నాకు నేనే పోటీ అంటున్న హీరోయిన్ | My competition is with myself, says Keerthy Suresh | Sakshi
Sakshi News home page

నాకు నేనే పోటీ అంటున్న హీరోయిన్

Jun 24 2015 2:00 PM | Updated on Sep 3 2017 4:18 AM

నాకు నేనే పోటీ అంటున్న హీరోయిన్

నాకు నేనే పోటీ అంటున్న హీరోయిన్

హీరోయిన్లకు ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. ఈ విషయంలో కొత్త హీరోయిన్ కీర్తిసురేష్ మిగిలిన వాళ్ల కంటే రెండాకులు ఎక్కువే చదివింది. తనను ఎవరితోనూ పోల్చడం తగదని, తనకు తానే పోటీ అని ఆమె చెబుతోంది.

హీరోయిన్లకు ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. ఈ విషయంలో కొత్త హీరోయిన్ కీర్తిసురేష్ మిగిలిన వాళ్ల కంటే రెండాకులు ఎక్కువే చదివింది. తనను ఎవరితోనూ పోల్చడం తగదని, తనకు తానే పోటీ అని ఆమె చెబుతోంది. ఇదంతా ఇంకా ఒక్క తమిళ సినిమా కూడా విడుదల కాకముందే. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుందన్నది కీర్తి వాదన. ఇంతకుముందు సినిమా కంటే తాను బాగా చేశానా లేదా అన్న విషయం ఒక్కటే తాను ఆలోచించాలని ఆమె చెప్పింది. తమిళంలో ఆమె చేసిన మొట్టమొదటి సినిమా 'ఇదు ఎన్న మాయం' ఇంకా విడుదల కావాల్సి ఉంది. అయితే ఈలోపే ఆమె చేతిలో ఐదు సినిమాలున్నాయి. రాత్రికి రాత్రే తనకు ఇంత పాపులారిటీ ఎలా వచ్చిందో ఇప్పటికీ నమ్మలేకపోతున్నట్లు కీర్తి చెప్పింది. దాంతో తనకు ఒత్తిడి ఎక్కువగానే ఉంది గానీ, తన మొదటి సినిమా విడుదల కాకముందే చిత్ర పరిశ్రమ ఇంత సాదరంగా ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపింది. ఒకవైపు సంతోషంగాను, మరోవైపు భయంగా కూడా ఉందని ఆమె చెప్పింది.

అలనాటి హీరోయిన్ మేనక, ప్రముఖ మళయాళ నిర్మాత సురేష్ కుమార్ల కూతురైన కీర్తి.. సినిమా పరిశ్రమలోకి రావడం మాత్రం అంత సులభం కాదనే చెబుతోంది. తన తల్లిదండ్రులు పరిశ్రమలో ఉండటంతో రావడం వచ్చినా.. ఇక్కడ నిలదొక్కుకోవడం చాలా కష్టమంటోంది. చిన్నతనంలోనే చైల్డ్ ఆర్టిస్టుగా ఆమె 'పైలట్స్' అనే సినిమాలో నటించింది. తర్వాత 2013లో ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన మళయాళ హర్రర్ కామెడీ సినిమా 'గీతాంజలి'లో హీరోయిన్గా చేసింది. మళయాళంలో చేసిన రెండో సినిమా 'రింగ్ మాస్టర్'లో గుడ్డి అమ్మాయిగా చేసింది. దాంతో అప్పటివరకు సరదాగా, హాబీగానే చేసిన నటనను.. ఇక అప్పటినుంచి సీరియస్గా తీసుకున్నట్లు చెప్పింది. ప్రస్తుతం కీర్తిసురేష్ తెలుగులో 'అయినా నువ్వు ఇష్టం', 'హరికథ', తమిళంలో ధనుష్ సరసన ఇంకా పేరుపెట్టని ఓ సినిమాతో పాటు రజనీ మురుగన్, పాంభు సత్తై సినిమాల్లో చేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement