144 మంది చిన్నారుల అక్రమ నిర్బంధం | 144 Children Illegal Arrest In Jammu Kashmir After August | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో 144 మంది చిన్నారుల నిర్బంధం

Oct 2 2019 11:53 AM | Updated on Oct 2 2019 12:03 PM

144 Children Illegal Arrest In Jammu Kashmir After August - Sakshi

శ్రీనగర్‌: కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం బాలల హక్కులు పూర్తిగా నిర్బంధించడ్డాయని జువైనల్‌ జస్టిస్ట్‌ కమిటీ (బాలల న్యాయ సంరక్షణ, పరిరక్షణ) పేర్కొంది. కశ్మీర్‌లో మైనర్లను నిర్బంధిస్తున్నారని ఆరోపిస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం తమకు పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని జమ్మూ కశ్మీర్‌ హైకోర్టును ఆదేశింది. హైకోర్టు సూచన మేరకు విచారణ చేపట్టిన జువైనల్‌ కమిటీ.. ఈ మేరకు బుధవారం సుప్రీంకోర్టుకు నివేదిక అందించింది. ఆగస్ట్‌ 5 నుంచి ఇప్పటి వరకు 144 మంది మైనర్‌ బాలురు, బాలికలు పోలీసులు నిర్బంధంలో ఉన్నారని, వారినంతా అక్రమంగా అరెస్ట్‌ చేశారని కమిటీ నివేదించింది. అరెస్టయిన వారంతా 9 నుంచి 18 ఏళ్ల మధ్యలోనే ఉన్నారని పేర్కొంది.

అయితే కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని సుప్రీంకోర్టులో ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ముఖ్యంగా మైనర్ల నిర్బంధంపై బాలల హక్కుల కార్యకర్త సుష్మిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్బంధంలో ఉన్నవారిని వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. మరోవైపు లోయలో విధించిన ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నా.. కేంద్ర మాత్రం వాటిని కొట్టిపారేస్తోంది. కశ్మీర్‌లో అంతా ప్రశాంతగానే ఉందని చెబుతోంది. కాగా జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంపై దాఖలైన వ్యాజ్యాలను విచారించడానికి సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఆయా పిటిషన్లపై విచారణను ప్రారంభించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement