‘మూక దాడులకు పాల్పడితే సహించం’

Jharkhand CM Says Mob Lynching Wont Be Tolerated - Sakshi

రాంచీ : మూక దాడులకు పాల్పడే వారు ఏ కులం, మతానికి చెందిన వారైనా ఉపేక్షించబోమని జార్ఖండ్‌ సీఎం రఘువర్‌ దాస్‌ స్పష్టం చేశారు. బైక్‌ను చోరీ చేశాడనే ఆరోపణలపై ముస్లిం యువకుడిపై ఇటీవల జరిగిన మూక దాడిని ప్రస్తావిస్తూ ఈ ఘటనను తమ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోందని, నేరగాళ్లను కఠినంగా శిక్షించడంలో రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు. ఈ తరహా కేసులను ఫాస్ట్‌ట్రాక్‌ విచారణ చేపట్టి చర్యలు తీసుకోవడం జార్ఖండ్‌ దేశంలోనే తొలి రాష్ట్రమని చెప్పుకొచ్చారు.

ప్రధాని నరేంద్ర మోదీ జార్ఖండ్‌ ఘటనపై రాజ్యసభలో స్పందిస్తూ ఈ తరహా చర్యలు తనను బాధించాయని, బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని పేర్కొన్న సంగతి తెలిసిందే. తబ్రేజ్‌ అన్సారీ అనే వ్యక్తిని అ‍ల్లరి మూకలు చుట్టుముట్టి జై శ్రీరాం, జై హనుమాన్‌ అని నినదించాలని కోరుతూ దాడికి పాల్పడిన వీడియో కలకలం రేపింది. మూక దాడికి గురైన అన్సారీ ఆ తర్వాత మరణించారు. ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదని తమ ప్రభుత్వం నేరగాళ్లపై చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉందని జార్ఖండ్‌ సీఎం దాస్‌ కోరారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top