100 మంది ఉగ్రవాదుల హతం | Over 100 northeast militants may have been killed in Army's Myanmar operations | Sakshi
Sakshi News home page

100 మంది ఉగ్రవాదుల హతం

Jun 10 2015 11:56 AM | Updated on Sep 3 2017 3:31 AM

ఉగ్రవాదుల దాడికి నిరసిస్తూ భారత సైనికులు జరిపిన ప్రతిదాడిలో 100 మంది వరకు ఉగ్రవాదులు మృతిచెందారని కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి.

న్యూఢిల్లీ: మణిపూర్ లో  ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ భారత సైనికులు జరిపిన ప్రతిదాడిలో 100 మంది వరకు ఉగ్రవాదులు మృతిచెందినట్టు కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. తీవ్రవాదుల దాడులను నిరసిస్తూ భారత ఆర్మీ ప్రతిదాడికి దిగింది. ఈ ప్రతిదాడి దాదాపు 45 నిమిషాలపాటు సాగింది. మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసిన భారత ఆర్మీ ప్రత్యేక దళాలు తీవ్రవాదుల దాడులను ఎదుర్కొనేందుకు ఆపరేషన్ మొదలుపెట్టాయి. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయినా అనంతరం భారత్ ఆర్మీ  సైనిక దళాలు ప్రతికార దాడికి దిగినట్టు తెలుస్తోంది.

అంతకముందు మణిపూర్‌లో మిలిటెంట్లు ఘాతుకానికి తెగబడ్డారు. ఆర్మీ వాహన శ్రేణిపై మందుపాతరలు, గ్రెనేడ్లు, అత్యాధునిక ఆయుధాలతో మెరుపుదాడి చేసి 18 మంది సైనికుల ప్రాణాలు తీశారు. ఈ సంఘటన స్థలం భారత్, మయన్మార్ సరిహద్దుకు దాదాపు 15 కి.మీ.ల దూరంలో ఉంది. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు 80 కి.మీ.ల దూరంలో ఉన్న తెంగ్నౌపాల్- న్యూ సంతాల్ రోడ్‌పై ఈ దాడికి పాల్పడ్డారు. డోగ్రా రెజిమెంట్‌కు చెందిన సైనికులు నాలుగు వాహనాల్లో పెట్రోలింగ్‌కు బయల్దేరారు. పారలాంగ్, చరాంగ్ గ్రామాల మధ్యకు రాగానే ఆ వాహన శ్రేణిపై శక్తిమంతమైన మందుపాతరను పేల్చిన మిలిటెంట్లు.. ఆ వెంటనే రాకెట్‌తో ప్రయోగించే గ్రెనేడ్లు, అత్యాధునిక ఆటోమేటిక్ తుపాకులతో సైనికులపై విరుచుకుపడి, విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. ఆ దాడిలో 18 మంది సైనికులు చనిపోగా, 11 మంది గాయాల పాలయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement