నా భర్త తప్పేమీ లేదు: నటి | Actress Manisha Koirala speaks about marriage life | Sakshi
Sakshi News home page

నా భర్త తప్పేమీ లేదు: నటి

Jun 10 2017 10:19 AM | Updated on Sep 5 2017 1:17 PM

నా భర్త తప్పేమీ లేదు: నటి

నా భర్త తప్పేమీ లేదు: నటి

1990 దశకంలో దర్శకుల హీరోయిన్‌గా రాణించిన నటి మనీషా కోయిరాలా.

ముంబయి: 1990 దశకంలో దర్శకుల హీరోయిన్‌గా రాణించిన నటి మనీషా కోయిరాలా. ఆపై ప్రేమ వివాహంలో కలతలు, క్యాన్సర్ లాంటి మహమ్మారి బారిన పడి ఎన్నో కష్టాలను తట్టుకుని నిలబడ్డారు మనీషా. ప్రస్తుతం సంజయ్ దత్ బయోపిక్‌లో ఆయన తల్లి నర్గీస్ దత్‌గా కీలక పాత్రలో నటిస్తున్న ఈ బ్యూటీ వివాహం తర్వాత 'డియర్ మాయా'తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నేపాలీ భామ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 'మా వైవాహిక జీవితం నా కారణంగానే విఫలమైంది. వ్యాపారవేత్త సమ్రాట్‌ దహల్‌ను ఎంతగానో ప్రేమించాను. 2010లో నేపాలీ సంప్రదాయంలోనే ప్రేమ పెళ్లి చేసుకున్నాను. ఫేస్‌బుక్ పరిచయంతో మా ప్రేమ మొదలైంది.

పెళ్లయిన రెండేళ్లకే అంటే 2012లోనే మా బంధం తెగిపోయింది. ఇందుకు పూర్తి భాద్యత నాదే. నా భర్త సమ్రాట్‌ చాలా మంచివాడు. ఇందులో ఆయన తప్పేం లేదు. అందరు అమ్మాయిల్లాగే ఎన్నో కలలుకన్నాను. కానీ కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. బంధం గట్టిపడదని భావిస్తే విడిపోవడం ఇద్దరికీ మంచిదని నా అభిప్రాయం. విడాకుల ఆలోచన నాదే. ఇంకా చెప్పాలంటే పెళ్లి విషయంలో పెద్ద పొరపాటు చేశాననిపిస్తోంది.

2012లో విడాకులు తీసుకున్న కొన్ని రోజులకే క్యాన్సర్ బారిన పడ్డాను. మరుసటి ఏడాది విజయవంతంగా క్యాన్సర్‌ను జయించానని' మనీషా వివరించారు. మరోవైపు.. తన భర్త శత్రువుగా మారిపోయాడని 2011లో ఫేస్‌బుక్‌లో స్వయంగా పోస్ట్ చేసిన మనీషా.. ఇప్పుడు ఎందుకిలా స్వరం మార్చి తప్పును ఎందుకు తనపై వేసుకుంటుందని భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement