ఆర్టికల్‌ 370 రద్దు: ముస్లిం సంస్థ సంపూర్ణ మద్దతు

Kashmir welfare lies in integration with India, Says Top Muslim group - Sakshi

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రముఖ ముస్లిం సంస్థ జమియత్‌ ఉలేమా ఇ హింద్‌ (జేయూహెచ్‌) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. భారత్‌లో అంతర్భాగంగా ఉండటంలోనే కశ్మీర్‌ సంక్షేమం ఉందని ఆ సంస్థ పేర్కొంది. జేయూహెచ్‌ జనరల్‌ కౌన్సిల్‌ సమావేశం దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగింది. కశ్మీర్‌లో భారత్‌లో అంతర్భాగమని, అక్కడ ఎలాంటి వేర్పాటువాద ఉద్యమాలు చేసినా అది స్థానిక ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తాయని పేర్కొంటూ ఈ సమావేశంలో తీర్మానం చేసింది.

‘కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగం. కశ్మీరీలు మన తోటి దేశస్తులు. వేర్పాటువాద ఉద్యమాలు దేశానికే కాదు కశ్మీర్‌ ప్రజలకు కూడా చేటు చేస్తాయి’ అని తీర్మానం పేర్కొంది. భారత్‌లో మమేకమవ్వడంలోనే కశ్మీర్‌ ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని, వేర్పాటువాదంలో కాదని తెలిపింది. అయితే, కశ్మీరీ ప్రజల మానవ, ‍ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ అనేది జాతీయ కర్తవ్యమని తీర్మానం పేర్కొంది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఆర్టికల్‌ 370ను రద్దు చేయడమే కాకుండా.. జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టిన సంగతి తెలిసిందే.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top