జెమినీ గణేశన్‌ కుమార్తెల కలయిక

Gemini Ganeshan Daughters Gather In Chennai - Sakshi

చెన్నై : నటుడు జెమినీ గణేశన్‌ కుమార్తెలు అందరూ కలిసిన ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. మహానటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కిన నడిగైయార్‌ తిలగం (తెలుగులో మహానటి)  చిత్రం ఇటీవల తెరపైకి వచ్చి విశేష ప్రజాదరణ పొందుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో తన తండ్రి జెమినీ గణేశన్‌ను వాస్తవాలకు భిన్నంగా చూపించారని ఆయన కుమార్తెల్లో ఒకరైన కమలా సెల్వరాజ్‌ ఆరోపణలు చేశారు. అంతేకాకుండా తన తండ్రిపై ఓ డాక్యుమెంటరీని నిర్మించనున్నట్లు ప్రకటన చేశారు.

కాగా జెమినీ గణేశన్‌కు అలిమేలు, పుష్పవల్లి, సావిత్రి, జూలియాను వివాహం చేసుకున్న విషయం విదితమే. జెమినీ గణేశన్‌కు ఏడుగురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఇక డాక్టర్‌ జయ శ్రీధర్‌, డాక్టర్‌ రేవితి స్వామినాధన్‌, డాక్టర్‌ కమలా సెల్వరాజ్‌, నారాయణి గణేశన్‌ మొదటి భార్య అలిమేలు కుమార్తెలు. ఇక బాలీవుడ్‌ నటి రేఖ, రాధా సయ్యద్‌ ...పుష్పవల్లి కుమార్తెలు కాగా వీరిలో మూడో భార్య సావిత్రి. ఆమె కుమార్తె విజయ చాముండేశ్వరి, కుమారుడు సతీష్‌. వీరంతా ఒక్క  తల్లి బిడ్డలు కాకపోయినా అందరూ అక్కాచెల్లెళ్లుగా ప్రేమాభిమానాలు కురిపించుకుంటారు. ప్రతి ఏడాది ఒక వేడుకలా అందరూ కలుసుకుంటారు. అలాంటి ఒక కలయిక శుక్రవారం రాత్రి చెన్నైలో చోటుచేసుకుంది. ఒకే వేదికపై జెమినీ గణేశన్‌ ఏడుగురు కుమార్తెలు కలిసి ఉన్న చిత్రం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top