DOP Rathnavelu Talk About Rangasthalam Movie - Sakshi
Sakshi News home page

అప్పుడు సేతు.. ఇప్పుడు రంగస్థలం

Apr 12 2018 12:07 AM | Updated on Apr 12 2018 12:37 PM

Ratnavelu On About Rangasthalam movie Success - Sakshi

రత్నవేలు

‘‘నేను ఏ సినిమాకైనా ముందు పూర్తి కథ వింటాను. ‘రంగస్థలం’కి కూడా సుకుమార్, నేను పలుమార్లు కథ గురించి చర్చించుకున్నాం. ఆయన రాసింది విలేజ్‌ డ్రామా. ప్రేక్షకుల్ని 1980 కాలంలోకి తీసుకెళ్లాలి. అందంగానూ, తెలుగు కల్చర్‌ ఉట్టిపడేలా ఉండాలి. అలా చూపించడానికి నా వంతు కృషి చేశాను’’ అని ఛాయాగ్రాహకుడు రత్నవేలు అన్నారు. రామ్‌చరణ్, సమంత జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’.

నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్‌ నిర్మించిన ఈ సినిమా గత నెల 30న విడుదలైంది. ఈ సినిమాకి కెమెరామేన్‌గా పనిచేసిన రత్నవేలు మీడియాతో మాట్లాడుతూ– ‘‘దర్శకుడికి, కెమెరామేన్‌కు మధ్య మంచి రిలేషన్‌ ఉంటేనే ‘రంగస్థలం’ లాంటి ఔట్‌పుట్‌ సాధ్యం. మా మొదటి సినిమా ‘ఆర్య’ నుంచి నాకు, సుకుమార్‌కు అలాంటి రిలేషన్‌ ఉంది. సుకుమార్‌ అన్ని అంశాల్ని పట్టించుకుంటాడు కానీ కెమెరా విషయంలో ఏం మాట్లాడడు.

అతనికేం కావాలో అది నేను ఇస్తాననే నమ్మకం. సాధారణంగా సినిమాటోగ్రాఫర్‌కు అంతగా పేరు రాదు. కానీ, ‘రంగస్థలం’ విడుదలైన మొదటి రోజు నుంచి నన్ను ఇండస్ట్రీవారు, క్రిటిక్స్, ప్రేక్షకులు అభినందించారు. యూనిట్‌ మొత్తం క్రమశిక్షణతో పని చేయడం వల్లే ఈ సక్సెస్‌ సాధ్యమైంది. ఈ సినిమాకి హార్ట్‌ అండ్‌ సోల్‌ పెట్టి చేశా. నా బిగ్గెస్ట్‌ హిట్, పేరు తెచ్చిన సినిమా ‘సేతు’. దాని తర్వాత అంతటి సినిమా ‘రంగస్థలం’. ఇలాంటి సినిమాలు ఎప్పుడో కానీ రావు’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement