
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.500 కోట్లతో గల్ఫ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. బుధవారం గాంధీభవన్లో గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కార్మికులకు, వారి కుటుంబాలకు అండగా ఉండటానికి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ’గల్ఫ్ భరోసా యాత్ర’ను ఉత్తమ్కుమార్రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి కుంతియా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ, గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని హామీ ఇచ్చారు.
2014 ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ తన ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రవాసుల సంక్షేమం పేరిట ఇచ్చిన హామీలను, అధికారంలోకి వచ్చిన తర్వాత తుంగలో తొక్కిందని విమర్శించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నారై సెల్ చైర్మన్ అంబాసిడర్ బీఎం వినోద్ కుమార్, టీపీసీసీ గల్ఫ్ ఎన్నారై కన్వీనర్ నంగి దేవేందర్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి మంద భీంరెడ్డి ఆధ్వర్యంలో గల్ఫ్ భరోసా యాత్ర కొనసాగుతుందన్నారు. గల్ఫ్ వలసలు అధికంగా ఉన్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యాత్ర నిర్వహిస్తామని చెప్పారు.