రూ. 200 అప్పు తీర్చడం కోసం 30 ఏళ్ల తర్వాత | Kenya MP Returns To Aurangabad To Repay Rs 200 Debt | Sakshi
Sakshi News home page

ఇండియా వచ్చిన కెన్యా మంత్రి

Jul 11 2019 2:43 PM | Updated on Jul 11 2019 4:25 PM

Kenya MP Returns To Aurangabad To Repay Rs 200 Debt - Sakshi

ముంబై : వేల కోట్ల రూపాయలు అప్పు చేసి... ఆ తర్వాత ఎంచక్కా దేశం దాటి పోతున్న ఈ రోజుల్లో చేసిన అప్పు తీర్చడం కోసం ఓ వ్యక్తి ఏకంగా కెన్యా నుంచి 30 ఏళ్ల తర్వాత ఇండియా రావడం నిజంగా గ్రేటే. ఆ వచ్చిన వ్యక్తి ఎంపీ కావడం ఇక్కడ విశేషం. వివరాలు.. 79 ఏళ్ల కాశీనాథ్‌ గావ్లీ ఇంటికి రెండు రోజుల క్రితం ఓ అనుకోని అతిథి వచ్చాడు. తన పేరు రిచర్డ్ టోంగ్ అని.. కెన్యా దేశ ఎంపీనని చెప్పాడు. 30 ఏళ్ల క్రితం కాశీనాథ్‌ తనకు రూ. 200 సాయం చేశాడని.. ఆ సొమ్మును తిరిగి చెల్లించడానికి వచ్చానన్నాడు. ఆశ్చర్యపోవడం కాశీనాథ్‌ వంతయ్యింది.

ఈ విషయం గురించి రిచర్డ్ మాట్లాడుతూ.. ‘1985-89 కాలంలో నేను మేనేజ్‌మెంట్‌ కోర్సు చడవడం కోసం ఇండియా వచ్చాను. అప్పుడు నేను వాంఖేడ్‌నగర్‌ ప్రాంతంలో ఉండేవాడిని. కాశీనాథ్‌ గారి కుటుంబం కూడా అదే ప్రాంతంలో కిరాణ షాపు నడుపుతుండేవారు. ఆ సమయంలో ఓ సారి డబ్బులు లేక నేను ఇబ్బంది పడుతుంటే కాశీనాథ్‌ గారు నాకు రూ. 200 సాయం చేశారు. అప్పుడు ఆ అప్పును తిరిగి చెల్లించే పరిస్థితిలో నేను లేను. కానీ ఆయన సాయాన్ని మాత్రం మర్చిపోలేకపోయాను. ఎప్పటికైనా కాశీనాథ్‌ గారి రుణాన్ని తీర్చుకోవాలని.. ఆయనకు కృతజ్ఞత తెలపాలని మనసులోనే అనుకునే వాడిని. ఇప్పటికి నాకు కుదిరింది’ అన్నారు రిచర్డ్‌.

‘నన్ను చూసి కాశీనాథ్‌ గారు చాలా ఆశ్చర్యపోయారు. నా రాక పట్ల ఎంతో సంతోషం వెలిబుచ్చారు. భోజనం నిమిత్తం నేను హోటల్‌కి వెళ్లాలని భావించాను. కానీ అందుకు ఆయన ఒప్పుకోలేదు. వారితో పాటు కలిసి భోంచేసేలా నన్ను బలవంతపెట్టారని తెలిపారు రిచర్డ్‌. ప్రస్తుతం తాను కెన్యాలో ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను’ అన్నారు రిచర్డ్‌. తిరిగి వెళ్లేటప్పుడు కాశీనాథ్‌ను తమ దేశం రావాల్సిందిగా ఆహ్వానించారు రిచర్డ్‌. ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన ఈ స్టోరీ ప్రస్తుతం తెగ వైరలవుతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement