కశ్మీర్‌ ప్రశాంతం.. పాక్‌ కుట్ర బట్టబయలు!

Eid celebrated peacefully, not a single bullet fired in Kashmir - Sakshi

సోషల్‌ మీడియాలో దాయాది ప్రాపగాండ

కొట్టిపారేసిన భారత సైన్యం.. 

ఒక్క బుల్లెట్‌ కూడా ప్రయోగించలేదని వెల్లడి

శ్రీనగర్‌:  ఆర్టికల్‌ 370 రద్దు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్‌ విభజన నేపథ్యంలో కశ్మీర్‌ లోయలో కీలక బక్రీద్‌ పండుగ శాంతియుతంగా జరిగింది. బక్రీద్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని లోయలో ముస్లిం ప్రజలు పెద్ద ఎత్తున ప్రార్థనల్లో పాల్గొన్నారు. పండుగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అధికార యంత్రాంగం, భారత సైన్యం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. కశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లో నిషేధాజ్ఞలను సడలించి.. పండుగపూట జనజీవనం సాఫీగా సాగేవిధంగా చర్యలు తీసుకున్నారు. అనేక ప్రాంతాల్లో ముస్లిం ప్రజల ప్రార్థనల నిర్వహణలో భారత బలగాలు సహకరించాయి. జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ దోవల్‌ శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో పర్యటించి.. స్థానికంగా పరిస్థితులను బేరిజు వేశారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కశ్మీర్‌ లోయలో ఇంతవరకు ఒక్క బుల్లెట్‌ కూడా ప్రయోగించలేదని, బక్రీద్‌ పర్వదినం సందర్భంగా అంతా ప్రశాంతంగా ఉందని కశ్మీర్‌ ఐజీ ఎస్పీ పాణి స్పష్టం చేశారు. 

పాక్‌ కుట్ర బట్టబయలు..!
కశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిలో చీలిక తెచ్చేందుకు దాయాది పాకిస్తాన్‌ చౌకబారు ఎత్తుగడలు వస్తోంది. భారత్‌కు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పాపగాండ మొదలుపెట్టింది. ఆ దేశానికి చెందిన వెరీఫైడ్‌ ట్విటర్‌ అకౌంట్ల నుంచి ఈ దుష్ప్రచారం జరుగుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో దాయాది కుట్రను భారత సైన్యం బయటపెట్టింది.  ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో  కశ్మీర్‌లో బందోబస్తు నిర్వహిస్తున్న భారత సైన్యంలో విభేదాలు బయటపడ్డాయని ఓ పాకిస్థానీ నెటిజన్‌ ట్వీట్‌ చేశారు. వాజ్‌ఎస్‌ ఖాన్‌ (WSK @WajSKhan) అనే వ్యక్తి తన వెరీఫైడ్‌ ట్విటర్‌ ఖాతాలో భారత్‌కు వ్యతిరేకంగా కుట్రపూరిత ప్రచారానికి పునుకున్నాడు.

కశ్మీర్‌లో గర్భవతిని చెక్‌పాయింట్‌ వద్ద బలగాలు అడ్డుకోవడంతో ఓ కశ్మీరీ పోలీసు.. ఐదుగురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను కాల్చిచంపాడని అతను ట్వీట్‌ చేశాడు. ‘కశ్మీర్‌లో పనిచేస్తున్న భారత బలగాల్లో విభేదాలు తలెత్తాయి. ఓ ముస్లిం కశ్మీరీ పోలీసు ఐదుగురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను కాల్చిచంపాడు. కర్ఫ్యూ పాస్‌ లేకపోవడంతో ఓ గర్భవతిని చెక్‌పాయింట్‌ దాటి వెళ్లేందుకు భద్రతా బలగాలు అడ్డుకోవడంతో.. వారితో గొడవకు దిగిన పోలీసులు కాల్పులు జరిపాడు. ఈ ఘటనతో కశ్మీర్‌ లోయ ఉద్రిక్తంగా మారిపోయింది’ అంటూ అతను ట్వీట్‌ చేశాడు. ఈ ఘటనపై స్పందించిన సీఆర్‌పీఎఫ్‌.. ఇది పూర్తి ఫేక్‌ ట్వీట్‌ని స్పష్టం చేసింది. ఇది కావాలని చేస్తున్న విషపూరిత దుష్ప్రచారమని, భారత బలగాలు అత్యంత సామరస్యంగా పనిచేస్తున్నాయని, తమ యూనిఫామ్‌ రంగులు వేరైనా... దేశభక్తి, మువన్నెల పతాకం పట్ల గౌరవ తమ హృదయాల్లో ఎప్పటికీ చెక్కుచెదరకుడా ఉంటుందని సీఆర్‌పీఎఫ్‌ తన అధికారిక ఖాతాలో ట్వీట్‌ చేసింది. కశ్మీర్‌ పోలీసులు కూడా ఈ దుష్ప్రచారంపై స్పందించారు. దుష్ప్రచారానికి పాల్పడిన సదరు వ్యక్తికి వ్యతిరేకంగా ట్విటక్‌ కంపెనీకి ఫిర్యాదు చేసినట్టు కశ్మీర్‌ జోన్‌ పోలీసులు వెల్లడించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top