
ఒకరోజు ముందుగానే రుతుపవనాలు!
నైరుతి రుతుపవనాలు మే 30న కేరళను తాకుతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించినప్పటికీ, ఒక రోజు ముందుగానే వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది.
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు మే 30న కేరళను తాకుతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించినప్పటికీ, ఒక రోజు ముందుగానే వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితులు ఇందు కు అనుకూలంగా ఉన్నాయని కేంద్ర భూ అధ్యయన శాఖ కార్యదర్శి ఎం.రాజీవన్ మంగళవారం పేర్కొన్నారు.
ఎన్డీయే ప్రభుత్వ మూడేళ్ల విజయాలకు ప్రచారం కల్పించడానికి ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సాధారణంగా నైరుతి రుతుపవనాలు కేరళను జూన్ 1వ తేదీన తాకుతాయి. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే ఐఎండీ వెల్లడించడం తెలిసిందే. ఈ సీజన్ నుంచి మూడేళ్లపాటు మేఘమథనం సాధ్యాసాధ్యాలను పరిశీలించే కార్యక్రమాన్ని కూడా భూ అధ్యయన శాఖ చేపడుతుందనీ, మహారాష్ట్రలోని సోలాపూర్లో ఈ కార్యక్రమం ఉంటుందని రాజీవన్ చెప్పారు.