
తాగి కారును ఢీకొట్టి కాల్చి చంపాడు
తన కారును ఎందుకు ఢీకొట్టావని ప్రశ్నించినందుకు ఓ వ్యక్తి యువ వ్యాపార వేత్తను కాల్చి చంపాడు.
న్యూఢిల్లీ: తన కారును ఎందుకు ఢీకొట్టావని ప్రశ్నించినందుకు ఓ వ్యక్తి యువ వ్యాపార వేత్తను కాల్చి చంపాడు. ఫుల్లుగా తాగిన మైకంలో ట్రాఫిక్ వద్దకు ఎస్యూవీ వాహనంలో అతడు దూసుకురావడమే కాకుండా బాధితుడి కారును ఢీకొట్టి గొడవకు దిగి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తూర్పు ఢిల్లీలోని అశోక్ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫరదాబాద్కు చెందిన దీపక్ భదాన(25) అనే ఓ యువ వ్యాపార వేత్త తన బంధువుల ఇంట్లో వివాహానికి కుటుంబ సభ్యులతో వెళ్లి హాజరై తిరిగొస్తున్నాడు. దాల్లుపురా-కోండ్లి రోడ్డులోని ట్రాఫిక్ జామ్ కారణంగా వారు వెళుతున్న కారు ఇరుక్కుపోయింది.
అదే సమయంలో ఉత్తరాఖండ్ రిజిస్ట్రేషన్తో ఉండి అది కూడా వీఐపీ నెంబర్తో ఉన్న ఎస్యూవీ వాహనం వేగంగా వచ్చి కారును పక్క నుంచి ఢీకొడుతూ ముందుకెళ్లింది. ఈ క్రమంలో ఆ కారు పక్కన ఉండే అద్దం పగిలిపోయింది. దీంతో దీపక్ కిందికి అతడిని ప్రశ్నించాడు. మద్యం మత్తులో ఉన్న అతడు వాగ్వాదానికి దిగాడు. అనంతరం దీపక్ అక్కడి నుంచి తిరిగి తన కారులో వెళుతుండగా మద్యం తాగిన వ్యక్తి తన తుపాకీతో కాల్పులు జరపడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. దీపక్ ఒక్కడే వాళ్ల కుటుంబానికి పెద్ద దిక్కు. అతడి సోదరులు ఇంకా చదువుతున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని యశ్ పాల్ అనే ఓ డీలర్గా గుర్తించారు.