‘విద్యార్థినులపై లాఠీచార్జి జరగలేదు’ | Sakshi
Sakshi News home page

‘విద్యార్థినులపై లాఠీచార్జి జరగలేదు’

Published Tue, Sep 26 2017 9:32 AM

no lathi-charge on girls, claims BHU V-C 

సాక్షి, వారణాసి : లైంగిక వేధింపులకు నిరసనగా ఇటీవల బెనారస్‌ హిందూ యూనివర్సిటీలో జరిగిన ఆందోళనల్లో విద్యార్థినులపై పోలీసులు లాఠీచార్జి జరగలేదని వర్సిటీ వీసీ గిరీష్‌ చం‍ద్ర త్రిపాఠి పేర్కొన్నారు. విద్యార్థినులపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని, వారిపై లాఠీచార్జి చేశారనే వార్తలను తోసిపుచ్చారు. ‘ఈవ్‌టీజింగ్‌ను వ్యతిరేకిస్తూ నిరసనకు దిగిన విద్యార్థినులపై పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. బయటినుంచి వచ్చి హింసకు పాల్పడిన వారిపైనే పోలీసులు చర్య తీసుకున్నార’ని వీసీ స్పష్టం చేశారు.

సంకుచిత ప్రయోజనాల కోసం బయటివ్యక్తులే ప్రతిష్టాత్మక వర్సిటీలో ఈ ఘటనకు పాల్పడ్డారని త్రిపాఠి అన్నారు. వారణాసిలో ప్రధాని పర్యటన నేపథ్యంలోనే ఇవన్నీ కొందరు పనిగట్టుకుని చేశారని ఆయనే ఆరోపించారు. వర్సిటీలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. మరోవైపు వర్సిటీలో విద్యార్థినులపై పోలీసుల చర్యను పలువురు ఖండించారు. పోలీసులు సంయమనం పాటించాలని ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా సహా పలు రాజకీయ పార్టీల అగ్రనేతలు కోరారు.

Advertisement
Advertisement