‘ఉన్నావ్‌’ బాధితురాలికి కన్నీటి వీడ్కోలు

Last Trip Between Police Security Of Unnao Victims - Sakshi

ఉన్నావ్‌: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో అత్యాచారం, హత్యకు గురైన బాధితురాలి (23) అంత్యక్రియలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఆదివారం ముగిశాయి. కుటుంబసభ్యులు, గ్రామస్తుల అశ్రునయనాల మధ్య యువతి స్వగ్రామంలోనే ఆమె తాత, నానమ్మ సమాధుల పక్కన అంత్యక్రియలు నిర్వహించారు. బాధితురాలిని కడసారి చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. యూపీ మంత్రులు స్వామి ప్రసాద్‌ మౌర్య, కమల్‌రాణి వరుణ్, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ సునీల్‌ సింగ్‌ సజన్‌ అంత్యక్రియలకు హాజరయ్యారు. బాధితురాలి కుటుంబానికి ఉన్నావ్‌ ఎంపీ అన్నూ టాండన్‌ రూ.5 లక్షల సాయం అందించారు.

కాగా, ఈ కేసులో నిందితులను శిక్షిస్తామని  సీఎం ఆదిత్యనాథ్‌ భరోసా ఇచ్చేదాకా అంత్యక్రియలు నిర్వహించేది లేదని పట్టుబట్టిన బాధిత కుటుంబం.. అధికారుల హామీతో వెనక్కుతగ్గింది. ఆ కుటుంబానికి భద్రత ఏర్పాటు చేస్తామని, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద ఇల్లు మంజూరు చేస్తామని లక్నో డివిజినల్‌ కమిషనర్‌ వెల్లడించారు. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న బాధితురాలి సోదరికి ప్రత్యేక భద్రత కల్పిస్తాన్నారు. రక్షణ కోసం ఆయుధాలు కావాలంటే ఇస్తామని చెప్పారు. రేప్‌ బాధితురాలి ఘటనలో నిర్లక్ష్యం వహించిన ఏడుగురు పోలీసులను యూపీ ప్రభుత్వం విధుల నుంచి సస్పెండ్‌ చేసింది.

పోలీసు భద్రత మధ్య అంతిమ యాత్ర

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top