
ఇదేమైనా జోక్ కోర్టా?
‘ఇదేమైనా జోక్ కోర్టా లేక సుప్రీం కోర్టా? రాష్ట్రాలకు ఆసక్తి లేని పంచాయితీ ఏమైనా జరుగుతోందా ఇక్కడ?
రాష్ట్రాలపై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ: ‘ఇదేమైనా జోక్ కోర్టా లేక సుప్రీం కోర్టా? రాష్ట్రాలకు ఆసక్తి లేని పంచాయితీ ఏమైనా జరుగుతోందా ఇక్కడ? మీరు (రాష్ట్రాల న్యాయవాదులు) సుప్రీంకోర్టుతో ఎందుకిలా జోక్ చేస్తున్నారు? మీ ప్రధాన కార్యదర్శులను కోర్టుకు రప్పిస్తేగానీమీకు తెలిసిరాదు’అంటూ సుప్రీంకోర్టు రాష్ట్రాలపై సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం కొన్ని ప్రజాహిత వ్యాజ్యాలను విచారిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేసింది.
కాలుష్యం, బడి పిల్లల మధ్యాహ్న భోజనంలో శుచి తదితర ప్రజా ప్రయోజనమున్న విషయాలపై పలు స్వచ్ఛంద సంస్థలు గతంలో వ్యాజ్యాలు దాఖలు చేశాయి. వీటిపై వైఖరి తెలపాలని అప్పుడే కోర్టు కేంద్రం, 12 రాష్ట్రాలను ఆదేశించింది. తాజాగాసోమవారం ఈ వ్యాజ్యాలపై విచారణ కొనసాగించిన ధర్మాసనం రాష్ట్రాలు కౌంటర్ అఫిడవిట్లను దాఖలు చేయక పోవడంపై పై విధంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. 12 రాష్ట్రాల్లో కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తర ప్రదేశ్,ఉత్తరాఖండ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అస్సాం ఉన్నాయి.