజాం భారత యూనియన్కు విధేయత ప్రకటించి సంస్థానాన్ని విలీనం చేశారు. అయితే నాటి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్తో సుదీర్ఘ చర్చలు, భారత ప్రభుత్వ హోం శాఖతో సంప్రదింపులు జరిపాక, పోలీసు యాక్షన్ చేపట్టిన తర్వాతే నిజాం లొంగిపోయారు. హైదరాబాద్ సంస్థానంపై భారత ప్రభుత్వ బలగాలు 1948 సెప్టెంబర్ 3 వేకువజామున త్రిముఖ దాడి తలపెట్టాయి. కేంద్ర ప్రభుత్వ సైనిక బలగాలు సెప్టెంబర్ 17నాటికి హైదరాబాద్ చేరుకున్నాయి. స్వల్పమాత్రపు పసలేని ప్రతిఘటన తర్వాత నిజాం బలగాలు భారత సైన్యం ముందు లొంగిపోయాయి. తర్వాత మేజర్ జనరల్ జె.ఎన్. చౌదరి నేతృత్వంలో సైనిక ప్రభుత్వం ఏర్పడింది. ఏడవ నిజాం నవాబ్ సర్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్ తాత్కాలికంగా హైదరాబాద్ రాజప్రముఖ్గా నియమితులయ్యారు. విమోచన పోరాట కాలంలో నేను హైదరాబాద్ స్టేట్ స్టూడెంట్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, అఖిల భారత విద్యార్థి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించాను. ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించాను. కాంగ్రెస్, సోషలిస్టు, కమ్యూనిస్టు పార్టీ భేదాలు లేకుండా విద్యార్థులు హైదరాబాద్ స్వాతంత్య్ర పోరాటంలో అత్యంత ప్రముఖ పాత్ర పోషించారు. గత కొన్నేళ్లుగా తెలంగాణ స్వతంత్ర సేనాని సమితి, ప్రీడమ్ ఫైటర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అధ్యక్షుడిగా ఉంటూ ఇతర స్వాతంత్య్ర సమర వీరులతో కలిసి కోఠి బస్టాండ్, అమరవీరుల స్మారక స్థూపం వద్ద స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలను నిర్వహిస్తున్నాను. సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నాము. నాటి హైదరాబాద్ విమోచన పోరాటంలో పాలుపంచుకున్న స్వాతంత్య్ర సమరయోధుల స్మారకార్ధం తెలంగాణ ఆవిర్భావ దినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నివాళి పలకటం సముచితంగా ఉంటుంది. వ్యాసకర్త అధ్యక్షుడు, తెలంగాణ స్వతంత్ర సేనాని సమితి, ఏపీపీఎస్సీ మాజీ సభ్యులు డాక్టర్ బాబూ రావ్ వర్మ మొబైల్ : 99637 07461 -
ఇది విలీనదినమే!
త్రికాలమ్ ఈరోజు తెలంగాణ చరిత్రలో అత్యంత ముఖ్యమైనది. సరిగ్గా 69 సంవత్సరాల కిందట హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన రోజు. విలీ నానికి ఒప్పుకోనంటూ హఠం చేసి స్వాతంత్య్రం ప్రకటించుకొని ఐక్యరాజ్య సమితి గడప ఎక్కిన నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ మెడలు వంచి భారత్లో అంతర్భాగం కావడానికి ఒప్పించిన సందర్భం. దీనిని విమోచన దినంగా జరుపుకోవాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కోరుతున్నది. కాదు, విద్రోహదినంగా పరిగణిస్తామని మజ్లీస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) ప్రకటించింది. విలీనదినంగా పాటిస్తే బాగుంటుందని సాధారణ ప్రజల అభిప్రాయం. ఇంతకీ నాడు జరిగింది విలీనమా, విద్రోహమా, విమోచనా? చరిత్రను అన్వయించేవారికి స్వప్రయోజనాలు ప్రధానం. వారి దృష్టికోణం నుంచే పరిణామాలను అర్థం చేసుకుంటారు. వారి లక్ష్యాలకు అనుగుణంగానే అన్వయిస్తారు. భాష్యం చెబుతారు. హైదరాబాద్ సంస్థానం విముక్తికి ప్రధాన కారకుడిగా నాటి ఉపప్రధాని, దేశీయాంగమంత్రి సర్దార్ పటేల్ను బీజేపీ కీర్తిస్తుంది. హైదరాబాద్, జునాగఢ్ సంస్థానాలను ఇండియన్ యూనియన్లో విలీనం చేసే బాధ్యతను ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఉపప్రధానికి అప్పగించారు. ఆ పని సర్దార్ సమర్థంగా చేశారు. విలీనానికి ససేమిరా అన్న మూడో సంస్థానం జమ్మూ–కశ్మీర్ వ్యవహారంలో నెహ్రూ జోక్యం చేసుకున్నాడు. తన పూర్వీకులు నివసించిన కశ్మీర్ను పాకిస్తాన్కు పోకుండా కాపాడుకోవాలన్న తాపత్రయం ఒకవైపూ, సిసలైన ప్రజాస్వామ్యవాదిగా తనకున్న అంతర్జాతీయ ప్రతిష్ఠకు భంగం కలగకుండా చూసుకోవాలన్న అభిలాష మరోవైపూ లాగి నెహ్రూని ఇబ్బంది పెట్టినమాట వాస్తవం. నెహ్రూ డోలాయమాన వైఖరి కారణంగా జమ్మూ–కశ్మీర్ వివాదం తెగకుండా ముడిపడకుండా దశాబ్దాలు గడిచిపోవడం, పాకిస్తాన్తో యుద్ధాలు చేయవలసిరావడం కూడా నిజమే. నెహ్రూ, షేక్ అబ్దుల్లాల పట్టింపు లేకపోతే 1947–48 లోనే కశ్మీర్ పాకిస్తాన్లో విలీనమయ్యేది. ఈ నేపథ్యంలో కశ్మీర్ సంక్షోభానికి నెహ్రూను నిందించడం బీజేపీ విధానం. మొత్తం 560 సంస్థానాలను స్వతంత్ర భారతంలో విలీనం చేసింది నెహ్రూ, పటేల్ అనేది చరిత్ర. పీవీ నరసింహారావుకు కీర్తి దక్కడం ఇష్టంలేని సోనియాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ నాయకులు 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన దార్శనికుడు నాటి ఆర్థికమంత్రి డాక్టర్ మన్మోహన్సింగ్ అంటూ కీర్తించి తరిస్తున్నారు. మన్మోహన్సింగ్ను ఆర్థికమంత్రిగా నియమించిందీ, ఆర్థిక సంస్కరణలు అమలు జరపాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నదీ, ప్రతిపక్షాల విమర్శలకు తాళలేక రెండు విడతల రాజీనామా చేసిన మన్మోహన్ను అనునయించి నచ్చజెప్పిందీ, పరిశ్రమల శాఖను తన చెంతనే పెట్టుకొని విప్లవాత్మకమైన పారిశ్రామిక విధానాన్ని ఒకేరోజు ఏకబిగిన సహాయ మంత్రి కురియన్ (ప్రస్తుత రాజ్యసభ ఉపాధ్యక్షుడు) చేత ప్రకటింపజేసిందీ పీవీ అనే విషయం కాంగ్రెస్ నాయకులు తెలిసినా చెప్పరు. మన్మోహన్ పీవీ నమ్మిన బంటుగా ఆర్థిక సంస్కరణలను మనస్ఫూర్తిగా అమలు చేసిన అమాత్యుడు అనడంలో ఎవరికీ సందేహం అక్కరలేదు. కాంగ్రె స్కి పీవీపైన ఉన్న ద్వేషం కంటే నెహ్రూపైన నేటి తరం బీజేపీకి గల ద్వేషం అధికం. అందుకే హైదరాబాద్ విముక్తికి సర్దార్ పటేల్ మాత్రమే కారణమని బీజేపీ వాదిస్తుంది. నెహ్రూ సమ్మతించి, సహకరించకపోతే పటేల్ లక్ష్యం నెరవేరేది కాదనేది వేరే విషయం. పైగా ఎన్ని విభేదాలు ఉన్నా అంతిమ శ్వాస వరకూ పటేల్ నెహ్రూతో స్నేహంగా ఉండేవారు. పరస్పరం గౌరవించుకునేవారు. గాంధీజీకి ఇద్దరూ రెండు కళ్ళుగా ఉండేవారు. వెలుగు చూడని హైదరాబాద్ దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన పదమూడు నెలల వరకూ హైదరాబాద్లో నిజాం పాలనే కొనసాగింది. అంతకాలం నిజాం ధిక్కారం ప్రదర్శించాడు. ప్రైవేటు సైన్యంగా రజాకార్లను పెంచి పోషించాడు. దేశ్ముఖ్లనూ, భూస్వాములనూ కూడగట్టుకున్నాడు. భారతదేశంలో విలీనం కాబోనంటూ స్వతంత్రం ప్రకటించుకున్నాడు. పాకిస్తాన్ అధినేత మహమ్మదలీ జిన్నాతో రాయబారం నెరపాడు. ఐక్యరాజ్య సమితిలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు పెట్టాడు. ఇంత చేసిన నిజాంను లొంగిపోయిన తర్వాత బుట్టదాఖలు చేయకుండా ‘రాజ్ప్రముఖ్’ పదవి ఇచ్చి ఎందుకు గౌరవించారు? నిజాం కబంధ హస్తాలనుంచి హైదరాబాద్ ప్రజలకు విముక్తి కల్పించామని నెహ్రూ, పటేల్ భావించి ఉంటే విమోచన దినోత్సవాలు నిర్వహించేవారే. కానీ వారు ఆ విధంగా భావించలేదు. అన్ని సంస్థానాల పూర్వాధిపతులనూ సగౌరవంగా సాగనంపి వారి హోదాకు భంగం లేకుండా హంగులూ, నిధులూ ఏర్పాటు చేయడం నాటి ప్రభుత్వ విధానం. అదే విధంగా నిజాంకూ మర్యాదలు జరిగాయి. తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఖాసీం రజ్వీని దేశం వదిలి వెళ్ళనిచ్చారు. ఘర్షణ వాతావరణం లేకుండా శాంతియుతంగా ప్రగతి యజ్ఞానికి శ్రీకారం చుట్టాలన్న సంకల్పం వారిది. అందుకే హైదరాబాద్ రాష్ట్రంలోని బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం కానీ 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత సంజీవరెడ్డి, తదితర కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎన్టి రామారావు, చంద్రబాబునాయుడు కానీ సెప్టెంబర్ 17న సంబరాలు జరుపుకోలేదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ప్రత్యేక తెలంగాణ ఉద్యమనాయకుడిగా ప్రతి సంవత్సరం ఈ ప్రస్తావన చేసేవారు. సెప్టెంబర్ 17 నాడు కర్ణాటక, మహారాష్ట్రలలో విలీనమైన పాత హైదరాబాద్ సంస్థానం ప్రాంతాలలో జరుపుకున్నట్టు హైదరాబాద్లో కూడా సంబురాలు జరిపించాలని డిమాండ్ చేశారు, ఆ పని చేయనందుకు కాంగ్రెస్ ముఖ్యమంత్రులను తప్పుపట్టారు. అధికారంలోకి వచ్చాక ఆయన సైతం పాత ముఖ్యమంత్రుల బాటలోనే నడుస్తున్నారు. ఈ మౌనం వెనుక ముస్లింలను దూరం చేసుకోరాదనే విధానం కావచ్చు. పాత గాయాలను రేపడం ఎందుకన్న అభిప్రాయం కావచ్చు. కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో చరిత్రాత్మకమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. సుమారు నాలుగు వేలమంది యోధులు నేలకొరిగారు. జాగీర్దారుల, దేశ్ముఖ్ల దురాగతాలను వ్యతిరేకిస్తూ వారి గూండాలపైనా, రజాకార్లపైనా జరిగిన పోరాటం నిజాం పాలనా వ్యవస్థను కుదిపేసింది. నిజాం దారికి వస్తాడేమోనని నెహ్రూ, పటేల్ పదమూడు మాసాలు వేచి చూశారు. చర్చలతో పరిష్కారం కాకపోతే బలప్రయోగం చేయవలసి ఉంటుం దని నిజాంను నెహ్రూ హెచ్చరించాడు. పటేల్ 36 వేల మంది సైనికులను జనరల్ జెఎన్ చౌధురి నాయకత్వంలో పంపించారు. రజాకార్లు ప్రతిఘటించలేక దాసోహమన్నారు. నిజాం లొంగుబాటు సెప్టెంబర్ 17న నిజాం లొంగిపోయాడు. ఐక్యరాజ్య సమితిలో పెట్టిన కేసు ఉపసంహరించుకున్నట్టు రేడియో ప్రసంగంలో నిజాం చెప్పాడు. అది ఒత్తిడిలో చేసిన ప్రకటన కనుక కేసు ఉపసంహరణను ఆమోదించేది లేదంటూ ఐక్యరాజ్య సమితి స్పష్టం చేసింది. ఆ కేసు ఇటీవలి వరకూ సమితి పరిశీలనలో ఉంది. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజాసమితి తెలంగాణ ప్రాంతంలోని మొత్తం 14 లోక్సభ స్థానాలలో పది స్థానాలు గెలుచుకున్నప్పటికీ ప్రత్యేక రాష్ట్రం మంజూరు చేయలేదు. ఇందుకు ఇందిరాగాంధీ చెన్నారెడ్డికి చూపించిన కారణం ఈ కేసు. అంతకుముందు హైదరాబాద్ను ఆంధ్రలో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడం వెనుక కూడా ఈ కేసు ఉన్నదని అంటారు. జనరల్ చౌధురి నిర్వహించిన సైనిక చర్యను పోలీసు చర్య అనీ, ఆపరేషన్ పోలో అనీ, ఆపరేషన్ క్యాటర్పిల్లర్ అనీ పిలిచారు. వాస్తవంగా జరిగింది సైనిక చర్య. కానీ దానిని పోలీసు చర్య (పోలీస్ యాక్షన్)గా అభివర్ణించడంలోని ఆంతర్యం ఐక్యరాజ్యసమితిని చిరాకు పరచకూడదనే. సైనిక చర్య అంటే అది స్వతంత్రం ప్రకటించుకున్న రాజ్యంలో మరో దేశం జోక్యం చేసుకోవడంగా పరిగణించే ప్రమాదం ఉన్నదని భావించి ఉంటారు. సైన్యం నలుమూలల నుంచి హైదరాబాద్ను చుట్టుముట్టిన క్రమంలో హింసాకాండ జరిగిందని వార్తలు వచ్చాయి. నిజనిర్ధారణ కోసం నెహ్రూ పండిట్ సుందర్లాల్ నాయకత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని నియమించారు. కాజీ అబ్దుల్ గఫర్, మౌలానా మిస్రీ ఈ కమిటీలో తక్కిన సభ్యులు. ఈ కమిటీ 1948 డిసెంబర్లో మూడు వారాలు హైదరాబాద్ సంస్థానం ప్రాంతంలో పర్యటించి ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదిక చూసి నిర్ఘాంతపోయిన నెహ్రూ, పటేల్ దానిని రహస్య పత్రంగా పరిగణించి ప్రజలకు అందుబాటులో లేకుండా దాచారు. 2013లో కేంబ్రిడ్జికి చెందిన చరిత్రకారుడు సునీల్ పురుషోత్తమ్, మరో చరిత్రకారుడు మహమ్మద్ సలీయుల్లా పూనిక ఫలితంగా ఈ నివేదిక వెలుగు చూసింది. నాందేడ్, షోలాపూర్ పట్టణాలతో సహా అనేక ప్రాంతాలలో స్థాని కులు పాత కక్షలు తీర్చుకునే క్రమంలో అనేక దాడులు చేశారనీ, కనీసం 27 వేలమంది ఈ దాడులలో మరణించి ఉంటారనీ, వారిలో అత్యధికులు ముస్లింలేననీ సుందర్లాల్ కమిటీ నివేదించింది. ‘మిమ్మల్ని హైదరాబాద్ ఎవరు వెళ్ళమన్నారు?’ అంటూ పటేల్ ఈ కమిటీ సభ్యులలో ఒకరైన గఫర్ను మందలించారట. ఈ విషయాలు బయటికి పొక్కితే ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందనే భయంతో నివేదికను రహస్యపత్రంగా పరిగణించి ఉంటారు. బీజేపీ వ్యూహం బీజేపీకి మాత్రం ఈరోజు ఒక ముస్లిం రాజును గద్దె దింపిన రోజు. కనుక సంబరాలు జరుపుకోవలసిన సందర్భం. విమోచన సంబరాలు జరుపుకోవాలని నిరుడు వెంకయ్యనాయుడు కేసీఆర్ను కోరారు. ఆయన సానుకూలంగా స్పందించలేదు. నిజాం పాలనను మెచ్చుకునే కేసీఆర్ ఇలా చేయడంలో ఆశ్చర్యం లేదు. ఆఖరి శ్వాస వరకూ కాంగ్రెస్వాదిగానే కొనసాగిన సర్దార్ పటేల్ను తమ ఆదర్శపురుషుడుగా, అభిమాన నాయకుడిగా చిత్రించడం కోసం ఈ చారిత్రక పరిణామాన్ని వినియోగించుకోవాలన్నది బీజేపీ నాయకుల అభిమతం. రజాకార్ల వారసులే ఎంఐఎం నాయకులని వారి విమర్శ. విమోచన అంటే ముస్లింలు అభ్యంతరం చెబుతారు. అడ్డుకుంటారు. ఫలితంగా హిందువులు సంఘటితం అవుతారన్న ఆలోచన కావచ్చు. విమోచన అంటే ఎంఐఎం ఆగ్రహిస్తుందనీ, విద్రోహం అంటే బీజేపీ కోపగిస్తుందనీ భావించి ఈరోజుని ముఖ్యమైన సందర్భంగా పరిగణించకుండా వదిలేయడం చరిత్రను విస్మరించినట్టు అవుతుంది. తెలంగాణ ప్రజలకు ఎన్ని పరిమితులు ఉన్నప్పటికీ వారికి స్వేచ్ఛాస్వాతంత్య్రాలు లభించింది నిజంగా ఈరోజే. కనుక విలీనదినం వేడుకగా జరుపుకోవడం సమంజసం. అధికారంలో ఉన్న పార్టీలు సంకోచిస్తూ మౌనంగా ఉంటే దీన్ని రాజకీయ ప్రయోజనాలకు విని యోగించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. పటేల్ను ప్రభుత్వాలు స్మరించకపోతే ఆయనను పూర్తిగా సొంతం చేసుకునేందుకు బీజేపీకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. సెప్టెంబర్ 17ని హైదరాబాద్ విలీనదినంగా జరుపుకోవడానికి సంకోచించనక్కరలేదు. ప్రభుత్వ పూనికతో జరిగే ఈ వేడుకలో టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, టీడీపీ శ్రేణులు పాల్గొనవచ్చు. బీజేపీ, ఎంఐఎం నాయకులూ, కార్యకర్తలూ కాలక్రమంలో రాజీపడి ఈ సంబరాలలో పాల్గొంటారు. చరిత్ర చేసిన గాయాన్ని మాన్పడానికీ, సర్దార్ పటేల్ వారసత్వాన్ని స్మరించుకోవడానికీ తెలంగాణ ప్రజలకు ఇది మంచి అవకాశం. కె. రామచంద్రమూర్తి -
కమల్ హాసన్ రాయని డైరీ
మాధవ్ శింగరాజు పాలిటిక్స్లోకి నేనింకా రాకుండానే పాలిటిక్స్లో నేనేం మాట్లాడినా అది పాయింట్ అవుతోంది! అంటే నాక్కొంచెం పొలిటికల్ నాలెడ్జ్ కూడా ఉందన్నమాట! ‘‘మీరొస్తారా చెప్పండి, నేనొచ్చేస్తా మీతో..’’ అన్నాను రజనీతో. నేరుగా అనలేదు. ‘హిందూ’ తమిళ దినపత్రిక వాళ్లొస్తే వాళ్లతో అన్నాను. వాళ్లతో కూడా నేరుగా అనలేదు. ‘‘ముందు మీరేం క్వొశ్చన్స్ అడగదలచుకున్నారో ఆ క్వొశ్చన్స్ లిస్ట్ పంపండి. వాటిలో నాకు నచ్చినవి టిక్ పెట్టుకుని వాటికి సమాధానాలు రికార్డ్ చేసి పంపిస్తాను’’ అన్నాను. ‘అప్పుడది ఇంటర్వ్యూ ఎలా అవుతుంది’ అన్నాడట వాళ్ల ఎడిటర్. ‘‘ఇష్టమైతే పంపండి. లేకపోతే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రండి’’ అన్నాను. ‘‘ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టబోతున్నారు?’’ అని అడిగాడు ఆ కుర్రాడు. ‘‘పాలిటిక్స్లోకి వచ్చేముందు’’ అన్నాను. ‘‘ప్రెస్ మీట్ పెట్టి పాలిటిక్స్లో చేరబోతున్నట్లు ప్రకటిస్తారా? పాలిటిక్స్లో చేరాక ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్లు ప్రకటిస్తారా?’’ అన్నాడు. ‘‘పాలిటిక్స్లో చేరడం ఏంటి? పాలిటిక్స్లోకి రావడం..’’ అన్నాను. తికమక పెట్టి తప్పులు మాట్లాడించేస్తారు ఈ ప్రెస్ వాళ్లు. ‘పాలిటిక్స్లో చేరుతున్నాను’ అంటే డీఎంకేలోనో, సీపీఎంలోనో చేరుతున్నట్లు రాస్తారు. ‘పాలిటిక్స్లోకి వస్తున్నాను’ అంటే ఏ గొడవా ఉండదు. ‘‘అదే సర్, పాలిటిక్స్లోకి వచ్చాక ప్రెస్ మీట్ పెడతారా? ప్రెస్ మీట్ పెట్టి, పాలిటిక్స్లోకి వస్తారా?’’ అని అడిగాడు. ‘‘ఆ సంగతి ప్రెస్ మీట్ పెట్టి చెబుతాను’’ అన్నాను. ‘‘ఏ సంగతి సార్’’ అన్నాడు! ‘‘అదేనయ్యా.. ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టేదీ, ప్రెస్ మీట్ పెట్టి చెబుతాను’’ అన్నాను. ఆ కుర్రాడు వదలడం లేదు! ‘‘సార్.. చిన్న డౌటు’’ అన్నాడు. అడగమన్నాను. ‘‘సార్, మీరెందుకు అన్నాడీఎంకేలో చేరకూడదు? ఇప్పుడు పవర్లో ఉంది. మీరొచ్చాక ఇంకా పవర్ఫుల్ అవుతుంది కదా’’ అన్నాడు. ‘‘అన్నాడీఎంకేలో నేనెందుకు చేరాలయ్యా’’ అని అడిగాను. విసుగొస్తోంది నాకు. ‘‘పాలిటిక్స్లో మీరేం మాట్లాడినా అదొక పాయింట్ అవుతోంది సార్. మీరు అన్నట్లే పళనిస్వామి, పన్నీర్సెల్వం ఇద్దరూ కలసి శశికళను పార్టీ నుంచి గెంటేశారు. మీ మాటకు రెస్పెక్ట్ ఇచ్చిన పార్టీలో చేరితే మీకూ రెస్పెక్ట్ ఉంటుందనీ’’ అన్నాడు. ‘‘నేను చేరనయ్యా’’ అన్నాను. ‘‘మరి, సొంత పార్టీ పెడతారా సార్?’’ అని అడిగాడు. ఆ కుర్రాడి పట్టుదలకు ముచ్చటేసింది. పట్టు విడిపించుకోవాలంటే ఇంకొకర్ని పట్టివ్వాలి. వెంటనే రజనీ గుర్తుకొచ్చారు. ‘‘రజనీ సార్ ఎప్పుడొస్తే, నేనూ అప్పుడే ఆయనతోపాటు వచ్చేస్తా’’ అన్నాను. కుర్రాడు కదల్లేదు! ఏంటన్నట్లు చూశాను. ‘‘రజనీసార్ ఎప్పుడొస్తున్నారు సార్?’’ అన్నాడు!!
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
నామినేషన్ దాఖలు చేసిన శివసేన అభ్యర్థులు
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Tirumala : తిరుమలలో నేడు భక్తుల రద్దీ
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- కబ్జాల కందికుంట
- ఆ సమయంలో నా బాయ్ఫ్రెండ్ భార్య కూడా ఉంది: వరలక్ష్మీ శరత్కుమార్
- ‘గంట’కు రూ.100.!
- మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
Advertisement