ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం | collector sathya narayana participate in voter day celebrations | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం

Jan 26 2018 1:31 PM | Updated on Mar 21 2019 8:35 PM

collector sathya narayana participate in voter day celebrations - Sakshi

కర్నూలు(అగ్రికల్చర్‌): ప్రజాస్వామ్యంలోఓటును మించిన వజ్రాయుధం లేదని, ఆ హక్కును సద్వినియోగం చేసుకోవడం ద్వారా సమర్థులైన పాలకులను ఎన్నుకుని వ్యవస్థ పరిరక్షణకు తోడ్పడాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పిలుపు నిచ్చారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్‌ సునయన ఆడిటోరియంలో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. ముందుగా ఓటు ప్రాధాన్యం, ఓటు హక్కు నమోదు, వినియోగించుకోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తూ కలెక్టరేట్‌ నుంచి రాజ్‌విహార్‌ సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించా రు. ర్యాలీని కలెక్టర్‌ ప్రారంభించారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, డీఆర్‌ఓ శశీదేవి, మున్సిపల్‌ కమిషనర్‌ హరినాథరెడ్డి, ఆర్‌డీఓ హుసేన్‌సాహెబ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సునయన ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడారు. ఓటర్లలో చైతన్యం నింపి ప్రలోభాలకు లోనుకాకుండా మంచి పాలకులను ఎన్నుకోవాలనే లక్ష్యంతో ఎన్నికల కమిషన్‌ జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహిస్తోందన్నా రు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావడంతో పాటు ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని కోరారు. ఓటు హక్కు కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

ప్రస్తుతం చేపట్టిన ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా అర్హత కలిగిన వారందరం ఓటర్లుగా నమోదవుదామని, ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటామని విద్యార్థులు, తదితరులతో కలెక్టర్‌ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమానికి ముఖ్యాతిథిగా హాజరైన జిల్లా జడ్జీ అనుపమ చక్రవర్తి మాట్లాడుతూ దేశ భవిష్యత్‌ను నిర్దేశించేది యువతేనని,  నిర్భయంగా, నిష్పక్ష పాతంగా ఓటు వేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలన్నారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ మాట్లాడుతూ ఓటుహక్కును సద్వినియోగం చేసుకుంటేనే నిజమైన ప్రజాసామ్యం ఏర్ప డుతుందన్నారు.  ప్రజాస్వాయ్యంలో ఓటుకు ఉన్న విలువ అపారమైందని జెడ్పీ చైర్మన్‌ మల్లెల రాజశేఖర్‌ అన్నారు. దేశాన్ని అసాంఘిక శక్తుల నుంచి కాపాడే శక్తి ఓటుకు ఉందని, దీన్ని స్వేచ్చగా వినియోగించుకోవాలని ఎస్పీ గోఫినాథ్‌జెట్టీ  పిలుపునిచ్చారు. ఓటర్ల దినోత్సవాన్ని పురష్కరించుకొని నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. సునయ న బయట నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు వేసిన ముగ్గులు అలరించాయి. వ్యాస, వక్తృత్వ పోటీలైన విజేతలైన విద్యార్థులకు, 2కేరన్‌లో గెలిచిన వారికి, ముగ్గుల పోటీల్లో గెలిచిన వారికి ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, కలెక్టర్‌ తదితరులు ప్రశాంసపత్రాలు, బహుమతులు అందజేశారు. డీఆర్‌డీఏ పీడీ రామకృష్ణ, ఐసీడీఎస్‌ పీడీ జుబేదాబేగం, డీఈఓ తహేరాసుల్తానా, ఆర్‌ఐఓ పరమేశ్వరరెడ్డి, కర్నూలు, కల్లూరు తహసీల్దార్లు రమేష్‌బాబు, నరేంద్రనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement