శబరిమలలో మహిళలను అడ్డగించిన ఆందోళనకారులు | Sakshi
Sakshi News home page

శబరిమలలో మహిళలను అడ్డగించిన ఆందోళనకారులు

Published Mon, Dec 24 2018 10:26 AM

Two Women Stopped Short Of Sabarimala Temple By Protesters - Sakshi

తిరువనంతపురం : శబరిమల ఆలయానికి పోలీస్‌ భద్రతతో వెళుతున్న ఇద్దరు మహిళలను సోమవారం ఉదయం ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఆందోళనకారులు అడ్డగించారు. 50 సంవత్సరాల లోపు ఉన్న ఇద్దరు మహిళలను ఆందోళనకారులు చుట్టుముట్టి ముందుకు వెళ్లకుండా నిరోధించారు. పెద్దసంఖ్యలో నిరసనకారులు గుమికూడటంతో మహిళల భద్రత కోసం మరిన్ని బలగాలను పంపాలని పోలీసులు ఉన్నతాధికారులను కోరినట్టు సమాచారం.

కాగా ఆదివారం పదకొండు మంది మహిళా భక్తులతో కూడిన బృందాన్ని తోటి భక్తులు ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో పోలీసు భద్రత ఉన్నప్పటికీ మహిళా భక్తులు వెనుదిరిగిన సంగతి తెలిసిందే. తాము ఆందోళనకారులను బలవంతంగా చెదరగొట్టలేమని, ఇది శాంతిభద్రతల సమస్యకు దారితీసే అవకాశం ఉందని పంబలో ఈ ఘటన జరిగిన నేపథ్యంలో లా అండ్‌ ఆర్డర్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ షాజి సుగుణన్‌ పేర్కొన్నారు.

శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించిన అనంతరం అయ్యప్ప దర్శనానికి వస్తున్న మహిళలను బీజేపీ, ఆరెస్సెస్‌ సహా పలు హిందూ సంఘాలు, సంస్థల కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డగిస్తుండటంతో ఉద్రిక్తత నెలకొంటోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement