తొలి రఫేల్ జెట్ను అందుకున్న రాజ్నాథ్..
పారిస్ : భారత్ అమ్ములపొదిలో మరో శక్తివంతమైన సాధనా సంపత్తి సమకూరింది. ఫ్రాన్స్లో తొలి రఫేల్ యుద్ధ విమానాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం అధికారికంగా స్వీకరించారు. దసరా పర్వదినంతో పాటు 87వ ఎయిర్ఫోర్స్ డే జరుపుకుంటున్న క్రమంలో తొలి రఫేల్ విమానాన్ని అందుకోవడం సంతోషదాయకమని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. అనుకున్న సమయానికి రఫేల్ ఎయిర్క్రాఫ్ట్ డెలివరీ జరగడం స్వాగతించదగిన పరిణామమని రఫేల్ రాకతో తమ వైమానిక దళం మరింత బలోపేతమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్, ఫ్రాన్స్లను ఉద్దేశిస్తూ రెండు ప్రధాన ప్రజాస్వామ్య దేశాల నడుమ రానున్న రోజుల్లో పలు రంగాల్లో పరస్పర సహకారం మరింత బలోపేతమవుతుందని ఆకాంక్షించారు.రఫేల్ జెట్ సరఫరాకు శ్రీకారం చుట్టడం ద్వారా నేడు ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్య పరంపరలో నూతన మైలురాయి వంటిదని వ్యాఖ్యానించారు. రఫేల్ సామర్థ్యం మేర రాణిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ వాయుసేనలో భారత్ బలోపేతమై ఈ ప్రాంతంలో శాంతిభద్రతల బలోపేతానికి మార్గం సుగమమవుతుందని అన్నారు.