
బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలి: ఆర్.కృష్ణయ్య
బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీలకు ఆ సదుపాయాన్ని కల్పించకపోవడం అన్యాయమన్నారు.
సాక్షి, న్యూఢిల్లీ: బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీలకు ఆ సదుపాయాన్ని కల్పించకపోవడం అన్యాయమన్నారు. బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రదర్శన, ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని నాచియప్పన్ కమిటీ చేసిన సిఫార్సులపై రాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు లేఖలు రాసినప్పటికీ కేంద్రం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 14 లక్షల ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మూడులక్షల బ్యాక్లాగ్ పోస్టులభర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. బీసీ ఉద్యోగులకు న్యాయం జరిగేవరకు దేశవ్యాప్త ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ పర్యటనకు వచ్చిన సీఎం కిరణ్కుమార్రెడ్డిని కూడా కలిశారు. బీసీల డిమాండ్లపై ఢిల్లీ పెద్దలతో చర్చిస్తానని సీఎం హామీ ఇచ్చినట్టు కృష్ణయ్య తెలిపారు.
జైపాల్రెడ్డి ఇల్లు ముట్టడి
పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం కార్యకర్తలు మంగళవారం కేంద్ర మంత్రి జైపాల్రెడ్డి ఇంటిని ముట్టడించారు. కృష్ణయ్య నేతృత్వంలో మంత్రి ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జైపాల్రెడ్డి మాట్లాడుతూ... కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని, అలాగే పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మన్మోహన్, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీలకు విన్నవిస్తానని హామీ ఇచ్చారు. బీసీలకు సబ్ప్లాన్ ఏర్పాటుపైనా వారితో చర్చిస్తానని తెలిపారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లపై పార్టీల మధ్య ఏకాభిప్రాయం రావాల్సి ఉందని చెప్పారు. కార్యక్రమంలో బీసీ నేతలు జాజుల శ్రీనివాస్గౌడ్, కె.ఆల్మాన్రాజ్, మల్లేష్ యాదవ్, గుజ్జ కృష్ణ, ఆర్.రమేష్, సురేష్, అశోక్ గౌడ్, మధుసూదన్, పాండు, వి.భాషయ్య, కె.శ్రీనివాస్, రాజేందర్, సదానందం, బలరాం, శ్రీనివాస్గౌడ్, రెడ్డిమళ్ల వెంకటేశ్వర్లు, విజయ్, మల్లికార్జున్ రులు పాల్గొన్నారు.